Monday, September 2, 2013

కపిల రాంకుమార్|| సెప్టెంబర్ 1 ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలో ||

కపిల రాంకుమార్|| సెప్టెంబర్ 1 ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలో ||
'' ఏ దేశ చరిత్ర చూసినా ఏ మున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ‘‘- శ్రీశ్రీ.
1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.తేదీ సెప్టెంబరు 1, 1939 – సెప్టెంబరు 2, 1945
స్థానం:యూరోప్, పసిఫిక్, ఆగ్నేయ ఆసియా, చైనా, మధ్య ప్రాచ్యం, మధ్యధరా ప్రాంతం మరియు ఆఫ్రికా
ఫలితం:మిత్ర రాజ్యాల విజయం. ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం. అ.సం.రా. మరియు సోవియట్ యూనియన్‌లు అగ్ర రాజ్యాలుగా రూపొందాయి. ఐరోపాలో మొదటి ప్రపంచం మరియు రెండవ ప్రపంచం అనే ప్రభావ ప్రాంతాల అవతరణ - దీని నుండి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం. రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్ధిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.
1931 సెప్టెంబరు లో జపాన్ దేశం చైనా అధీనంలోని మంచూరియా ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించుకుంది. రెండేళ్ల తరువాత, 1933లో, జర్మనీ లో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అతివాద నాజీ పార్టీ అధికారంలోకొచ్చింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ శరవేగంగా సైనికంగా బలపడింది. 1938 నాటికి హిట్లర్ జర్మనీని తూర్పు దిశగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
జర్మని మనసు మరింత క్షోభ పడిన అంశాలుగా '' వెర్సైల్స్‌'' ఒప్పందం, నానాజాతి సమితి ఆవిర్భావం, ప్రపంచ మహా ఆర్థిక సంక్షోభం మొదలగునవి పేర్కొన్నపుడు, అవే రెండో ప్రపంచ యుద్ధ సన్నహాకానికి బీజాలు పడివుంటాయని భావించవచ్చును. అసలు అంతకంటే కూడ ఏదో మౌలికమైన కారణం బలీయంగాఉండివచ్చునని తెలుస్తున్నది. బహుశ: పోలెండును నాశనంచేసి, వరుస క్రమంలో సోవియట్ యూనియన్‌ (రష్యా)ని జయించి, తన అధీనంలోకి తెచ్చుకోవాలనే కామన మూలము. గతంలో సోవియట్ యూనియన్‌ తో చేసుకున్న దురాక్రమణ ఒప్పందం యెడల పేరుకుపోయిన విరోధ భావమే అందుకు కారణం. తాను చేసిన పెద్ద పొరపాటుగా నిర్థారణకు రావటం జర్మనీ లో యుద్ధ పిపాసకు హేతువైంది. ఆ పరిస్థితులను పాశ్చాత్య దేశాలు రాజీకుదుర్చు కునేందుకు వీలు లేని స్థితి హిట్లరే తీసుకువచ్చాడనేది నిర్వివాదాంశం. అలా అతను కృతకృత్యుడ య్యాడనే చెప్పక తప్పదు. అతని పాలన మొత్తం యుద్ధ సన్నాహాలు, కుట్రలు, కుతంత్రాలతోనే సాగింది. రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణం కల్పించన వ్యక్తి, దోషి హిట్లరే అని నిర్ద్వంద్వంగా చెప్పక తప్పదు. గమనించాల్సిన విషయం ఒకటుంది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం '' శాశ్వత శాంతి ఒప్పందం '' కుదిరింది. కాని ఆ తర్వాత తలెత్తిన అశాంతుల వల్ల ఆ ఒప్పందపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. పైపెచ్చు త్వర త్వరగా అభివృద్ధిచెందుతున్న శాస్త్ర, సాంకేతిక జ్ఞాన నైపుణ్యం వలన మారణాయుధాలలో అత్యంత ప్రమాదకరమైన '' అణుబాంబు '' తయారీ యుద్ధ వాతావరణం వైపు మొగ్గు చూపేలా చేసింది, దాని ద్వారా అంతా నాశనంచేసి దేశాలను తన అధీనంలోకి తెచ్చుకోవచ్చుననే దురాశ, సామ్రాజ్య వాదానికు మరింత ఊతమిచ్చింది. మారణాయుధాల తయారీ, లేదా సమకూర్చుకోటం రెండవ ప్రపంచ యుద్ధం దారిచూపి, దేశాల మధ్య ఆయుధ పోటీని రెట్టింపు చేసింది. 1939-45 కాలంలొ జరిగిన యుద్ధాలాన్ని యెంతో వినాశాన్ని, విధ్వంసాన్ని సృష్టించాయి. అంతటితో ఆగక ఆసియా, ఆఫ్రికా సుదూర పసిఫిక్ దీవుల్లో భీకర పోరాటాలకు ఆజ్యం పోసాయి. అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి అనివార్యంగా తీసుకెళ్ళాయి. హిట్లర్ తనకు బద్ధ శత్రువైన సొవియట్ యూనియన్‌ తో ''దురాక్రమణ వ్యతిరేక ఒప్పందం '' కుదుర్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేయటం ఒక గొప్ప (దుష్ట) నైపుణ్యం అని తదుపరి గాని అర్థం కానిది. 1939 సెప్టెంబరు ఒకటో తారీఖున పోలెండ్ సరిహద్దుపై తన సేనలను (కావాలనే మారువేషాల్లో - పోలెండు సైనికుల మాదిరి భ్రమ కలిగించి) పోలెండు పంపి తన సేనలపై దాడి జరిగిందని (తను యేర్పాటు చేసుకున్నట్లే) సాకు చూపి, పోలెండ్ ను బిస్కట్ నమిలినట్లు చేయడంలోనే ఆతని దురాక్రమణ చాతుర్యం యెంత కుటిల మైనదో అర్థమౌతుంది. గతంలోనే చేసుకున్న ఒప్పందవలన జర్మనీపై దాడి జరిగితే పోలెండుకు మద్దతు యిస్తామని, బ్రిటన్‌, ఫ్రాన్సు దేశాలు మాట యిచ్చివున్నందున సహకరించాల్సిన తప్పనిసరి పరిస్థితిని కల్పించాడు. అందువలన అవి పోలెండుకు మద్దతుగా జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. అయినా నెలరోజులలో హిట్లరు పోలెండు పై విజయం సాధించాడు. అందుకే ఈ కాలాన్ని (1939-40) యుద్ధ ప్రకటనల కాలంగా చరిత్రలో నిలచిపోయింది. 1939 సెప్టెంబరులో జర్మన్‌ ప్రారంభించిన యుద్ధాన్ని అనవసరయుద్ధంగా అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి లిన్‌స్టన్‌ చర్చిల్ పేర్కొనటం గమనార్హం. యుద్ధాన్ని నివారించకలిగిన అవకాశాలు వచ్చినట్లే వచ్చి జారిపోయి యుద్ధం అనివార్యమైందని గ్రహించవచ్చును. అసలు హిట్లరు నైజం యేమిటో తెలుసుకోగోరు వారు అతని స్వీయచరిత్ర ' మెయిన్‌ క్యాంప్ ' చదివితే బోధపడుతుంది. అతనిలోని క్రూరత్వం, యుద్ధ కాంక్ష, సామ్రాజ్యవాద కామం ఎంత తీక్షణంగా వున్నయో మొత్తం బయంకర విశ్వరూపం మనకు దర్శనమిస్తుంది. అతని ప్రసంగాలలోని తీవ్రత, ఉద్రేకం కమ్యూనిజం నిర్మూలనాధ్యేయం, కార్మిక సంఘాలయెడల విచ్చిన్న ధోరణి, అతనిలొ మెండుగా వున్నయనే భ్రమ కొంత కాలం ఫ్రెంచి, ఇంగ్లండు వారికి ఉండేది. కేవలం వెర్సైల్ ఒప్పందం అల్ల తీవ్రంగా నష్టపోవడం, ఇతర దేశాలకు తాను అపరాధాలు చెల్లించవలసిరావటం. జర్మనీలోని డెమొక్రాటిక్ సోషలిస్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నిరంగాలలో విఫలమవ్వటం తన నాజీయిజానికి నియంతృత్వానికి మార్గం సుగమం చేసాయి. అందుకే 1934 నాటికి హిట్లర్ అధికారం చేపట్టీ పచ్చి నియంతగా, సైనిక బలాన్ని పెంచుకోవటమే కాక తిరుగులేని నాయకుడుగా ఎదిగి, నౌకాదళ అభివృద్ధిపరిచి, సైనికాధికురులందర్ని తన చెప్పుచేతల్లోపెట్టుకుని, పెత్తనం చెలాయించి వారి తోడ్పాటుతోనే జపాన్‌ సామ్రాజ్య విస్తరణ మొదలు పెట్టాడని తెలుస్తున్నది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు జపాను వారు కూడ ఆసియాలో కమ్యూనిజాన్ని పారదోలాలనే కంకణం కట్టుకునివుండట వలన ఆ నినాదంతోనే జపాను 1931 ముందుకురావటం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉద్యమ నడపటంతో పాటు అందులో భాగంగా ఉత్తర మంచూరియాలో ఘర్షణ సాకు చూపెట్టి, చొరబడి అంతర్జాతీయ అభిప్రాయాలేవీ పట్టించుకోకుండా ఒంటెద్దుపోకడతోనే అక్కడ తన అజమాయిషిలో ఒక ''కీలుబొమ్మ'' ప్రభుత్వాన్ని యేర్పాటుచేసింది. 1933 లో చైనాలో జహోల్ ను, 1935 లో చహార్ ను ఆక్రమించింది. 1936 నాటికి చైనా ఈశాన్య చైనాలో తిష్టవేసింది. అదే సంవత్సరం జపాన్‌, జర్మనీ కలసి కొమిన్‌టర్న్‌ ఒప్పందం, ఏడాది తర్వాత వారితో ఇటలీ చేరడం, చైనా పై దురాక్రమణ కావించి, షాంగై, నాన్‌కింగ్ లను ఆక్రమణ చేసి, 1939 లో దక్షిణ చైనా కోస్తాతీరంలో ఎక్కువభాగం తన అధీనంలోకి తెచ్చుకుంది. యూరప్ లో యుద్ధ ప్రజ్వలనే జపాన్‌ పథకాలకు అనువైన నేపథ్యం అయింది. జపాన్‌ను ఆదర్శంగా తీసుకున్న ' ముసోలిన్‌ ' ఇఠోపియాపై దాడిచేయాలనుకుంటే దానికి బ్రిటన్‌ అడ్డు చెప్పటం హిట్లరు తో చర్చించి ఫ్రెంచ్ని ఒత్తిడి చేయబోతే, అందుకు ఫ్రెంచ్ వారు అనుమతిని ఉపసంహరించుకున్నారు. **
చిట్ట చివరగా 1945 మే నెల 5వ తేదీన జర్మనీ తన ఓటమిని అంగీకరించింది. దర్మిలా జర్మనీని మట్టి కరిపించిన మిత్ర కూటమి ( బ్రిటన6, అమెరికా, ఫ్రెంచ్) జపాన్‌ పై దృష్టి సారించి 1945 ఆగష్టులో హిరోషిమా నాగసాకి లపై అణుబాంబులవర్షం కురిపించి విధ్వంసం చేయటం మనమెరిగినదే. ఆ దెబ్బతో జపాను కూడ ఓటమినంగీకరించడం ప్రపంచ చరిత్ర్తలో చిరస్థాయిగా నిలచిన దారుణ మారణ యుద్ధకాండకు నిదర్శనాలే కాదు. ఆ యుద్ధం తాలూకు శకలాలు, నష్టాలు, బాధలు, మరువలేనివి. సామ్రాజ్య వాద దేశాల దాహం యెలాంటి ఘోరాలు చేస్తుందో తెలుసుకునేందుకు చరిత్రలో నిలిచిపోయాయి. ఆర్థిక సంక్షోభాలను సాకుగా తీసుకునో, లోబరుచుకునో, పెత్తనం చలాయించాలనే బుద్ధి వాటికి ఇప్పటిలో పోదు. అంత కఠోర సామ్రాజ్య కండూతి కలిగిన అమెరికాను, దాని పొరుగు దేశమైన కెనడాను వదిలి, యింకా స్పష్టంగా చెప్పాలంటే వెలివేసి 33 దేశాలు ఒక కూటమిగా '' సలాక్ '' పేరుతో ఒక కోలుకోలేని '' ఝలక్ '' యిచ్చాయి. వాటిలాగ, మిగతా దేశాలు కూడ సామ్రాజ్యవాదా్నికి వ్యతిరేకంగా ఓ బలమైన కూటమి యేర్పడితేగాని సరళీకరణ, ప్రపంచీకరణ, గ్లోబలీకరణ (ఎల్.పి.జి.)లకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటోతేదీన ప్రతిన పూనాలని కోరుకుంటూ.........(వ్యాసం విస్తృతి కాకుండ కొన్ని విషయాలను కుదించడం జరిగింది) ** (ముక్తాయింపు: 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కటొక్కటే జపాన్ నుండి అమెరికన్ సేనల అధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయాసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమికొట్టాయి. అప్పటికీ జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియెట్ యూనియన్ జపాన్ తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ అధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకీ లపై అణుబాంబులను ప్రయోగించటంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది.)
__________________________________________
** ఆధునిక ప్రపంచ చరిత్ర, రెండవ ప్రపంచ యుద్ధం - వాటి పర్యవసానాలు, సీక్రెట్స్ ఆఫ్ సెకండ్ వర్ల్ద్ వార్ లాంటి పుస్తకాల సహాయంతో మరియు వికిపీడియా నుండి సేకరించి ఇది తయారు చేయబడింది) **రచయిత: కపిల రాంకుమార్, గ్రంథాలయ నిర్వాహకుడు, బోడేపూడి విజ్ఞానకేంద్రం, సుందరయ్యనగర్ ఎన్‌.ఎస్.పి.కాలనీ, ఖమ్మం 507 002 మొబైల్ నెం. 9849535033

No comments: