Sunday, April 20, 2014

వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం|

కపిల రాంకుమార్|| వినూత్నరీతిలో ఖమ్మం సాహితీ స్రవంతి జయ ఉగాది కవి సమ్మేళనం||

ఆమని '' ఉగాది కవితా సంపుటాన్ని ప్రముఖ కవి, నాటక రచయిత, దర్శకుడు బాణాల కృష్ణమచారి చేతుల మీదుగా ఆవిష్కరించిన పిదప సంపాదకత్వం వహించిన బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్ మాట్లాడారు. . జయనామ వత్సరానికి స్వాగతం పలుకుతూ '' మన తెలుగువారికి ప్రధానమైన సంస్కృతీ సంప్రదాయాలలో భాగంగా కుటుంబ యావత్తు ఆనందంగా కోటి ఆశలతో, కొత్తపథకాల రూపకల్పనతో కొంగ్రొత్త ఆలోచనలతో నూతన నిర్ణయాలతో జరుపుకునే పర్వదినం ' ఉగాది ' కి విశిష్ట స్థానం వుంది అని '' తదనంతరం, కపిల రాంకుమార్ తన సంపాదకీయాన్ని కొనసాగిస్తూ '' మన భాషా సంస్కృతులు, మానవ సంబంధాలు ప్రస్తుతం పడమటిగాలి వడదెబ్బ కు సోలిపోకుండా, ప్రపంచం మొత్తం ఆవహించిన మత ఛాందస వాదానికి, ఉగ్రవాదానికి,ప్రపంచీకరణ ముసుగులో ముంచుకొస్తున్న గ్లోబలీకరణకి తట్టుకుని నిలబడాలనే తలంపుతోనే భావ సారూప్యం కల కవులు, కళాకారులు 1999 జనవరి 26 తేదీన ఖమ్మం పట్టణంలో సాహితీ స్రవంతిని ఒక వేదికగా ఏర్పాటుచేసుకుని గత 15 సంవత్సరాలు అనుబంధాన్ని పెంచుకుంటూ,కేవలం ఖమ్మంలో ఆవిర్భవించి నా, రాష్ట్ర షాయి సంస్థగా ఏర్పడటానికి, అంతేకాక, దాని ఆధ్వర్యంలో సాహిత్య ప్రస్థానం అనే సాహిత్య మాస పత్రికగా జనాదరణ పొందటానికి కొద్దో గొప్పో ఖమ్మం పాత్ర గణనీయమైనదేనని చెప్పుకునేందుకు నయంగానే గర్వపడుతున్నామని, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహిస్తూనే ఒక గుర్తింపు పొందామని, దానిని నిలబెట్టుకోవాలని, అందుకు నిబద్ధత, నిమగ్నత కలిగిన సాహితీ కార్యకర్తల కృషి అవసరం ఎంతైనావుందని, కొత్త వారిని ప్రోత్సహించటం. మెలుకువలు నేర్పటం సదస్సులు, శిక్షణాతరగతులు నిర్వహించటంలాంటి కార్యక్రమాలు చేస్తూనేవున్నామని,. ఇంకా మరిన్ని అలాంటివి కొనసాగించాలనే కృత నిశ్చయంతో వున్నామని, అందులో భాగంగానే గత సంవత్సరం జూలై నెల నుండి మూడవ ఆదివారంలో ప్రతి నెల సాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తూ, దాదాపు 20 నుండి 35 మంది దాక హాజరవుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక, కవిత్వ పఠనం, చర్చ, సాహిత్య ప్రసంగములు నిర్వహిస్తున్నామని, ఇది ఒక అపూర్వ ప్రయోగంగానూ, ఉపయుక్తంగానూ, వుందని తెలిపారు.ఈ సంవత్సరం సాహితీ స్రవంతి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సాహితీ సంచిక ప్రత్యేకంగా తేవాలని అనుకుంటున్నామన్నారు . ఆప్రయత్నంలో భాగంగానే ఈ జయనామ ఉగాదికి ఎంపిక చేసిన కవితలను మీ ముందుంచుతున్నానని, సలహాలు, సూచనలు కోరారు. ఇందులో సమకాలీన, సామాజిక రాజకీయ అంశాలతో పాటు పండుగ నేపథ్యాన్ని మిళితం చేసి, షడ్రుచుల సమ్మిశ్రితంగా కవితలు, పద్యాలు, గేయాలు, మీకు దర్శనమిస్తాయని, వీటిని ఒక చోటికి తేవటం సంకలనపరచడం కత్తిమీద సామైనా సాహితీ స్రవంతి కార్యకర్తల తోడ్పాటుతో ఈ చిన్న రూపం తేవడంలో యేమాత్రం సాఫల్యం చెందామో కాని, ఒక చిన్న సంతృప్తి మాత్రం కలుగుతోంది. ఆదరించి, అహ్వానించిన వెంటనే స్పందించి కవితలు పంపినవారికి, సహకరించిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుముందు కూడ ఇలానే ఇదే స్ఫూర్తితో తోడ్పడాలని వేడుకుంటూ, పేరుకే సంకలనకర్తనే కాని యిది అందరి సమిష్టి కృషి అనిమాత్రం చెప్పక తప్పదు. మరొక్కమారు అందరికి నూతన సంవత్సర అభినందనలు తెలియచేసారు.ఈ సమావేశానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి అధ్యక్షత వహించగా, సాహితీ స్రవంతి జిల్లాకార్యదర్శి రౌతు రవి, అతిథులను వేదికపకి అహ్వానించి తన నివేదిక సమర్పించచారు
ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మానికి చెందిన సీనియర్ కవులను, సాహిత్యాభిమానులను సన్మానించారు. బాణాల కృష్ణమాచారి, కోటీ శశిశ్రీ, కపిల రాంకుమార్, వురిమళ్ళ సునంద, టి.ఎల్. లక్ష్మీనరసయ్య, డా. పొత్తూరి సుబ్బారావు, డా.కావూరి పాపయ్య శాస్త్రి, డా.కవితాంజనేయులు, మొదలగు వారు సన్మానంపొందిన వారిలోవున్నారు. తదుపరి కన్నెగంటి వెంకటయ్య, సునంద, కపిల రాంకుమార్, నిర్వహణలో కవి సమ్మేళనం కొనసాగింది. ఇరవైరెండు మంది కవితలను పుస్తకరూపంలో సంకలనం కావించగా, వీరు కాక, మరో పదిహేనుమంది తమ కవితలను చదివి వినిపించారు. మాజీ మునిపల్ చైర్ పర్సన్‌ అఫ్రోజ్‌ సమీనా, సి.ఐ.టి.యు నాయకులు ఎర్రా శ్రీకాంత్, ప్రముఖ రంగస్థల కళాకారుడు అద్దంకి కృష్ణప్రసాద్, బి.వి.కె. డిప్యూటి జనరల్ మేనేజర్ కందాడై శ్రీనివాసులు మొదలగు వారు సందేశమిచ్చారు.

పండుగ బలహీనతని రాజకీయ నాయకులు ఎలా అవకాశంగా తీసుకుని సామాన్యుని అవసరాలపై ఎలా వల వేస్తారో, ఆశపడి, బోర్లపడిం సామాన్యుని వేదన తన కవితలో రాంకుమార్, ఆరు ఋతువులు సమ్మేళనం ఈ ఉగాది అంటూ సునంద, మానవాళి మేలుకొరకు మరింత వెలుగులు నింపాలని ఆశతో శైలజ, ఏది ఏమైనా కోయిలా ఒట్ల పండుగని వెంటేసుకుని వొచ్చావులే అంటూ కన్నెగంటి చమత్కరించగా, కాలాన్ని నిర్వ్చిస్తూ చక్కటి చమత్కార కవిత గిరి నరసింహారావు, శిసిరంలో రాలిన పండుటాకుల్ని లెక్కిస్తూ, తొక్కేస్తూ ఋతువుల క్రమాన్ని తన కవితలో బంధించిన వనం తేజశ్రీ, ఎన్ని ఉగాదులొస్తేనేం, మనిషి మనసుని మార్చగలవా అని ప్రశ్నిస్తూ పోట్ల సుధారాణి, '' జయాలనిచ్చే ఉషోదయానికై '' అంటూ గేయ రూపంలో ఉగాదిని స్వాగతించిన సంపటం దుర్గా ప్రసాదరావు, పండుగ సంబరమొకరోజే కాని సాలు పొడుగునా వైఫల్యాలెన్నో ఇన్నేళ్ళ ఉగాదుల వెంట వస్తూనే వున్నాయంటూ చావా జయప్రద, ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుమంకున్న ఉగాదే అంటూ చతుర్తలు కూడిన కవితతో మేడగాని శేషగిరి, కలవరపడకే కోయిలా అంటూ హెచ్చరిస్తూ కంచర్ల శ్రీనివాస్, కోకొఇల స్వరాలకు బదులు కాకుర స్వరాలు.. పల్లెల్లోనూ, గల్లీల్లోనూ వినిపిస్తున్నాయంటూ కవితాంజనేయులు, స్వాగతం కవితతో బూడిద అరుణ గౌడ్, షడ్రుచులతో కృష్ణవేణి, కొత్త ఆశలతో సీతారామారావు, పాడవే కోయిలా గొంతెత్తి యుగగీతి గేయంతో రౌతురవి, జయ ఉగాది పై చక్కటి సంప్రదాయ వృత్తాలతో డా.పొత్త్రి సుబ్బారావు, డా. పాపయ్య శాస్త్రి, తాగుబోతోడి శ్రీమతి తంటాలను చమత్కారంగా పావే రావు, పండుగ హడావుడి - హాస్య రూపకాన్ని రౌతు కడలి, ఎన్నికల వేళ మతంరంగు పులుముకుని దాడిచేయబోయే వాడిని గుర్తుపట్టానంటూ బండారు రమేష్, ప్రతీ దానినీ నిశితంగా, నిజాయితీగా చూడటం నేర్చుకోవాలని కె. ఆనందాచారి, బతికేవున్నామని ఓ ఐదేళ్ళకోసారి గుర్తుచేసుకోవటమేనా - ఎన్నీకలంటే అంటూ తీవ్ర స్వరం వినిపించిన పోతగాని, పర్వదిన్నం పేరుతో నైనా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవటం యెంతో అవసరమని గజేంద్ర సైదులు. ఇచేఏ పైసలకు ఆశపడితే పడ్డావు కాని, ఓటు మాత్రం అర్హత కలిగిన వాడికే వెయ్యాలి సుమా అంటూ ఆలేటి పరంజ్యోతి కవితలు అందర్ని అలరించాయి. వివిధ ప్రజా సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగ సంఘనాయకులు, పట్టణంలోని ప్రముఖ న్యాయవాదులు, వ్యాపారస్తులు , మహిళాసంఘ నాయకులు, ఆదివారం మీ కోసం అధ్యక్ష, కార్యదర్శులు మొదలగువారు పాల్గొన్నారు. బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వాహకులు ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహార వచ్చిన వారందరికి పండుగ ఆతిథ్యాన్ని అందించారు. ఎం.శేషగిరి , కన్నెగంటి వెంకటయ్య, మరియు కళానిలయం బృందం వారు తమ గీతాలాతో అలరించారు.
**
--కపిల రాంకుమార్ 9849535033 (4.4.2014/19-4-2014)

No comments: