Saturday, October 4, 2014

''సాహితీ సౌరభాలతో పులకించిన ఖమ్మం ఖిల్లా '' - రిపోర్ట్‌
'' పలు సంకలనాలతిను '' లోగిలి '' ప్రత్యేక సంచిక ఒక ఆకర్షణగా సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం ఖమ్మం సాహితీ చరిత్రలో ఒక మైలు రాయి '' అని వార్షికోత్సవ సభను ప్రారంభించిన ముఖ్య అతిథి సుధామ అన్నారు. మనిషి సృష్టించుకున్న మా'నవ'సమాజంలో తానే ఒంటరైపోతున్నడని, అంతరాలు తగ్గించే మానవీకరణే కవిత్వ ప్రథాన ధ్యేయమని; కనుమరుగౌతున్న మానవవిలువలను కాపాడే విషయంలో కవులే ప్రధాన భూమిక నిర్వహించాలని ఉద్ఘాటించారు. చట్టాలు, శాసనాలతో అమలుకానివి కూడ కవులు కవులు కళకారులు తలుచుకుంటే సాధ్యమౌతుందని ఆలిండియా రేడియో విశ్రాంత ప్రొగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌, కవి, కాలమిస్ట్‌, సుధామ అన్నారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఖమ్మం లోని రోటరీక్లబ్‌ ఆర్టిఫిషియల్‌ లింబ్‌ సెంటర్‌ ( ఎన్‌.ఎస్‌.టి.రోడ్‌) లో ఉదయం 11.00 గంతలనుండి రాత్రి 9.00 గంటలవరకు విజయవంతంగా సుమారు 350 మంది కవులు, సాహిత్య అభిమానులు, కళాకారుల ఆనందోత్సాహాలతో నిర్వహించబడింది. ప్రముఖ దిన పత్రికలు ప్రశంసల జల్లు కురిపించాయి.మరో అతిథి ప్రముఖ కవయిత్రి షాజహానా మాట్లాడుతూ మనసు పలికే భాష కవిత్వమని, కొబ్బరినీళ్ళలాంటిదని అంటూకవిత్వమెప్పుడు ప్రజల పక్షానే నిలబడుతూ శాశ్వత ప్రతిపక్షంగా నిలుస్తుందన్నారు. కవులు సిద్ధాంత చట్రంలో యిరుక్కుని నలైగిపోతున్నారని, బయటకు వచ్చి నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షాపూరిత దాడుల్ను ఖండిస్తూ వారికి మద్దతుగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని మత మౌఢ్య సంస్థలు సాగిస్తున్న దమనకాండపై 
నిప్పులు చెరిగారు. ఆట్తడుగు వర్గాలకోసం రచనలు చేయటమే కవుల లక్ష్యంగావుండాలని అభిప్రాయపడ్డారు.ఈ సభలో మరో ముఖ్య అతిథి, సాహిత్య విమర్శకుడు, అద్దేపల్లి రామమోహనరావు మాట్లాడుతూ దేశ అస్థిత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపనవుందని, ముఖ్యంగా కవులపైన మరీ ఎక్కువగా వుందని నొక్కిచెప్పారు. పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రజలను ఉద్యమాలవెంపు, పోరాటలవెంపు నడవటానికి సంసిద్ధం చేయవలసిన వారు కవులేనని ఉద్బోదించారు. ఆ శక్తి సాహిత్యానికున్నదని, మన స్వాతంత్ర్యపోరాటంకాని, తెలంగాణా రైతంగ సాయుధపోరాటంకాని అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో 
నిలిచాయని వివరించారు.సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యయనవేదిక నిర్వాహకుడు 
రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో వెలువరించిన ప్రత్యేక సంచిక '' లోగిలి ''ని ఖమ్మం జిల్లా ఫెమా అధ్యక్షుడు, కవి, మువ్వా శ్రీనివాసరావు అవిష్కరించగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు ఆనందాచారి పరిచయంచేసి, సంచికను తయారుచేయటంలో కృషి చేసిన కపిల రాంకుమార్‌ను, వారికి తోడ్పాటు అందించిన హైదరాబాద్ ప్రజాశక్తికి చెందిన అనంతోజు మోహనకృష్ణను అభినందించారు. తదుపరి వురిమళ్ళ సునంద రచించిన వరమళ్ళ వసంతం కవితా సంకలనం అద్దేపల్లి రామ మోహనరావు ఆవిష్కరించగా కన్నెగంటి వెంకటయ్య పుస్తక పరిచయం కావించారు. కవి, గాయకుడు సంపటం దుర్గాప్రసాదరావు సంకలనపరచిన ఖమ్మం జిల్లాకు చెందిన 340 మంది కవుల పరిచయగ్రంథంగా సాహితీమూర్తులనే పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు డా.దిలావర్‌ ఆవిష్కరించగా సాహితీ స్రవంతి తెలంగాణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి పరిచయంచేసారు. మరో కవి, గాయకుడు మేడగాని శేషగిరి రచించి, స్వరపరచిన పాటల ఆడియో డిస్క్‌ ( సి.డి) '' పుడమి రెక్కలు '' ను తెలంగాణా రాష్ట్ర ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి , కవి, కె. దేవేంద్ర ఆవిష్కరించగా, కవి పోతగాని సత్యనారాయణ పరిచయ వాక్యాలు పలికారు. ఖమ్మం జిల్లా సీనియర్‌ అచయిత, కవి అంకిత కేశవులు రచించిన '' మానవతా జిందాబాద్‌ '' కవితల సంపుటాన్ని ముఖ్య అతిథి ప్రముఖ కవి సుధామ ఆవిష్కరించగా బి.వి.కె. రాజకీయ విద్యా విభాగం కన్వీనర్, యువ కవి బండారు రమేష్ పుస్తక పరిచయం చేసారు. సాహితీ స్రవంతి పట్టణ కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్ రచించిన పోలవరంపై గీతాన్ని ఆసు ప్రసాద్‌ ఉర్రూతలూగేలా ఆలపించాడు.వార్షికోత్సవ ప్రారంభ ముగిసిన అనంతరం భోజన విరామం అనంతరం సాహజహానా జనకఅవనం ఆరంభించగా, వీధుల రాంబాబు (భద్రాచలం) కటుకోజ్వల రమేష్‌ (ఇల్లందు) కవిసమ్మేళనం సమన్వయపరిచారు. వివిధ అంశాలపైన కవుల స్పందన అలరించింది. సుమారుగా 56 మంది కవితాగానం చేసారు.అనంతరం ఖమ్మం జిల్ల సాహితీ స్రవంతి నూతన కమిటీ కన్నెగంటీ వెంకటయ్య అధ్యక్షులుగా, రౌతు రవి ప్రధాన కార్యదర్శిగా, సంపటం దుర్గాప్రసాద్‌, పోతగాని సత్యనారాయణ, కటుకోజ్వల రమేష్‌, ఉపాధ్యక్షులుగా, మేడగాని శేషగిరి, శిరంశెట్టి కంతారావు, వీధుల రాంబాబు, సహాయ కార్యదర్శులుగా, వురిమళ్ళ సునంద కోశాధికారిగా ఎన్నికకాగా మాల్యశ్రీ, కపిల రాంకుమార్, మండవ సుబ్బారావు, కావూరి పాపయ్య శాస్త్రి, మువ్వా శ్రీనివాసరావు గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు.
డా.సీతారాం, డా. సి.హెచ్‌.ఆంజనేయులు, డా.దిలావర్‌, మాల్యశ్రీ, మండవ సుబ్బారావు, సందేశాలిచ్చారు. సాగి వెంకన్న, మనోరమ, స్వప్న, ఆసుప్రసాద్‌, కన్నెగంటి వెంకటయ్య, శేషగిరి పలి అభ్య్దయ గీతాలాలపీంచి సభను మరింత రంజింపచేసారు. ముఖ్య అతిథులకు, సీనియర్‌ కవులకు మెమెంటోలు అందించి సత్కరించారు.జిల్లా నలుమూలలనుండి కవులు, గాయకులు పాల్గొన్న సభ మరింత ఉత్సాహాన్నిచ్చింది. సాధనాల, లెనిన్‌ శ్రీనివాస్‌, సబ్బతి సుమిత్రదేవి, యనగందుల దేవయ్య, బండిఉష, సునీత, హడ్డంహరి, తాళ్ళూరి లక్ష్మి, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్‌ తదితర కవులు, కవయిత్రులు పాల్గొన్నారు.ప్రారంభ సభలో రౌతు రవి సాహితీ స్రవంతి 15వ వార్షికోతసవం సంర్భం గత 15 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాల నివేది సభ్యుల కరతాళధనులమధ్య ప్రవేశపెట్టారు. ఈ సభ 
దివంగతులైన కళాదర్శకులు బాపు, ఇతర సాహితీ వేత్తల మరణానికి సంతాపం ప్రకటించి, ఒక నిముషం మౌనం పాటించింది. సాహితి స్రవంతి లాంటి సాహిత్య సంస్థల కార్యక్రమాల నిర్వహణకు ఒక దాశరథి లాంటి పేరుమీద ఒక సమావేశమందిరం ఖమ్మంలో నిర్మించాలని, 
కవుల రచనల ప్రచురణకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని, సాహిత్య సాంస్కృతిక విషయాలపై ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాలని తీర్మానీంచారు. మేడగాని శేషగిరి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసి, ఖమ్మం జిల్లా కవులకు
నూతన ఉత్సాహాన్ని యిచ్చింది.

22.9.2014 /4.10.2013

No comments: