Tuesday, December 22, 2015

||కర్రుకాల్సి వాతెయ్యాలిరా తమ్మీ!!



కపిల రాంకుమార్
||కర్రుకాల్సి  వాతెయ్యాలిరా తమ్మీ!!||

ఉద్యమం మాంచి-కాకమీదున్నపుడు
కుర్ర్కారుకు వెర్రెక్కించి
అరసేతి ఐకుంఠ పదవుల
పందేరం వెట్టి
తీరా ఒడ్డుచేర్నంక
దుడ్డుతిరగేసే
చెర్నకోలమోతేందిరా బాయ్‌!
సేతులూపుడు, తలూపుడుతో,మనం సేతులు ముడువబట్టే
ఆ బాడ్కావునాకొడుకులు,
యిప్పుడు మాయమాటల్త
బోర్లాకొట్టిస్తున్నరుగదా            
గారడీవోనిలెక్క మోళీ చేసి బెదిరిస్తున్నరేందే,
తాయాత్తు కొనమంటూ!



యింటనున్న నలుగురికి
పీటేసి మస్తుగా కుశాలుచేసుకుంట
చుట్టాపోల్లకి మాత్రం చెట్లకింది కాపురమెట్టమంటున్నరు
గదేమి యిచిత్రమోగాని,
శాటువు సెప్పినట్టు 
కాకులకొట్టి గద్దలకేసిన తీర్ల
గోడదూకొచ్చినోన్ని
గద్దెమీద కూకోవెట్టి
పుట్టినసంది జెండామోసి
బుజం తీపుపెట్టి
అలమటించే మూగ జీవుల్ని
గడ్డికూడ విదల్చక
గదిమి తరిమికొట్టుడేంది?
అయినా నాకు తెల్వకడుగుతా
మన జనం మరీంత పిచ్చోళ్ళైతన్నరేందే?



నారుకూ నీటైన గింజలేకపోయినా,
నోటికాడికొచ్చేలోగా
గంజి దాకలి బళ్ళుమన్నా
దొరక్కదొరికిన ఆందానితో
అప్పు తీర్చేలోంగా
మిత్తి ఆసాంతం కట్టలేదని
కత్తిపెట్టి జులుంచేస్తావుంటే
రైతన్న  దీపమైతన్నాడేందే?
కడకంటా సాగాల్సిన ఎవసాయం
మద్దెలోనే బుడగ మాదిరి పేల్తావుంటే
పల్లెల్లో సావు డప్పులు జాతరమాదిరి కొనసాగుతుంటే
కళ్ళుండి సూడలేని,
చెవులుండి యినలేని
సర్కారిదిల్చే సాయానికీ
యెగనామమెట్టడానికెన్ని సాకులో
దీనమ్మ రైతు బతుక్కిదా నాయళ్ళిచ్చే యిలువ?
సకలం యిచ్చిన్నమై మట్టిపాలౌతుంటే యాగాలంటరేందివారి!
యెనకటికెవడో నీరోరాజుమాదిరి ఫిడేలు సంబురాలెంది...
గిసుమంటివి
మతుండిచేసే పనులేనా?
అందుకే యీయేల పతోడికి
కిందపైనా తెగకాల్తోంది వారి!
ఒకరినుండి ఒకరికి బుకారోలె
రాజుకుంటేకాని బడబాగ్నివుట్టదు!
మనమిప్పుడు కేకలేసుడుకాదు
గద్దెకిందకాకవెట్టాలె!
నేల తల్లి దద్దరిల్లెలా, 
కూష్మాండం బద్దలయ్యేలా
కొమ్ము బూర, డోలు డప్పు,కంజీర మద్దెల
మిర్మిట్ట్లుకొలొపేలా మోగాల మార్మోగాల!
తిండి మీద ఆనంటడొకడు!
ఉండనీకి నీడలేదంటడొకడు!
ఊర్కుంటే కాదు
ఉరికించి గదమాలె!
వూరిపొలిమేరల్ల పోరుజెండాలెత్తాలె!

Thursday, December 3, 2015

|| యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||

|యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||'శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు - పరిశీలన వ్యాసం నుండి||
***రచయితలలో అగ్రాసనం కవిది. ఇటీవల వాడుకలోకి వచ్చిన మాట రచయిత, పూర్వం కవిగానే సర్వత్ర వ్యవహారితం. సాహిత్య ప్రక్రియలలోకవిత ఆద్యం, సర్వ సాహిత్యాలలో తొలిపూత కవితే అని చరిత్ర తెలుపుతోంది. కావ్యాస్వాదన పాఠకుని సహృదయతను మెరుగుపెట్టి, నాగరికుణ్ణి చేస్తుంది. మనసుపైన సత్కవిత వేసే ముద్ర ఎన్నటికి చెరగనిది. దాని తావి తరుగులేనిది.2015 మే 6 నాటికి దిగంబర కవిత్వోద్యమం యాభై వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అంటే దిగంబరకవుల మొదటి సంపుటి 1965 మే 6న తెలుగు సాహిత్య రంగంలో ప్రవేశించింది ఈ సందర్భంగా ప్రపంచ సాహిత్య రంగంలో కూడ యిలాంటి ధోరణులు, లేదా తీక్షణమైన కవితాసృజన జరిగిందేమోనని గమనిస్తే ఈ క్రింది విషయాలు దృష్టికి వచ్చాయి. మన దిగంబరకవిత్వానికి దాదాపుసమకాలీన సాహిత్యం సృజన చేసిన వారిలో 1. సాన్ఫ్రాంసిస్కోలో ని బిట్నిక్కులు, 2. బ్రిటన్కు చెందిన యాంగ్రీ యంగ్మన్ 3. హంగేరికి చెందిన - గాయపడిన యువకులు 4. రష్యాకు చెందిన ఎతుషెంకో అనూనాయులు 5. హాలెండ్లోని - ప్రోవో ఉద్యమం, ఇక మన దేశంలోనే '' కలకత్తా లో ఆకలితరం కవులు '' ఉత్తర ప్రదేశ్లో అనామ కవిత్వోద్యమకారులు, మహారాష్టలోని ఆఫ్వర్గం వారి సాహిత్య ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిగంబర కవులపై ఉండివుండవచ్చునని ఆచార్య కాకర్ల వెంకట్రామ నరసింహ్వం గారు తమ ''ఆధునికాంధ్ర కవితా సమీక్ష'' లో పేర్కొన్నారు. ఈ ఆరుగురిలో చెరబండరాజు, జ్వాలాముఖి దివగంతులుకాగా, కొన్ని కారణాంతరాల వలన 1971 తరువాత సాహిత్య ప్రపంచాన్నుంచి తప్పుకుని మహాస్వప్న నెల్లూరు జిల్లా లింగ సముద్రంలోనూ, భైరవయ్య విజయనగరంలోను స్థిరపడ్డారు. నిఖిలేశ్వర్, నగ్నముని హైదరబాదులో వుంటూ సాహిత్య లోకంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.. మిగతా కవులకు భిన్నంగా వారి పేరుమీద వారాలని: స్నేహ వారం, విశృంఖల వారం, క్రాంతివారం, సృజన వారం వికాసవారం, అనంత వారంగా పేర్కొన్నారు. ఋతువులను ఆశఋతువు, తపన ఋతువు, అశ్రుఋతువు మదిర ఋతువు, విరహ ఋతువు, విషాద ఋతువులుగాను, సంవత్సరాలను నగ్న నామ సంవత్సరం నిఖిలేశ్వరనామ సంవత్సరం, జ్వాలాముఖినామ సంవత్సరం, చెరబండనామ సంవత్సరం, భైరవ నామ సంవత్సరం మహాస్వప్న నామ సంవత్సరాలుగా ప్రకటించడంద్వారా సాహిత్యంలో ఒక నూతన ఒరవడిగా మొదలైనట్లు భావించవచ్చు. వాటి క్రమంలో 6 సంపుటాలుగా వెలువరించాలని వారు మొదట భావించినా మూడు సంపుటాలను మాత్రమే పరిచయంచేసి అర్థంతరంగా అనివార్య కారణాల వల్ల ఆపివేయటం కొంత నిరాశ కలిగించినదని చెప్పవచ్చు.
** మొదటి సంపుటం ''ఇతి శాసనం'' లో దిగంబరశకం, నగ్ననామ సంవత్సరం ఆశఋఉతువు (సరిగ్గా క్రీ.శ.1965 మే)న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్న ప్రప్రధమంగా తాము దిగంబర కవిలమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేయడానికొస్తున్న నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భైరవయ్య, చెరబండరాజు, మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని పేజీల్లో పట్టుకోవడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ అంటూ వాళ్ళ ఆగమనాన్ని తెలియచేసారు.
రెండవ సంపుటం '' దిక్లు-30'' దిగంబరశకం, నిఖిలేశ్వరనామ సంవత్సరం, మదిర ఋతువు (సరిగ్గా క్రీ.శ.1966 డిసెంబర్) లో ఇంకా భయంభయంగా బానిసత్వంగా దుర్భరంగా, హేయంగా, ఛండాలంగావున్న ఆంఢ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితాప్రచురణ సమర్పిస్తున్నది అని దిగంబరశకాన్ని తెలియచేసారు.
మూడవసంపుటం: ప్రజల అవిద్యని, అజ్ఞానాన్ని, అశక్తతని, ఆసరాగా తీసుకుని దేశాన్ని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాలవాళ్ళు నేడు ప్రజలపై రుద్దుతున్న '' కుష్టు వ్యవస్థ''ని ఎదుర్కొంటూ దిగంబరకవులు పలికిన జ్వాలానామ సంవత్సరం, విషాద ఋతువు (సరిగ్గా క్రీ.శ. 1968 జూన్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్న్నది అని తెలియచేసారు. ఈ దేశంలో ఈ ఇరవైయేళ్ళ స్వాతంత్ర్యంలో భయంకరంగా, విజృంభించిన కులమత దురహంకారానికి, ధనమదంతో యధేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న గుండాయిజానికి సినిమా రొంపిలో ఈదులాడుతున్న యువతరం బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న మేథావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి ఈ కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల కోటేశు స్మృతికి ఈ మూడో సంపుటం అంకితం చేసారు. ( ఇది హర్షించదగ్గది) దిగంబరకవులు తమ మొదటి సంపుటిలో ఒక విషయాన్ని స్పష్టం చేసారు. తమ కవితా ప్రక్రియని వచన కవిత్వం అనమని, అననివ్వమని అన్నారు. ఇకనుండి దిగంబరకవులు తమ కవితా ఖండికను 'దిక్' అనే ఖండికలను దిక్కులనీ వ్యవహరిస్తారు. జబ్బుపొరల్ని చీల్చి కాస్మిక్ మార్గాన్ని నిర్దేశించేవి దిక్‌లు . మానవత్వపు విలువలే వీటిహద్దులని చాటారు…
**…
( ఇంకా వుంది - స్థలాభావం చేత సంక్షిప్త సమాచారం తీసుకున్నాను)
6-5.2015/3.12.2015

Wednesday, December 2, 2015

కపిల రాంకుమార్‌ || అస్తవ్యస్తమైన మనోచిత్రం ||

కపిల రాంకుమార్‌ ||  అస్తవ్యస్తమైన మనోచిత్రం ||
అక్కడకెళ్ళిన తరువాత
ఎందుకొచ్చానానని ఏడ్చాను,
మరుక్షణమే నిబ్బరించుకున్నాను
గతకాలపు మైలురాళ్ళను పాతిన
జిగినీదోస్తులెవరైనా
మాటల మరమరాలందిస్తారని!
నాలుగడుగులేసాను
నివ్వెరపోవటమే నా అంతు!
మామిడి చెట్టు కూలిపోయెంది
కొబ్బరిచెట్టు మాడిపోయింది!
శ్మశానంలో సమాధిలా పాత పెంకుటిల్లు!
తెలిసందప్పుడే కాలానికి ద్యాదాక్షిణ్యం లేదని
గొంతెత్తి ఆందోళన చేసినందుకు
కఠినచట్టపు చట్రంలో నలిగిపోయుంటారని
గ్రహించడానికి దాదాపు అర్థగంట పట్టింది!
ఎప్పుడూ కబుర్లాడుకునే చోట కాక
మస్తాను భాయ్‌ చాయడ్డాకాడికెళ్తేకాని
గతంలోని జెండా దిమ్మ పక్కనే
మరొక ఎర్రజెండా దిమ్మ కన్నీళ్ళెట్టుకున్న సవ్వడి
డికాషన్‌ బాయిలర్‌లో కుతకుత చప్పుడుకు
భిన్నంగా పలకరించింది!
అప్పుడుకాని లోకంలోకి రాలేదు!
అస్తవ్యస్తమైన మనోచిత్రాన్ని తొలగిస్తూ,
స్మారక స్థూపాన్ని చూసి విలపించడం కాదు
వారిలా మనమూ స్వరం వినిపించాలని
దిక్కులు పగిలేలా నినదించాలని
సందేశమిస్తున్నట్లనిపించి
పిడికిలి బిగించి, వందనం కావించి
కర్తవ్యం యేమిటో కనులముందు ఆవిష్కరించుకుని
కలానికిలా కలకలం సృష్టించే పనిపెట్టాను.
ప్రశ్నించడం
సమాధానం రాబట్టమే
మన లక్ష్యం కావాలి!
2.12.2015

Tuesday, November 24, 2015

డా. వై.ఆర్.కె.సాహితీ పురస్కారాలు - దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

కపిల రాంకుమార్‌ ||నివేదిక ||దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

డా. వై.ఆర్.కె. సాహితీపురస్కారాలందుకుంటున్న ఈ సభ ఒక ప్రత్యేకత సంతరించుకున్నదని, దేశమంతటా కవులు సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి యిచ్చివేస్తున్న సందర్భంలో, ఒక సాహిత్య అభిమాని, ప్రజావైద్యుడు కీ.శే. డా. వై.ఆర్.కె. గారి పేర అవార్డులు ఖమ్మం జిల్లాకు చెందిన వారు అందుకోవటమంటే, ఇవి  ప్రజా అవార్డులని తెలంగాణా సాహితి రాష్ట్ర కన్వీనర్ కె. ఆనందాచారి అన్నారు.

తెలంగాణ సాహితీ ఖమ్మ జిల్లా ఆధ్వర్యంలో 10.11.2015న దీపావళి కవి సమ్మేళనం మరియు సాహితీ పురస్కారాల సభకు తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు  కన్నెగంటి వెంకటయ్య అధ్యక్షతన స్థానిక బోడేపూడి  విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పలువురు వక్తలు మాట్లాడారు. డా. రాధాకృష్ణమూర్తి వ్యక్తిత్వం, ప్రజాసేవా, అధ్యయన శీలత, సాహితి అవగాహన పలు అంశాలను ప్రముఖులు తమ జ్ఞాపకాలను  గుర్తు చేసుకున్నారు. అత్యంత ఉత్సాహ వాతావరణంలో నిర్వహించబడింది.  ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు, విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు, విశ్రాంత ఆచార్యుడు డా. పి.వి.సుబ్బారావు,
జన విజ్ఞావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్ర రావు, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి వేదికపైఆశీనులయ్యారు.

తన అధ్యక్షోపాన్యాసంలో కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ ఒక ప్రత్యేక సందర్భంలో జరుపుకుంటున్న  సభ, ఒక తాత్త్విక కవితా విశ్లేషణను కలిగించి,వక్తగా, ప్రజా వైధ్యుడుగా, నడయాడే గ్రంథాలయంగా, ప్రజల మనిషిగా, పరిణితి చెందిన రాకజీయ వేత్తగా, అంతకంటే సామాజికవేత్తగా గొప్ప మానవహక్కుల పోరాట నేతగా, సామాజిక దార్శినికునిగా పేరొందిన మహా మనిషి కీ.శే.డా. వై.రాధాకృష్ణమూర్తిని స్మరించుకుంటూ ప్రథమ వర్థంతిజరిగిన సందర్భంలో పురస్కారాలు అందుకోవటం, మిగతా ప్రభుత్వ పురస్కారాలకు  భిన్నమైనదని చెప్పవచ్చునన్నారు.తెలంగాణసాహితి రాష్ట్ర కన్వీనరు కె.ఆనందాచారి మాట్లాదుతూ పురస్కారాలు అందుకుంటున్న కవులకు మొదటగా అభినందనలు తెలిపారు.గతంలో ఖమ్మం సాహితీ గుమ్మంలో సాహితీ సేద్య చేసిన మహామహులతో మహా కవి శ్రీశ్రీ స్మారక సభను నిర్వహించిన తీరు అద్వితీయమైనదని,దాని నిర్వహణలో అంతా తానై డా. వై.ఆర్.కె. ప్రత్యేక సంచికలో ఒక వ్యాసం  రాస్తూ '' చంద్రునికో నూలుపోగు '' శీర్షికలో  శ్రీశ్రీ బహుముఖ కోణాల్లో వర్ణించిన వారి వ్యాస శైలి వారి మేథోపాఠవానికి తార్కాణమని, ఎందరినో ఆలోచింపచేసిన వ్యాసమని కొనియాడారు.ప్రస్థుత సమాజంలో సర్కారు వైఖరిపై నిరసనగా కవి ద్రష్ట కాబట్టి 100 మంది కవులు తమ అవార్డులు వాపసి యిచ్చేయడంలో '' కవులంటే ఏమనుకుంటున్నారు - కవులకు వేయి కళ్ళుంటాయి '' అనే కవితను చదివి రసజ్ఞులను ఉర్రూతలూగించారు.

డా.పొత్తూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తనకు డాక్టరుగారికివున్న అత్యంత సాన్నిహిత్యంగురించి ఎన్నో విషయాలుతెలియచేసారు.క్రిటిక్ డాక్టర్ వై.ఆర్.కె ను ప్రస్థుతిస్తూ ఎల్లపుడూ, కవి ధర్మాగ్రహాన్ని ప్రదర్శించకలగాలని ఉద్బోధించారు. 1645 లో జాన్మిల్టన్ రాసిన పుస్తకం పత్రికా స్వేచ్ఛకు ఒక బైబిల్ లాంటిదని. కవికి వశ్యవాక్కుంటుంది. కేవలం కవులు, కళాకారులు మాత్రమే ప్రతీపశక్తులను
ఎదుర్కొంటారనేది అక్షర సత్యమని తెలిపారు.

జనవిజ్ఞానవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రరావు ప్రజాసైన్స్ ఉద్యమంతో డాక్టరుగారికున్న నిబద్ధత, నిజాయితీని గుర్తుచేసారు.సమాజం ఎల్లపుడు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పథంవైపే చూస్తూవుంటూందని, దాని నుండే ప్రజాహితం ఆశిస్తుందని. తిరుగులేని విజ్ఞానమే ప్రగతికి సోపానమని డాక్టరుగారు నొక్కి చెప్పేవారని తెలిపారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మతోన్మాదుల ఆగడాలు,
దుశ్చర్యలు ఎక్కువైనాయని, కాని ప్రజలే చరిత్ర నిర్మాతలనేదిచరిత్ర చెప్పే వాస్తవమని, యదార్థమని ఉటంకించారు.

ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు మాట్లాడుతూ తన పుస్తకావిష్కరణ సభే డాక్టరుగారితో అఖరిదవటం కొంచెం బాధకలిగించినా, వారిచ్చిన ప్రోత్సాహం నేనెన్నటికి మరువజాలనని, వారి సూచనలతోనే నా కథలను ఎక్కువగా క్షేత్రపరిశీలన పిదపే ఆరంభిస్తుంటానని. ఈ మధ్యనే 
హంపీ వెళ్ళటం తటస్థించిందని, ఆ నేపథ్యంలో త్వరలో ఓ కథకు రూపకల్పన చేస్తున్నానని, పరిసరాల అవగాహన కవులకు అవసరమని తెలిపారు.

ప్రముఖ విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ 1989 నుండి 2000 వరకు వై.ఆర్.కె.తోనున్న అవ్యాజానుబంధాన్ని నెమరు వేసారు. ఎన్నో రాత్రుళ్ళు ఇద్దరం సుదీర్ఘ సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలపై గంటలతరబడి చర్చించుకునేవారమని తెలిపారు. నేను  రాసిన ' సమాంతర
ఛాయలు ' వై.ఆర్.కె. గారి చివరి రోజుల్లో అందించాను. వారిసాహచర్యంలోనే నాకీ హృదయస్పందన అలవదిందని అన్నారు. వస్తువుని నిజ దర్శనం చేయకలిగినవాడు మంచి కవి అవితాడం, ప్రతిపక్షం లేకపోయినా, కవులుంటే చాలని అంటూ, '' నాకు నమ్మకమివ్వండి '' అనే ఆలూరి బైరాగి
కవితను ఉటంకించారు.
డా. పిల్లలమర్రి సుబ్బారావు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురియయ్యారు. కొడుకులా ఆదరించి, వైద్యవిధానంలో మెళుకువలు నేర్పి, ఒక వైద్యుడిగా ఇలా నిలబెట్టిన మహానుభావుని సాహచర్యం జన్మ జన్మలకు మరువలేనిదని గద్గద స్వరంతోతన బాధను అందరితో పంచుకున్నారు.  30 సంవత్సరాలు పైగా వారితో నడిచాను కాబట్టే, వారన్నట్టు  నేను కింద పడినా జెండాను కిందపడనివ్వనని, పైకేవుంచుతానని వారికి మాటిచ్చాను. అది నిలబెట్టుకుంటానని, వారి పేర సాహితి వార్డులు వారి పరోక్షంలో నేను అందించే కార్యక్రమాన్ని తలెత్తుకున్నందుకు కొంత మనశ్శాంతిగావుందని తెలిపారు. కవులకు అభినందనలు తెలిపి ముగించారు. 

కథా రచయిత శిరంసెట్టి కాంతారావు,  కథా రచయిత రాచమళ్ళ ఉపేందర్, సంపటం దుర్గా ప్రసాదరావు, గద్దపాటి శ్రీనివాసారావు, కవయిత్రులు  శ్రీమతి సునంద, సుభాషిణి తోట, నవతెలంగాణా ఖమ్మ జిల్లా అక్షరం సారథి, పాత్రికేయ కవి నామాపురుషోత్తం, కటికోఝ్వల రమేష్, కపిల రాంకుమార్లకు అమరజీవి డా. వై.ఆర్.కె. సాహితీ పురస్కారాలు అందచేసారు.
మేడగాని శేషగిరి, సంపటం దుర్గా ప్రసాదరావుల సమన్వయంలో దీపావళి కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా, దీపావళి టపాసుల్లా, ఆటంబాంబుల్లా, మార్మ్రోగి రసజ్ఞులైన శ్రోతలను అలరించింది. కవిసమ్మేళనం సినారె గజల్ తో శేషగిరి ఆరంబించి తన గాత్ర మాధుర్యంతో అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసారు. దీపావళికీ కవుత్వం రాయొచ్చు అనే కవితలో గద్దపాటి శ్రీనివాసరావు '' పెరిగిపోతున్న పాపాలమీద,సంఘాలమీద, సంఘ్పరివార్లమీద, రాని పరిహారాలమీద,రాజకీయ పరిహాసాలమీద '' కవిత్వం రాయొచ్చంటారు. చిరునామా ఎక్కడ అనే కవితలో తాళ్ళూరిరాధ - మానవత్వాన్ని ప్రతిబింబించే స్త్రీమూర్తి వర్ణన చేసారు.  జనం అనే కవితలో పొత్తూరి సీతారామారావు అమృత హృదయాల్లో
నేడలజడులు రేగుతున్నాయని మదనపడ్డారు. తిరగబడ్డ అక్షరం అనే కవితలో సుభాషిణీ తోట  గంగాయమునలంత పవిత్రం మన సాహిత్యమన్నారు. ఆటవికయుగపుటంచులనే కైతను ఆరంభించిన జీవన్ కూరుకుపోతున్న సంక్షుభిత సందర్భాన్ని ఆవిష్కరించారు. డా. వై.ఆర్.కె.తో అనుబంధాన్ని
శ్రోతలకు పంచారు. ఏ సభలోనైనా మాట్లాదవల్సివస్తే అంశాలన్నీ గుదిగుచ్చుకుని, ప్రసంగం పక్కదారి పట్టకూండా చెప్పవలసింది అందరికి స్పష్టంగా చేరేలా తయారయివచ్చే పద్ధతి అందరూ  అలవర్చుకుంటే మంచిదన్నారు.  దీపావళి పర్వదినమనే కవితను జయప్రద '' మన మధ్య నరకాసురులెందరో ఇంకా మిగిలేవున్నారని ఆవేదనవ్యక్తం చేసారు. హేతువాద ఉద్యమనాయకుడు క్రాంతికార్  తన కవితలో మతోన్మాదాన్ని నిరశిస్తూ చెణుకులు విసిరారు.అక్షరం అనే గేయంలో రౌతురవి '' రంగు పూస్తే అక్షరకిరణం మసగబారిపోదురా'' శ్రావ్యంగా వినిపించి శ్రోతలను ఉత్తేజితులను చేసారు. బ్రతుకు వెలుగుల బాట అనే కవితలో కె. రమేష్  బతుకులను దోపిడి చీకటి గుహల్లోకి నెట్టేసే విధానాన్ని
తన ముద్రతో ఆకట్టుకున్నారు. సత్యభామ అనే కవితలో నందిగామ నిర్మలాకుమారి పౌరాణిక అంశానికి సామాజిక స్పృహ కలిగించే కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ యిప్పుడు సత్యభామల అవసరం యెంతైనా వుందనేలా చదివి వినిపించారు. ఖమ్మం జిల్లా ఆధునిక కవిత్వంపై పరిశోధన చేస్తున్న తెలుగు జూనియర్ లెక్చరర్ నిజామాబాద్, పరిశోధనకు సంబంధించి తన అనుభవాలను కొన్నింటిని  శ్రోతలతో పంచుకున్నారు. అమ్మా నీకోఉత్తరం అంటూ దేవయ్య తన కవితలో భ్రూణ హత్యలను గర్హిస్తూ ఆర్ద్రత కలిగించారు. అవసరం అనివార్యమై అనే కవితలో వురిమళ్ళ సునంద  కోట్లాది ప్రశ్నలకు కొడవళ్ళే సమాధానాలి మొలవాలన్నారు. సరికొత్త దీపావళి అనే కవితలో రాచమళ్ళ ఉపేందర్ '' నేడు నరకాసురనికి నకలుగా మనిషి తయారవుతున్నాడని నేటి మనిషిపై చురకత్తులాంటి పదాలు విసిరారు.  కలం గొప్పదనమనే గీతాన్ని ఆవుల వీరభద్రం ఆలపిస్తూ '' పెన్నుమీద మన్ను పొయ్యద్దురా - అది గన్నై మొలుస్తుందిరా '' అంటూ అందరిని ఉత్తేజపరిచారు. భూప్రకంనల్లో అనే కవిత ఆలపిస్తూ ముచ్చర్ల ఇబ్రహీం '' పాటై పోటెత్తుతున్నాయి - భూ కంపనలన్నారు '' ఛాందసం సింహాసనమెక్కితే అనే శీర్షికతో  బండారు రమేష్  '' బుద్ధి జీవాలను శుద్ధి చేయడం కుదరదని, మట్టి పెళ్ళలా సంకెళ్ళను తెంచుకుంటాయని '' ఆక్రోశించారు. హెచ్చరిక అనే కవితతో జయరాజ్ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపించారు '' వాడిపొట్ట అబద్ధాల పుట్ట '' ఏలికలని పీలికలను చేయాలన్నారు. మధ్యలో విజయ కళాశాల ప్రధానాచార్యుడు జంపాల మధుసూదనరావు మాట్లాడుతూ '' ఆవేశం లేకపోతే కవిత్వం రాదని, కవులు ఇతరులతో అనుభవాలను పంచుకోవాలని, ఆవేశంతో పాటూ ఆలోచన ఎంతో అవసరం అని వక్కాణించారు.   దివ్వెలు అనే కవితలో కపిల రాంకుమార్ ''రాయిని పగలకొట్టవు/ ఒక్క రాజుని మార్చలేవు/వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని/చూస్తూ చూస్తూ పదిరూపాయల
నోటును కాల్చమనుండ్రి చూదాం!/గద్దెనెక్కిన నాయాళ్ళ  దిమ్మ తిరిగేలా భూచక్రాలు తిప్పి,ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను, /కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను కుళ్ళపొడవాలనివుంది!'' వర్తమానసమాజాన్ని తన సహజమైన స్వరంతో  దీపావళితో అనుసంధానంచేస్తూ బాణసంచాలంటి పదాలతో పోల్చటం వాటిని కాల్చినంత ఆనందం కలిగింది.
 శ్రోతలకు. శ్రీమతి ఉరిమళ్ళ సునంద వందన సమర్పణ కావించారు.
- 24-11-2015



Wednesday, November 18, 2015

BHASKAR: కవి పరిచయం -1

BHASKAR: కవి పరిచయం -1: శిష్ ట్లా ఉమామహేశ్వర రావు ( 1912 – 1953) మారో మారో – మారో మారో ఒకటి రెండూ – మూడు నాలుగు మారో మారో – మారో మారో .................

Tuesday, November 10, 2015

కపిల రాంకుమార్‌ || మనాది ||

కపిల రాంకుమార్‌ || మనాది ||
బువ్వకే గతిలేదు
యిగ దివ్వెల పండుగొచ్చి మీదపడుటేంది!
మనాదితో ఏడుకండేల బావిలో
పునాది తవ్వుకున్నాట్టు బతుకు
కునారిల్లుతుంటే
కాకరపూల సోయగమేమెక్కుతాది?
పసికూనల ముఖాలువాడివత్తలైతావుంటే
తాగ పాలు లేవు, అయితే మాన్లే
గంజినీరు కరువాయే!
మతాబులు కాల్చే తీర్కేడిది
యింటి సుట్టు మురుగుతో
దోమలతోలేటందుకే సరిపోతుంటే
పైసలువెట్టి పండగేట్టా సేత్తాననుకున్నావు?
సర్రున తారాజువ్వలెగరేసే దమ్ములేదు
అవేమీ అంబరాన్ని తాకలేవు
భళ్ళున కిందవడుడేకాని,
పైకెళ్ళిన ధరల్ని దింపేటివి కావుకదా
కర్సుదండగ!
ఒక్కమాట సెప్పాలే
కుదిరితే విష్ణు చక్రాలు తిప్పాలనివుంది
లోకమంతా తలబిరుసునాయాళ్ళ తలలు నరకాలిగంద!
చిచ్చుపెట్టే బుద్ధులున్న జనాల మధ్య
తుస్‌ బుస్సుమని చిచ్చుబుడ్లు యేం సరిపోతాయి ?
మట్లాడితే గయ్‌గయ్‌మని పైకి ఎగరటమే కాని
ఆకాశాన్ని అందుకోలేరు,
ఆవకాశాల్ని దొర్కబుచ్చుకోలేరు
మనకుర్రకారు రవ్వల రాకెట్టు లాగా పైకి ఎగిరినట్టే
ఎగిరి కిందపడటమే కదా!
అప్పుడప్పుడు చిటపటమంటూ ధర్నాలు
బందులు సేసుడే కాని సీమటపాకాయంత విలువావుండది
అఁ.. సెవులు  సిల్లులుపడేలా దేబురింతలు, డాబుసరి డప్పులా
కొద్ది ఔట్లు, మరొకొన్ని ఆటంబాబులు
ఆకాశరామన్న ఉత్తరల్లా డబాయించుడే కాని
ఒక్క రాయిని పగలకొట్టవు
ఒక్క రాజుని మార్చలేవు
వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని
చూస్తూ చూస్తూ పదిరూపాయల నోటును కాల్చమనుండ్రి చూదాం!
గద్దెనెక్కిన నాయాళ్ళ దిమ్మ తిరిగేలా
భూచక్రాలు తిప్పి,
ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను,
కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను
కుళ్ళపొడవాలనివుంది!
తాటి బుర్రలో పటాసు మందు దట్టించి
తోలు లేచేలా దిష్టి యంత్రాలు పెట్టాల్నుంది.
ఎన్ని సట్టాలు సేసినా, ఎన్ని డేగకళ్ళు నిఘా కాసినా
ఆగని అత్యాచారాలమీద మన్నువడ
దాష్టీకం చేసేటోళ్ళ హంసలను లేపేయ్యాలనివుంది
కాని హింస మార్గం కాదు కాని
దుమ్మెత్తిబోసి శాపనార్థాలుకు తప్పులేదు
అప్పుడు కాని నా మనాది
కుదుటపడదు.!

 

Saturday, November 7, 2015

కపిల రాంకుమార్‌ || తెగింపు కావాలి!||

కపిల రాంకుమార్‌ || తెగింపు కావాలి!||
'' ఆడది అంటే
అలుసా
ఆడించినట్టు ఆడుతుందనా?
కాని
నేటి
ఆడది
'' ఆడ '' ది కాదు ఇక్కడిదే,
ఇప్పటిదే!
నీ జాఢ్యం వదిలించే
పెద్ద బాడిశవుతుంది
మదాన్ని చిత్రిపట్టి పొరలుగా చెక్కుతుంది
అతిచేస్తే
ఉత్తుత్తిగా కాదు
తిత్తితో సహా
కత్తిరిస్తుంది ''
తెగించిన వాడికి తెడ్డే లింగమయితే
తెగింపు కలిగినదానికి అరచేయే
ఖడ్గంమవుతుంది! ''
ఈ నాకల నిజంకావాలని
కలాన్ని, గళాన్ని
మహిళలన్ని కోరుకుంటాను!
7.10.2015

Saturday, October 3, 2015

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||
మొహమాటంలేకుండా
ఏకిపారేసుడులో పెద్దన్న
తప్పుడు పాలకులెవరైనా
తన మాటల వేటుకు తప్పించుకోలేరన్న!
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయమన్న,
దూర్జటికి కంటే నాలుగాకులు మస్తుగ సదివిండు!
పోతనకుమల్లే రాచరికపు భజన కాదని
ప్రజాస్వామ్యమే వంటపట్టించుకున్నోడు గనుకే
ప్రజా కైతల సేద్యం చేసిండు!
శిశుపాలుని తప్పులలెక్కపెట్టి
సర్కారుచెవుల సిల్లువడాల్సిందే కాని
గిసుమంత కూడ వెనుకడుగేయలేదు!
సప్పుడు ఎక్కువే - ఘాటైన మాటలతో
ముక్కు సూటిదనం చూపుకూడా సూదంటిరాయే!
ప్రజల సోయి యాదమరిస్తే
బొందపెట్టేది నిక్కమన్నాడు
కౌన్సిల్లో సర్కారుకు చాకిరేవు పెట్టిండు
బొక్కసానికి చిల్లుపెడితే
డొక్క చించుతానన్నాడు
కాళమునకు ఖలేజా అద్దినట్టుండే
కైతల రైతుబిడ్డ కాళోజి!
నోరెత్తటం ఏ సర్కారుకీ యిష్టముండదు
నోరెత్తకపోతే కాళోజి కలం నడువదు!
రెంటికెపుడూ గొడవే
పోరాటంచేయకతప్పదు
పోయేవి బానిస సంకెళ్ళు అన్నట్టు
రాష్ట్ర, దేశ పాలకవర్గాలపై
పదునెక్కన పాటలా
అదునుచూచి పేలే తూటాలా
ఎందరికో స్ఫూర్తినిచ్చిండు!
బడుల యిజ్జతు, దవఖాన్ల తీరు,
చట్టసభల తగువులాట
నీటికాడ, కూటికాడ
బతుకుతెరువు పాకులాట
పెత్తనాల తగాదాల గొడవెలెన్నో
నీ, నా గొడవగా చేదీపమందించి
దోపిడి చేస్తే దోస్తానాలుండవు
తోటోడైనా సంజోతాలుండవ్
ఏ పార్టీ వాడైనా వాడు ఏ పాటివాడో
తీరుమానం చేయాలంటాడు!
మంచి సబ్బరిలేకుండా
పాలన చేసేటోడు
మావోడైనా, మీవోడైనా
మావో చెప్పినా మార్క్స్ చెప్పినా
మంచి మంచే, చెడు చెడే
బేరీజువేసుకోమన్నాడు!
గసుమంటోడు కాబట్టే
తాను బతికున్నన్నాళ్ళు
మూడోనేత్రంతోనే లోకాన్ని చూసాడు!
మనలనీ చూడమన్నాడు!
ప్రజల పక్షం వహించమన్నాడు!.
9849535033

అల్విదా || కౌముది ( కీ.శే.||షంషుద్దీన్‌-ఖమ్మం ]

అల్విదా || కౌముది ( కీ.శే.||షంషుద్దీన్‌-ఖమ్మం ] ||
గీత శిల్పి వెళ్ళిపోయాడు - గీతం తెగిపోయింది
ఏ సంకేతమూ లేకుండా - ఎవ్వరికీ చెప్పకుండా
అనుకోకుండా తెగి గాలిలో - కరిగిపోయే నక్షత్రంలా
అకస్మాత్తుగా జారి - మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా
ఉన్నట్టుండి హఠాత్తుగా - సభలో మధ్యలో తలవంచుకొని
షాయర్‌ వెళ్ళిపోయాడు - ముషాయరా ఆగిపోయింది
పరువం పోయింది - పరిమళం పోయింది
కవి హృదయం పోయింది - కవి ఉదయం పోయింది
సొగసు పోయింది - సోయగం పోయింది
ఆదమరచి నిద్రపోతున్న బీదరాలి వక్షస్థలం మీద
సామాన్యుడు భద్రంగా దాచుకున్న
చిర రుచిర స్వప్నాల కెంపుమీద కవిత్వం సొంపు మీద
తిలంగన్‌మీద తెలుగువాడిమీద -
భాగమతిమీద అభాగ్యులందరి నడినెత్తిమీద
మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది.
గీత శిల్పి వెళ్ళిపోయాడు - జ్యోతి ఆరిపోయింది
జైళ్ళను, కన్నీళ్ళను, రైఫిళ్ళను, రాపిళ్ళను
సోదరులందరితో కలిసి - సాదరంగా పంచుకున్నవాడు
రాళ్ళను కవ్వించినవాడు - మోళ్ళను నవ్వించినవాడు
పరిస్థితుల కఠిన శిలా వర్షాలకు -
పగిలిపోనిమాదర్శాల గాజుమేడ కట్టినవాడు
వర్గాలు, వర్ణాలు వైషమ్యాలులేని - స్వర్గాలకోసం కలగన్నవాడు
అరుణధ్వజానికి అరుణోషస్సుకని -
ఎర్ర ఎర్రటి ఆశలకు - ఎర్రటి కలలకు
అంకితమైనపోయిన దీన బంధువు -
బిందువులో ఇమిడిపోయిన సింధువు
అవనిని ఆకాశానికి ఎత్తినవాడు -
ఆకాశాన్ని అవనిమీదకు దింపినవాడు
నిప్పులో మంచును - మంచులో నిప్పును పుట్టించినవాడు
ఆడవాళ్ళ చొల్లులో అబద్ధాలలో - సానివాడల్లో సారాయి కంపుల్లో
నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి - అగ్ని భిక్ష పెట్టినవాడు
ఉడుగనాల చెక్కిళ్ళమీది ఉజ్వలమైన వెలుగును
వసంతాలకాంతినీ, క్రాంతినీ మేళవించి
సంధ్యారాగసలిలాన్నీ జ్యోత్స్నాద్రవాన్నీ కలిపి
అపురూపమైన శిల్పాలకు రూప సృష్టిచేసినవాడు
శబ్దాలకు ప్రాణంపోసి సమరాలకు నడిపించిన కవి
అపరాత్రి ఆకాశంమీద పొడచూపిన అర్ణఛవి
కలంవిడిచి, కలల్ని విడిచి, కలకలం విడిచి
రక్తం కక్కుతున్న క్షోభనూ, క్షామాల్నీ విడిచి
అట్టకట్టిన చెక్కిళ్ళానూ, క్రక్కటిల్లుతూన్న పెదవుల్నీ విడిచి
ఆకాశాన్ని చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి
దు:ఖాల కొండల్నిమోస్తూ తిరిగే చిన్నచిన్న గుండెల్ని విడిచి
ఉదయాల్ని విడిచి
సాహిత్యపదాల్ని విడిచి
వెన్నెల పువ్వుల్నీ, పువ్వుల నవ్వుల్నీ విడిచి
ఇంద్ర ధనుస్సుల్నీ, మందమారుతాల్నీ, తోటల్నీ, తూనీగల్నీ విడిచి
సొంతగుండెలు దగాచేసే సంఘాన్ని విడి
స్వరాన్నీ, సంగీతాన్నీ జీవిత సర్వస్వాన్ని విడిచి
గీత శిల్పి వెళ్ళిపోయాడు!
గీతం తెగిపోయింది.
********************************
స్మృతికవిత - తెలంగాణా మహాకవి మఖ్దూం మొహియిద్దీన్‌ మృతికి
స్పందన)
( కాకతీయ యూనివర్శిటి డిగ్రీ - తెలుగు పాఠ్యాంశం )
----------------------------------------------------

Saturday, August 22, 2015

కపిల రామ్‌కుమార్‌|| ఘర్షణ||

కపిల రామ్‌కుమార్‌|| ఘర్షణ||
ఊహ కళ్ళు తెరిచేలోగా
ఒళ్ళు విరుచుకుంటోంది కుతంత్రం!
లోచనాల ఆలోచనలను
రక్షించుకునేలోగానే
అంధత్వం పురుడుపోసుకుంటోంది!
గోడలకున్న రహస్యనేత్రాలు మాత్రమే
ఇలాంటి ఛిద్రాలకు ఒడికట్టుతాయ్‌!
అమాయకంగా ప్రతీసారి
ప్రజాస్వామ్యం
మోసగించబడుతూనేవుంటుంది!
నిర్బంధాలనెన్నో సహిస్తూనే
ఉద్యమం కొత్తదారి వెతుక్కుంటూవుంటుంది!
నిఘా కుక్కలుకూడ
తేనెపూసిన కత్తులవుతూ
అదును చూచి దెబ్బకొట్టడానికి
రెచ్చకొట్టే క్రీడానైపుణ్యం పెంచుకుంటూంటాయి!
నిబ్బరంగావుంటేనే నిజాయితి
బట్టకట్టి తలెత్తుకోకలుగుతుంది!
లేదా అన్యాయం వంచనా పథంలో
మిడతలదండునాదర్శంగా
పంటచేల నాశన కార్యం మొదలెట్టుతుంది!
నిరంతర ఘర్షణల్లో తలమునకలువేస్తూ
ఎత్తుగడల పంథా అనుసరించకపోతే,
అన్ని వర్గాలను సమకట్టకపోతే
గమ్యం గగనకుసుమమే అవుతుంది!
వైరుధ్యాల పొత్తుల పోటాపోటీలో
సమైక్య గమనమే అక్షర క్షిపణుల సాయంతో
సాంస్కృతిక విప్లవ చైతన్యంతో
పావులు కదిపితేనే
ప్రగతిశీల పావురం
స్వేచ్ఛగా ఎగరకలుగుతుంది!
సరళీకృత పడమటిగాలిని
నివారించకలుగుతుంది!
దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై
మనమే కొత్తరూపమెత్తాలి !
================
22 ఆగష్టు 2015 ఉదయం 9.45

Thursday, August 20, 2015

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||
--------------------------------------
శబ్ద చిత్రాలు
నిశ్శబ్దపు పరుగులతో
భావచిత్రాల్లా సింగారించుకుని
పాపిడి పిందెలతో పోటీగా
ముంగురులు సవరించుకుంటూనే
పద చిత్రాల లేజిగుర్లకై
వెంపర్లాడే కోకిలచానలౌతుంటే
రెండువేళ్ళ మధ్య ఓ కలం
కూచిపూడినాట్యం చేస్తూ
ఆరంగ్రేట్రం మొదలెట్టినపుడు
సుష్టుగా భుక్తాయాసం తీర్చుకుని
తాపీగా కుదుటపడ్డ కవి మానసిక స్థితికి
సాహిత్యపు సాయంకాలపుతెర
సీతమ్మవారి చీరలా అంబరాన
రంగులతో మురిపుస్తూ
మెరుస్తూ అందమైన
అపరంజి పద్యమై,హృద్యంగమమై
ఆహ్లాదపరుస్తున్నప్పుడు
కొంపలంటుకున్న రీతిలో
భీకర తుఫానులా
సమస్యల తోరణాలను తెగ్గొట్టే
నిబద్ధత తలకెత్తుకుని
నిమగ్నతతో
ధిక్కారస్వరమొకటి
సర్కారీ దివాళాకోరుతనంపై
సంధించిన కవితాశరంలా
విప్లవస్వరాలతో ఉత్తేజాన్నిస్తూ
నినాదమై, విధానమై గానమౌతున్నప్పుడు
అరుణారుణ కిరణాలకు
తక్షణ ప్రేరణపొందిన
పద్మాలన్ని శిరమెత్తిన కంఠంతో
జయహో కవిత్వంగా నినిదిస్తాయ్‌
రాబోయే మార్పును స్వప్నీకరణం చేసుకుంటూ!
-------------------------------------------------

Sunday, May 17, 2015

కపిల రాంకుమార్‌ \\ అగాధం పూడ్చాలంటే \\

కపిల రాంకుమార్‌ \\ అగాధం పూడ్చాలంటే \\
పథకాలు ఊరిస్తున్నాయ్‌
ఫలితాలు నీరుకారుతున్నాయ్‌
హెచ్చరికలు జారీ అవుతున్నాయ్‌
అవినీతి పర్వాలు పెచ్చరిల్లుతున్నాయ్‌
వాగ్దానాలు గాలిబుడగలై పేలుతున్నాయ్‌
స్వచ్ఛత డాంబికమై
అన్నిట పందులు కుక్కలు కాపురాలుంటాయి!
యోచనవుంటే శౌచాలయం మాట అటుంచి
విద్యా,వైద్యాలయాల్లో
శిథిలమైన  వాటిని సంస్కరించండి!
అభివృద్ధికి - అథోగతికి
మధ్య అడ్డుగోడై
నిబద్ధత నిజాయితీ మరిచి  నిద్రపోయేందుకు
కంకణం కట్టుకుని నిమగ్నమైనపుడు
ఆదర్శాలు వల్లెవేయటానికే తప్ప
ఎందుకూ కొరగానివౌతుంటాయి
అందనంత ఎత్తులో ధరలో ధరలు
స్వైరవిహారం చేస్తుంటే
అందుకోలేని సామాన్యం
అగాథంలోకి కూరుకుపోతుంటే
ఏలికలకు పట్టదు సరికదా
పట్టించికోండని ప్రతిపక్షం గోలచేస్తే
నిర్బంధాలు తెరమీదకొస్తాయి
లాఠీలు, తూటాలు రోడ్లపై నగ్ననృత్యం చేస్తుంటాయ్‌!
పెదాలపై చిరునవ్వే ప్రగతికి దర్పణం అంటూ
గ్లోబలులతో కరచాలనంచేస్తూ
జనాల క్షుద్బాధను గమనించక
ఊబకాయం పెంచుకుంటారేకాని
ఊపిరిపోసే సంగతి మర్చిపోతారు
ఇప్పుడు
ముక్తాయింపు పలుకులు, కులుకులు కాదు కావలిసింది
ఎవరో ఒకరు పచ్చ జెండా వూపి
పలుగులతో తవ్వి మూలాలతో సహా
పెకిలిస్తే కాని ఆ అగాథం పూడదు
బండి గాడిలో పడదు.!

16.5.2015

Sunday, April 26, 2015

కాళ్ళ క్రింద కృంగిన నేల

కపిల రాంకుమార్‌ \\ కాళ్ళ క్రింద కృంగిన నేల \\ ----
'' గత కాలంలో జరిగిన  గుజరాత్‌ భూకంప స్పందన కవిత యాదికొచ్చిందీ సందర్భంలో ''

భూకంపపు కౌగిలిలో-దీర్ఘనిద్ర నిర్యాణం
విశ్వరూప నర్తనలో-ప్రకృతెంత కాఠిన్యం!

గుండెపగిలి అండచెదరి-మండుచున్న ప్రళయాగ్ని
చరితలోన మరువలేని-శవ యాత్రల త్రేతాగ్ని!

తల్లిలాంటి నేలతల్లి-తల్లక్రిందులాయె
తల్లిలేని పసికందులు-తల్లడిల్లిపోయె

చెట్టుకొకరు పుట్టకొకరు-తోడులేని పక్షులాయె
పొట్టమాడి బట్టలేక-వీథిలోన బతుకులాయె

వితరణలో వివక్షతో- ఆలస్యం విషమాయె
ఆదరణకు నోచుకోక-ప్రతి యెదలో గుబులాయె

ప్రపంచాన మంచితనం కొంచమైన బతికున్నది
పంచదొరకు ఆశతో బాధిత జనమున్నది
మత రహితం కులరహితం సహాయాల ఆశయం
తోటివారినాదుకొనుట మనుగడకది నిలయం!

Wednesday, April 15, 2015

కపిల రాంకుమార్‌ \\ కొత్త పొద్దు పొడవాలి \\

కపిల రాంకుమార్‌ \\ కొత్త పొద్దు పొడవాలి \\

అబద్ధాల పునాదులపై
అద్దాల భవంతి కట్టి
అల్పసంఖ్య ఒట్లతో
అధిక స్థానాలు పొంది
కుక్కతోక వంకరలాంటి
పాలకవర్గ బుద్ధి మారాలంటే,
కష్టమే మరి!
మంది బలంతో
యావన్మందిని మభ్యపెట్టి
వాగ్దానాల భంగమే లక్ష్యంగా
నిత్యం జరిగే మానభంగాల సాక్షిగా
ప్రజావ్యతిరేకత పోగుచేసుకుంటున్నది!
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటంలో
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వర్ల్డ్‌ రికార్డ్‌  బద్దలుకొట్టి
వడివడిగా బడుగుల ఆశలపై
నీళ్ళేకాదు నిప్పులు జల్లే క్రమంలో
అడుగులు వేస్తున్నది
ఒక్క కేంద్రమే కాదు
మన తెలుగు రాష్ట్రాలు ఏం తక్కువ తినలేదు
వాటిదీ అదే వరస!
వాళ్ళ సిద్ధాంతాలు వేరైనా
రాద్ధాంతాలు పెట్టి
పబ్బంఅ గడుపుకోటానికి
ఒకే వర్గస్వభావం
ఒకే రకపు రక్తకణాలతో
ఊళ్ళను ఊడ్చేయటం
నోళ్ళను నొక్కేయటం
భద్రత పేర వీరభద్రులవటం
రక్షణపేరిట భక్షకులవటం
వితరణపేర నొప్పి తగలకుండా
లాఠీదెబ్బకనబడకుండా లూఠీ చేయడం
సంక్షేమం పేర సంక్షోభాలకు తెరదీయటం
ఖజానాపూడ్చటానికి చౌకబారు ఎత్తుగడలతో
బారుల్లాంటివి రుద్ది జనాల జేబులు కత్తిరించటం
నల్లపూసల్ని మట్టిలో కలిపేసి
చల్లని విడిది గృహాల్లో విందులుచేసుకోటం
రాయితీలిస్తామని
జిరాయితీ భూముల్ని సైతం మింగి
అరచేతి వైకుంఠాలు పొందలేనివార్ని
అరదండాలతో అణగతొక్కటం
సొంత సొరుగులు నింపుకోటానికి
బెరుకులేని అవినీతిని జాతీయవృత్తిగా స్వీకరించడం
మానవ విలువలు నాశనమౌతున్న దశలో
మెరుగుపరచకపోగా
మరింత మురుగుకాల్వలోకి తోసేయటం
స్వచ్చ భారత్‌ సాకుగా
ఫోటోలు దిగటమే కాని
కుళ్ళుకొట్టే రాజకీయ క్షాళనకు తిలోదకాలిచ్చి
పైపై మెరుగులతోనే,
కాలయాపన చేసే
ఈ దిక్కుమాలిన రాజకీయ పాలకవర్గాలకు
దిమ్మతిరిగే సమాధానమియ్యాలంటే
యావద్బాధితులంతా ఏకతాటిపై
సమరశీల పోరాటపు కొత్తబాట ఎన్నుకోవాల్సిందే!
ప్రపంచీకరణ, గ్లోబలీకరణ, తీవ్రవాద,
మతతత్వ ఉగ్రవాదాలకతీతమైన
కొత్త పొద్దులోని లేవెలుగుల అరుణకాంతులకై
కదం కదం కదిపి పిడికిలి బిగించేందుకు
అనివార్యం మరో ఉద్యమమిప్పుడు !
15.4.2015

Monday, April 13, 2015

కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||

కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||
వాడు తిట్టాలనుకుంటే
మాటల కరువులేదు
తెచ్చి పెట్టినట్టుండవు
వచ్చి పడ్డట్టుంటాయి!
వాడు కొట్టాలనుకుంటే
కత్తులు కటారులక్కర్లే
మెత్తగావున్నట్టుండే
కత్తిలాంటి చూపులు చాలు!
వాడు పట్టాలనుకుంటే
పట్టకారులక్కర్లేదు
పట్టుదొరికించుకోగల
పట్టుదలే వాడి మూడోచేయి!
లోకంలో జరిగే అక్రమాలు
తూకాలు వేయలేం
తోకలకత్తిరించగ
చిత్తశుద్ధి వాడికుంది!
తిరిగుబాటు పాఠాలు
తీయగాను చెబుతాడు
జనాల మనసు నొవ్వ కుండ
కదనానికడుగులిస్తాడు!
మనసుంటే మార్గముందని
మన యింటినుండి పనిని
మొదలిడితే చాలంటాడు
మన వూరికి అదే మేలంటాడు.!
వాడి ఊహలను చేతలను
కుదేలు చేసే కుతంత్రాల
మాయగాళ్ళ డేగకళ్ళు
నిత్యమడ్డుకోచూస్తాయ్‌
అనుక్షణం కుయుక్తులతో
విలయాలను సృష్ఠింస్తే
దీటుగా తొడగొట్టి
తుత్తునియలు చేయగలడు
జనంతా ఒక్కటిగా
చేయిచేయి కలిపి
ముందడుగేస్తే
సాధ్యమే విజయమన్నది!
దాని వెనక వున్న నమ్మకం
దాని ముందున్న లక్ష్యం
దాని అమూల్యపు తెగింపు
తరతరాల ఎర్రబాటది!
అందుకే మార్క్సిజం
అజేయమమేయం!
తొలిపొద్దు లేకిరణాల
అరుణారుణోదయం! /....12.4.2015/13.4.2015

Thursday, April 9, 2015

|| రాజ్యహింసా? హత్యా? ? ||

కపిల రాంకుమార్‌ ||  రాజ్యహింసా? హత్యా? ? ||

ఆదాయం
ఇబ్బడి ముబ్బడి కావాలంటే
దొడ్డిదారి సంపాదన ఉండాలి
ఒకడిని తొక్కి పైకి వెళ్ళడమే
వారెంచుకునే మార్గం
తమ కోసం ప్రాణాలిచ్చేవారిని
కూలీలుగా, కమీషన్‌ దారుగా
స్మగ్లింగ్‌కు తోస్తారు
వారు భవంతుల్లో
ఏసి గదులో మందుకొడుతూంటే
వీళ్ళు అడవుల్లో
కష్టాలను భుజాన తగిలించుకుని
కడుపుమట చల్లార్చుకునేందుకు
చెప్పింది చేస్తూ
తోలుబొమ్మల్లా ఆడుతూ
ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు
**
నిఘా నేత్రాలు
కూలీల ఆచూకి చెప్పుతాయే కాని
అసలు మారాజులను పట్టలేవా
కక్కుర్తిపడకుండా వుంటే వాళ్ళు
వలలోనే చిక్కేవారు, కాని
వాటికి అక్కడో రిమోట్‌ వుంటుందేమో
దొరికిన వాడే దొంగ లేదా స్మగ్లర్‌
దొరకని వాడు దొరగారే కదా!
వాళ్ళ నెలవారి కేసుల లక్ష్యాలు చేరటానికో
బాగా పనిచేస్తూ అక్రమాలను అరికట్టుతున్నామని
మెప్పుపొందటానికో
పప్పులో కాలేసి
ఇలా అమాయకులను కాల్చేసి
కనీస విచారణ చేయాలనే మానవ హక్కును గాలికొదిలి
వాళ్ళప్రాణాలను గాలిలో ఒదిలేసి
చేతులుదులుపుకుంటే
సభ్య సమాజం చేతులు కట్టుకుని కూచుంటుందా!
ముక్త కంఠంతో ఖండించి్ ఎలుగెత్తుతుంది
మీ చేతకాని తనాన్ని ఎండగడుతుంది
**
చేతనైతే, చేవ వుంటే
ఇలాంటి దగుల్బాజీ పనులు
చేయించే నాయాళ్ళను పట్టుకోండిరా!
పొట్టకూటిగాళ్ళను పొట్టనుపెట్టుకోటంకాదు!
అందుకే బూటకపు ఎన్‌కౌంటర్లతో
రాజ్య హింసలు హత్యలు చేస్తే
సుప్రీం కోర్ట్‌ కలుగచేసుకోదా?
మానవహక్కుల కమీషన్‌ నిలదీయదా?
ఎందు నాలుక కరుచుకుంటారు?
నిజాలను దాచాలని తంటాలు పడతారు!
తస్మాత్‌ జాగ్రత - సామాన్యుడు తిరగ బడకముందే
మీ చేతివాటపు చేష్టలను, దుందుడుకు చర్యలను
సవ్యం చేసుకోండి!
లేదా
మీరోనాడూ ఇలాగే హవనం బారి పడాల్సివస్తుంది
జనాలకు జవాబుదారుగా మెలగండి
దొరలకు ఊడిగంచేస్తూ కాదు!
**
9/4/2015

Friday, April 3, 2015

కపిల రాంకుమార్ // లక్ష్యం ? ||

కపిల రాంకుమార్ // లక్ష్యం ? ||
ఛిద్రమైన జీవచ్ఛవాల్లా బతకటమేనా
ఏదైనా సాధించకుండా
విలువలన్నీ పోగొట్టుకొని
అనామకుడిలా వుంటే యెలా?
మనం ఓ పెద్ద సున్నా అని
నిర్వచించినపుడు
దానికి చీమకుట్టినట్టైనా
కదలిక వుండాలికదా! మిత్రమా!
సున్నాలకు ముందు
విలువైనది చేర్చాలని ప్రయత్నంలో -
వెలుపలికి లోపలికి, లోలోపలికి వెంపరలాట ..
ఒక గెలుపు కోసం,
లేకపోతే అటూ లోపలికి
ఇటు బయటికి తిరగటమే..
ఒక లక్ష్యమంటూ లేకపోతే
బతుకు నిర్లక్ష్యానికి గురయితే
పోస్ట్‌మార్టం అయిన శవానికి బడ్డ కుట్లలా
దేని కేదో బంధంలేని పార్థివంలా మిగులుతావు!
సంస్కారం చేయలేరు -
అంతిమ సంస్కారం తప్ప!

1.4.2015 ఉదయం 9.35

కపిల రాంకుమార్ || మిని ||

కపిల రాంకుమార్ || మిని ||
పట్ట పగలు
పుట్టే పగలు
కట్టె సెగలు
మట్టి గుబులు

2.04.2015

||ఎన్ని ఇష్టాలో అన్ని కష్టాలు||




కపిల రాంకుమార్
||ఎన్ని ఇష్టాలో అన్ని కష్టాలు||
ఇంత దూరం వచ్చాక నాకేమిష్టమో
చెప్పకపోతే పక్క  రాష్ట్రం నుండి
లగెత్తుకెందుకొచ్చావనగలరు!
అయినా భయమేమిలేదు
యేం చెప్పాలనిదాంట్లో స్పష్టతావుంది!
వేదికచేరుకునేటప్పపడే గౌరు నాయుడోపక్క
రామతీర్థో పక్క  అగబడ్డారు!
కుశాలయింది.
మరింక శివాలెత్తే ఎర్ర కవి గీడనేవుండె!
కాకినాడ అద్దేపల్లి , తిరుపతి మేడేపల్లి
నిండుగా నవ్వుతున్నట్లనిపించి
నా కైత పరుస్తున్నానిలా!
నాకు గాంధీయిజం యిష్టమే
కాని  అప్పుడప్పుడు
హింస అన్నవార్యం కదా!
నాకు మావోయిస్టులు యిష్టమే
కాన్న కొన్ని చేష్టలు మాత్రం అయిష్టం!
ఆస్వాదనీయమైన పానీయాలన్ని యిష్టమని
విషం తాగలేము కదా!
దృశ్యాలన్ని కనువిందు చేస్తాయని
అత్యాచారాలను చూసి ఆనందించలేం కదా!
నినదించకుండ వుండలేం కదా!

కుహనా వాదంతో చూసిన కళ్ళు చెప్పలేవని, 
చెప్పే నోరు చూడలేదని
చెరువుకట్ట మీంచి వచ్చాను కాని
నీళ్ళున్నాయో లేవో చూడలేదనే
కూట సాక్ష్యం చెప్ప లేం కదా!
నిజం ఎప్పుడూ చేదు అనుభవాలనే పంచుతుంది!
కొండకచో నిర్బంధాలను పెంచుతుంది!
నిజమంటే ఉన్నోడికి కోపం!
డబ్బు జబ్బుతో జబ్బలువాచినోడికి తాపం!
కక్కసులోదాచిన మర్మాల్ నిజం
ఎక్కడ వెలుగులోకి  తెస్తుందోనని
రాజకీయ మన్మథులకు కోపమే
వారి నిలువెత్తు రాసలీలన్నీ
ఏ సూక్ష్మ దుర్భిణి  తెరాడిస్తుందేమోనని
పొలాలను, సామాన్యుని స్థలాలను,
వారసత్వ బిలాలను
గ్లోబలవుతున్నాయనేది యెంత సత్యమో
సకల జనుల కలలను,
కథలను, కళలను, కవులను సైతం
బలయ్యే అంత్య  దశ చేరుకున్నాయని,
నిర్భయంగా చెప్ప దలచుకున్నాను!
అప్పుడు  వాటిని చూచి భరించలేక
చిన్ని  చితక ఆందోళనలు చేసే
ఎర్ర పక్షులన్నీ ఏకమై
కలుగులో దాక్కుని  దొంగదెబ్బతీసే
నల్ల త్రాచును నరికి పోగులుపెట్టాలంటే
పాణిగ్రాహి జముకులాడాలి!
తెలంగణా సాయుధరైతాంగ పోరాట అయిలమ్మ
తుపాకి మోగాలి!
శ్రీరాములయ్య  నిరంతరపోరాట గరిమ
అనంతనుండి విశాఖకు రావాల్ల!
విశాఖ నుండి విశాల ఆశయాల
విప్లవ భారతావనికి  వెన్నుదన్నుకావాలి!
ముక్దుం, రావెళ్ళ  దాశరథి, ఆరుద్ర, రాచకొండ,
కాళోజీ, శ్రీశ్రీ, శివసాగర్, ఛాయారాజ్‌ల
 విప్లవ సాహిత్య  పరిమళాలు పునర్వికసించాలి!
ఎన్ని ఇష్టాలో అన్ని కష్టాలు!
అయినా ఇన్ని యిష్టాలు నెరవేరాలంటే ఎన్ని కష్టాలెదురైనా!
అన్ని కమ్యూనిస్టు  శ్రేణులేకమవాలి!
మార్క్సిజం అజేయం –
ఆ విజయాన్నందుకోవటమే
మన లక్ష్యమ్ని  చెప్పటానికి  మీ ముందుకొచ్చాను!
ఇక్కడి బుగుత గారికి కోపం వచ్చినా,
భుక్తి కోసం పోరాడే జనావళికోసం
ఈ నాలుగు మాటల ముచ్చటించి, పిడికిల్ల బిగిస్తున్నాను!
రేపటి పోరుకోసం సన్నద్ధంకమ్మని విన్నవిస్తున్నాను!
**

మనం మనో మధనం చేయాలి '' -మన్మథనామ ఉగాదినాడు కవి సమ్మేళనంలో కవుల అభిప్రాయం!


'' మనం మనో మధనం చేయాలి '' -మన్మథనామ ఉగాదినాడు కవి సమ్మేళనంలో  కవుల అభిప్రాయం!

               గత పదిహేను సంవత్సరాలుగా ఖమ్మంలో సాహితీ స్రవంతి యికనుండి తెలంగాణసాహితిగా యథవిధిగా సాహితీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుందని, అనన్య సామాన్యమైన సేవలనెలా చేసిందో అదే విధంగా మరిన్ని విస్తృత కార్యక్రమాలు, సెమినార్లు, గోష్టులు, శిక్షణా తరగతులు నిర్వహించాలని తెలంగణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి, ఖమ్మం బి.వి.కె. గ్రంథాలయంలో మన్మథ నామ ఉగాది కవి సమ్మేళనంలో సందేశమిచ్చారు. తెలంగాణ సాహితి  జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో, కార్యదర్శి రౌతురవి,ఖమ్మం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సంపటం దుర్గా ప్రసాద్‌, కంచెర్ల శ్రీనివాస్‌, డా. పి.సుబ్బా రావు,డా.పాపయ్యశాస్త్రి, బాణాల కృష్ణమాచారి, వేదికపై ఆశీనులుకాగా పట్టణంలోని కవులు, కళాకారులు సుమారు 36 మంది ఈకార్యక్రమంలొ పాల్గొన్నారు అధ్యక్షుడు  కన్నెగంటి  మాట్లాడుతూ మన్మథనామ ఉగాదిని ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యం అంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగ విదివడి, ఈ తెలంగాణా రాష్ట్రంలో మొదటి సాహితీ సమవేశంగా కవి సమ్మేళనం  నిర్వహించు కుంటు, కొన్ని ప్రత్యేకమైన, రాష్ట్ర సమస్యలను, జాతీయ అంతర్జాతీయ సమస్యలను అవగాహనతొ పాటు అనుసంధానం చేసుకుంటూ సాహితీ కృషి జరుపుకొవలసిన అవసరంవుందని అన్నారు. ఆగడాలు, అత్యచారాలు, మోసాలు, ద్వేషాలు, ఘోరాలు, నేరాలు పెచ్చరిల్లుతున్న తరుణాలు కొనసాగుతూవున్న కాలంలో వాటిని ధీటుగా విశ్లేషించి నివారించే ప్రాతిపదికలుగా కవిత్వం వుండాలని అన్నారు. ప్రజా జీవితంతో ముడిపడిన అంశాలే మన కవితాంశాలు కావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు ఆనందాచారిని వేదికపైకి అహ్వానించారు. సన్నగిల్లి పోవటమే కాదు, మృగ్యమయ్యే స్థితికి  చేరుకుంటున్న సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటూనే మూఢ నమ్మకాలకు, గ్లొబలీకరణకు, ప్రపంచీకరణకు, మతోన్మాద ఉగ్రవాదాలని నిలువరించే దిశ, దశ నిర్దేశించేలాకవిత్వం రాయాలని. విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, అందరికి శుభాకంక్షలు తెలుపుతూ తన కవితతో కవి సమ్మేళనం ప్రారంభంచేసారు.  '' అరల్లో నిద్రించే వాటిని బయల్పరచాలి / కలాలకు కొత్త బలాను అందించాలి – అంటూ తెరపై రంగులు దుమ్ములేపుతాయి - కాలానికి సంబంధించిం స్పృహ వుండాలి - మన ఆలోచన ఆక్రమణకు గురౌతున్నది, పెట్టుబడి సామాజిక బీభత్సం చేసి మానవతా హృదయాలను కూలుస్తున్నది....కవీ! నువ్వైనా అప్రమత్తుడవై చూడాలి '' అని కొత్త ఆశంస వెలిబుచ్చారు తన కైతలో. కన్నెగంటివెంకటయ్య నవ్వులకు సంబంధించి వ్యంగ్య గేయాన్ని పాడి వినిపించారు. సవ్వులలోని రకాలు, నవ్వు వెనకాల వున్న మానవ నైజాలు ఉర్రూతలూగే కంఠస్వరాన్నందించి ముగ్ధుల్ని చేసారు. ప్రముఖ కవి, విమర్శకుడు జీవన్‌ సందేశం యిస్తూనే తన కవిత  ''యథాతధం ''లో - '' నల్లధనం మూలాలను,స్వరూపాలను వివరించారు. పసలేని నాటకానికి మోత ఎక్కువ, నాందీ వాక్యంలోనే భరత వాక్యం పలికింది '' ఈ వ్యవస్థపై తనదైన చురకలు వేసి అలరించారు. కటుకోజ్వల రమేష్‌  ఉగాది ఆశాగీతం అనే కవితలో '' భరోసాలేని భవితను ఎలా పంచమంటావ్‌?''  అంటూనే  '' కాలం చిలకొయ్యకు మాత్రం మమ్ములను తగిలించాఇ వెళ్ళావని '' చురకలు వేశారు.తాళ్ళూరి రాధ '' నిజం '' అనే కవితలో '' మానవీయ సంబంధాలు, ఆర్థిక బంధాలయినాయ్‌,'' అంటూ - మనిషి ' మనీ 'కొరకు చేస్తున్న సంకుచిత ధోరణులను యెత్తిచూపారు. డా.పొత్తూరి సుబ్బారావు : ఉగాది సందేశమిచ్చి, ఖమ్మం జిల్లా ప్రాశస్త్యాన్ని '' సితార '' నగారాలుగా ఆవిష్కరించి, మన తెలంగాణా ఔన్నత్యాన్ని, అలనాటి బౌద్ధమత విరాజిల్లడాన్ని తన కవితలో శ్లాఘించారు. నాగిరికతా సంస్కృతులకు ఖమ్మం జిల్లా ఉదాహరణ అంటూ జిల్లా గొప్పదనాన్ని ఆసాంతం ఆకట్టుకునేలా వినిపించారు. కవిత్వాన్ని ఓ ధృక్కోణంలో చూడటంకాదు తెలంగాణా అస్థిత్వాన్ని చక్కని చమత్కృతులతో వ్యక్తీ కరించారు.  బండి ఉష: ఉషోదయం అనే కవితలో మట్టికాళ్ళ మనిషి మౌనంగా మట్టిలోనే పొలి అవుతున్నాడు. అరిషడ్వర్గాల నుండి జయించే కొత్త ఉషోదయం రావాలని అకాంక్షించారు. ప్రేమ శరాలను విసరాలి అంటూ ముగించారు. అడవికట్ల ఆదామ్‌:  పద్య కవితలను ఆరు వినిపించారు. షడ్రుచులివేనన్నట్లుగా అవి అందరిని అలరించారు. చక్కటి శ్రావ్యమైన  స్వరంతో రాగయుక్తంగా వీనులవిందు చేసారు. షేక్‌ జాకీర్‌ : మరణించిన సమాజాన్ని మేల్కొనేవాడే కవి అంటు కవిత వినిపించారు.

              తదుపరి సాహితీ స్రవంతి 15 సంవత్సరాల ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి అవిస్కరించి, ఆ సందర్భంగా సందేశమిస్తూ బహుకొద్ది మందితో పదిహేనేళ్ళ క్రితం యేర్పడిన సాహితీస్రవంతి అచిరకాలంలో శాఖోపశాఖలుగా విస్తరించడం, తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఒక బలమైన సాహితీ సంస్థగాను, ఒక సాహిత్య మాసపత్రిక ప్రస్థానం ఆవిర్భావానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగాను తాను తోడ్పడినందుకు ఆనందంగావుందని అన్నారు. యిప్పుడు కొత్త రాష్ట్రంలో తెలంగాణా భాషను, సంస్కృతులను మరింత పరిపుష్టం చేయడానికి మరింత కృషిలో భాగంగా తన నాటక రచనా వ్యాసంగాన్ని తెలంగాణా బాషలోనే సృజన చేస్తానని, యిన్నాళ్ళకు ఆ కల సాకార మవ్వబోతోందని సంతోషం వెలిబుచ్చారు.డా. ఆంజనేయులు : మనవూరి చెరువు - గుర్తుకు తెచ్చారు. చిన్నతనంలోని చిలిపి పనులు, చెరువు ఉపయోగం, బహుముఖాలుగా చెరువుకు ఊరికి వున్న బంధం చాకటి తెలంగాణా పలుకుబడులు పండేలా మంచి కైత వినిపించారు. అందరిని అలరించారు.తాళ్ళూరి లక్ష్మి:  తన కవితలో  నైతికంగా దిగజారిన మన సమాజాన్ని మనం జల్లెడ పట్టి, వ్యక్తి వర్తమానంలోబాటచూపించాలంటూ ఆకాంక్షిస్తూ ముందు ముందు నీళ్ళ టాంకులకోసం యుద్ధ టాంకులవసర్మేమో అని వ్యంగ్యంగా నీటి అవసరాన్ని తెలిపారు.గరికిపాటి మణీందర్‌:  '' ఏడిపించకండి దొర - బతికుండగానే చావు బాజా మోగించకండి '' అంటూ నేటి ఆసరాఅ పథకాలలో జరుగుతున్న అవకతవకలు ఎత్తిచూపించారు. ఫించను రాక టెన్‌షన్‌కు గురువుతున్న అనాన్ని పట్టించుకోమని కోరారు తన కవిత '' శిశిర గీతం ' లో. పొత్తూరి సీతారామారావు : హాస్య వ్యంగ్యోక్తులమిశ్రమైన సంభాషణల్తో ఆద్యంతం రక్తికట్టించేలా తన అవితను వినిపించారు.దేవయ్య : తొలి ఉషస్సు అనే కవిత, గొవిందు :
ఓ ఆత్మీయ అతిథి అనే కవిత, వినిపించగా డా.కావూరి పాపయ్య శాస్త్రి '' కోకిల ''పేర పద్యాలను వినిపించి అందులో జాతీయాలు, తెలుగు పలుకుబడులు, నుడికారాలు పొందుపరవటమే కాక చక్కటి వివరణలు తెలియచేసారు. కంచెర్ల శ్రీనివాస్‌ '' కోయిలమ్మ కూస్తోందిరా ' అనే కవితలో '' బడుగు భారత జనుల ఉషస్సులకు, ఆటంకాలు లేని ఇజాలు''  కావాలన్నారు.  కపిలరాంకుమార్‌ : పెపంచానికి కాస్త బుద్ది సెప్పండి అనే కవితలో ' కోయిల గొంతు మూగబోయింది, ' అంటూ కాకులు, కోకిలల మధ్య సారుప్యత లేకపోవడాన్ని చిత్రికపట్టారు. మన మనస్సులను మథనం చేసుకూంటూ, మేథో మథనం చేసికోవాలి అంటూ మనుషులు మృగాలవటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కారు( వయసు) తేడాలేని బతుకులకు చితికిపోవడాలకు స్వస్తి పలకాలంటూ ఆశాభావం వ్యక్తీకరించారు. పోతగాని సత్యనారాయణ '' కొన్ని యుగాలు తేల్చని సగాలు '' అనే కవితలో అకృత్యాలు, అధికారాలు కవలలు, అసమానతలు హద్దులు దాటాయంటూ ఆక్రోసించారు.ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు లభించినపుడే, విశ్వంలో సగమై జయకేతనమెగురుతందని ముక్తాయింపునిచ్చారు. ఉరిమళ్ళ సునంద: అంతా కొత్త యాదే అంటూ యుగాదిని, ఉగాదిగా తలవాలంటే '' అస్థిత్వానికి తండ్లాడుతున్నాను, మట్టి పరిమళాలు పరివ్యాప్తం కావాలందుకే. అవనిపై జరుగుతున్న  విశృంఖలత్వాన్ని అక్షరీకరించారు. సంపటం దుర్గా ప్రసాదరావు తనదైన రీతిలో చిక్కని, చక్కని చిన్న కవిత చదివి అందర్ని అలరించారు. నారాయణ '' అది ఏరే - ఇది ఏరే '' అనేకవితను ఆలపించారు. కన్నెగంటి వెంకటయ్య  ' వైఫల్యాల గజనీ యాత్రలో నేనొక విశ్వాసంలేన్ని అశ్వాన్ని కాలేను, కాలం బడిలో పాఠాలు నేర్చుకునే బడిపిల్లమౌదాం అంటు నవగీతాంజలి పాఠం అవుదాం అని తన కవితలో ఆశించారు. ఈ సందర్భంగా  మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందుగానే కూసిన కోయిలలాగ ఖమ్మం సాహితీ స్రవంతి తెలంగాణా సాహితీగా మారిన మొదటి కార్యక్రమంలొ గత15 సంత్సరాలుగా సాహితీకార్యక్రమాలలో బాధ్యతలు స్వీకరించినవారు, వివిధ సందర్భాలలలో వెన్నుదన్నుగా నిలచి సలహలు, ఉపన్యాసాలు అందించిన సీనియర్‌ కవులు, విమర్శకులను సన్మానించు కోవటం ఒక కొత్త ఒరవడికి సంప్రదాయానికి తెలంగాణా సాహితి ఖమ్మం జిల్లా కమిటి తెరతీసింది: ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యంలో అందెవేసిన చేయి, డా. పొత్తూరి వెంకట సుబ్బారావు గారిని, కవి, విమర్శకుడు డా.కావూరి పాపయ్య శాస్త్రి గారిని, నటుడు ప్రయోక్త, దర్శకుడు, తెలంగాణా పడికట్టుపై పట్టున్న రచయిత, బానాలకృష్ణమాచారి గారిని, మరొ తెలంగాణా పలుకుబడిని పెట్టుబడిగా కలిగిన కవి, కథా రచయిత, జీవన్‌ గారిని, కవి, రచయిత, నటుడు, దర్శకు, బోడేపూడి విజ్ఞాకేంద్రం నిర్వాహకుడు, సాహితీ స్రవంతికి తొలినాళ్ళలో ఐదు సంవత్సరాలు అధ్యక్షస్థానాం నిర్వహించి, తదుపరిసాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తున్న కపిల రాంకుమార్‌కు సన్మానం జరగటం. ఒక చారిత్రిక నిదర్శనంగా ఈ తొలి సాహిత్య కార్యక్రమం నిలుస్తుంది . రౌతు రవి కవులందరికి నమస్కారం అంటూ వందన సమర్పణ చేసారు.

 



photo.php 13.jpg

సాహితీ స్రవంతి 15 సంవత్సరాల ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి