10, ఏప్రిల్ 2014, గురువారం

కపిల రాంకుమార్|| మినీలు|\

కపిల రాంకుమార్|| మినీలు|\
1. ఆపదలో - ఆదుకునేందుకు
బురద బాధించదు!
అపవాదు మీదపడ్డపుడు
మనసు దేనిని భరించదు!

2. పుట్టుకతో వచ్చిన బుద్ధులు
పుడకలతో కాని పోవు!
వ్యక్తిత్వానికి పడ్డ మచ్చలు
గతించినా తొలగవు!
10.4.2014 సాయంత్రం 6.30

3, ఏప్రిల్ 2014, గురువారం

|ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు

కపిల రాంకుమార్ ||ఎన్నికల కన్నెర్ర పూల గుసగుసలు||
**
అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు గుబులెన్నో
అంతులేని నేతల గొంతెమ్మ కోరికలెన్నో!
**
పనితనం బేరీజులో నూటికినూరు సున్నాలే
ఎవరి పుస్తకం తెరిచినా మసిబారిన పేజీలే!
**
లాభ సాటి స్థానం శక్తికి మించినదే
గెలుపు మేతకు యుక్తిలెన్ని పన్నాలో!
**
గతచరిత్ర విలువ మచ్చుకైనా లేకపోయె
చీకటి కోణపు కతలన్నీ చూస్తే తన్నులే!
**
ధనం మద్యం ముందు ఉద్రేకం ఆవేశం పనిచేస్తాయా?
ఉపాయం అలోచన శూన్యం కుర్ర, కర్ర పెత్తనం గెలిస్తుందా?
**
జుట్టు రంగు మారిస్తే జట్టుకు హంగులొస్తాయా?
బట్టతల ఎత్తుగడలకు పుట్టగతులున్నాయా?
**

తిట్టిన వాని పక్కనె చేరి జైకొట్టాలన్నా!
పెంచినవాణ్ణి నెట్టగ గోడలెన్నో దూకాలి
**
సిగ్గులెగ్గులొదిలేయాల్సిందే సీటుకై
తొడుగు విముఖమైనా చేరాల్సిందే!
**
వంటలు చేసో బట్టలుతుకో
కాళ్ళు పిసికో కాయం శ్రమించాల్సిందే!
**
చేరిన వాడి అవినీతి మచ్చ గోప్యమవుతుంది
వాడుకొట్టిన దెబ్బ మానుతున్న మచ్చవుతుంది!
**
వచ్చినవాడి నాలుక (నోరు) నరంలేనిదైనా
ఇచ్చవచ్చినట్లు మాట కుట్టేయాల్సిందే!
**
పార్టీ చెక్‌లలో బొక్కపెట్టి చక్కగ చెక్కులు ఫోర్జరీ భోజ్యం
కోటావాటా చాటుమాటైనా సూటుకేసులు సర్దే లౌక్యం!
**
నిలబడతానని మాటిచ్చి రాబట్టాల్సినదంతా నొక్కేసి
చివరిక్షణంలో వెధవ్వేషం త్రేంచుకుంటూ పలాయనం!
**
బతిమాలితే బిర్ర బిగుస్తారు
అర్థణాకి చెల్లనోడు బోషాణం కోరుతాడు!
**
రాష్ట్రం బ్రష్టు పడ్డా నాకేమి కేంద్రం చేరితే చాలు
వక్రమార్గం నడవాలంటే చక్రం తిప్పేది అక్కడే!
**
అమ్మకు అన్నంపెట్టనోడు అత్తకు మంచం వేస్తాడు
ఆలికి అన్యాయం చేసైనా అంగడిబొమ్మ చేరతాడు!
**
పార్టీలు మారేటోడికి జాతి లేదు! నీతి లేదు!
గెలిచామా లేదా అంతే ఎవరేమనుకుంటే ఏమి?
**
కట్టి పడేస్తే వెట్టి చాకిరి
మెతకవహిస్తే అసరుకెసరు!
అసలు సరుకే కొసరు మోసం!
పిల్లి పెసరతో పాల ఫాక్టరి!
**
ఐకమత్యం అందమైన నినాదం!
రంగులోరంగు ఆనదని
(రం) గులతో ఆరంగ్రేటం!
ఓటేసేటోళ్ళు ఓటి వెధవలా?
నోటాతో నోటుని, నోటిని సాగనంపరా!
**
3.04.2014 11.06 am

|| గాదికింది పందికొక్కు ||

|| గాదికింది పందికొక్కు ||

సుప్రభాతవేళ కోకిల పాట కోసం
మావిడిచెట్టుకేసి చూసా!
కర్ణకఠోరంగా ప్రహరీగోడమీద
కాకి గోల మాత్రం చికాకు పెడుతోంది!
కిటికీ భళ్ళున మూసిన శబ్దం విని
'' కాకి అరుపు విన్నారుగా -
ఇక ఎవరో కొంపకు దిగేటట్టున్నారు!''
మా ఇంటావిడ శరసంధానానికి
'' అదొక్కటే తక్కూవైంది మనకి,
నా మొహాన కాస్త టీ నీళ్ళు పోస్తావూ ''
అన్నమాట వినిపించుకోకుండా
'' పండుగ నెత్తిమీద పడింది దాని సంగతి
దేవుల్లాడరా? '' ఎదురు దాడి టీ తోనే!
'' అందుకోలేనంత ఎత్తులో ధరలున్నపుడు
కొన్నింటిని పక్క వారినుండి అడుక్కోక తప్పదు గాని -
సంచి యిటు యివ్వు '' అన్నా
అడుగునబడ్డ బడుగు జాతి వాళ్ళం కదా
అడుక్కోటానికి సిగ్గులొదిలేసిన వాళ్ళం కూడ!
ముక్తసరిగా ముగించి టీ చప్పరించి
రోడ్డెక్కాను కొనేవి యేమిటి, అడుక్కునేవేమిటి
నెమరువేసుకుంటూ
'' వేప పూవు, మామిడాకు, మామిడిపింది
బెల్లం ముక్క, చింతపండు '' ఉగాది ప్రసాదానికి!
''ఈ మాయదారి పండుగలు
నెలాఖరునే రావాలా? వేతన జీవుల వెతలు మాటటుంచితే
బోడి విశ్రాంత బడుగుజీవి గతేమిటీ '' అనుకుంటు
మోహనరావు అంగడి చేరాను
అడగలేక చేతులు నలుపుకుంటుంటే
'' పాత బాకీ ఎప్పుడు చెల్లుబాటు
పండగ సరుకులకు పొద్దున్నే దాపురించారు?''
మునిసిపాలిటీ వారి ఇంటిపన్ను నోటీసులా!
లేని నవ్వు తెచ్చుకుని '' నిజమే దండగే అదే పండగ ''
నా సంజాయిషి పూర్తికాకుండా, నా మీద జాలో,
నానుండి అతను వసూలు పెరుగుతందనే ఆశో! నాకు తెలీదు కాని
'' పట్టండి తప్పుతుందా. .’’ విసుక్కుంటూ యిస్తుండగా
నా దృష్టి మాత్రం ఇంకెక్కడో..... అటు పక్కో జీపు యిటుపక్కో జీపు
''మాతో వస్తే 100 రూపాయలు, క్వార్టర్ బాటిల్, బిర్యాని పొట్లం ''
చెరో పక్కనుంచి నన్ను లాగుతున్నటనిపించింది!
'' ఆఁ...మాతో వస్తే 100 రూపాయలు, రెండు
బిర్యాని పొట్లాలు ''
ఎన్నికల ప్రచారానికి కూలివాళ్ళ వేటలో నా దగ్గరకే వచ్చినట్టుంది!
'' ఇటు చూస్తే బాదం హల్వా అటు చూస్తే ఇడ్లీ సాంబారు ''
ఎదో అవే మాటలు శ్రీశ్రీ అన్నట్లు గుర్తుకొచ్చి,
సంచి అందుకుంటూండగా
'' ఈ బాకీ, పాత బాకీ చెల్లింపు ఎప్పుడు.''
వెంటనే జవాబు చెప్పలేను......ఎదురుగావున్న అహ్వానాన్ని
అందుకుని, మౌనంగానే ఇంటి ముఖం పట్టాను!
చలపతి దొడ్లోంచి మామిడాకులు, మామిడిపిందెలు,
వెంకట్రావు దొడ్లో వేపపూవు సేకరించి
హడవుడిగా అడుగుపెట్టానో లేదో
ఇల్లు కడిగిన బురదలో జారి బొక్క బోర్లపడ్డాను
సరుకులన్నీ బురద, రెండు బిర్యాని పొట్లాలు వెక్కిరిస్తూ!
దులుపుకుని లేచాను, హతవిధీ అనుకుంటూ,
పండుగ సంబరం మాట అటుంచి
అటు వెతికి, యిటు వెతికి (పోపుల డబ్బా, చెక్కా బీరువా వెతకగా)
యాభై జమకూడితే సరితా క్లినిక్‌కు వెళ్ళి
ఇంజెక్షన్‌ చేయించుకుని
మంచం మీద విశ్రాంతి తీసుకుని
నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో కాని
'' నాన్నా! పండుగపూట దెబ్బలు తగిలాయా? ''
అంటూ మా అమ్మాయి పలుకరింపుతో
నా బాధలు, నొప్పులు మటుమాయమైనాయంటే నమ్మండి
అలా పలకరించిన మా అమ్మాయి అభిమానానికి
అన్నీ చికాకులు మటుమాయమయ్యాయి!
''పరామర్శలు ఆపితే ఉగాది పచ్చడి తీసుకొని
అన్నం తిందురుగాని రండి '' హోం మినిస్టర్ కేకతో
ఒక్కొక్కప్పుడు గాదికింది పందికొక్కు శబ్దాలు కూడ
సుమధుర కోకిల స్వరాలవుతాయని నన్ను నేను
సముదాయించుకున్నాను! **

కపిల రాంకుమార్ 9849535033

27, మార్చి 2014, గురువారం

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

కపిల రాంకుమార్ || రంకుల రాట్నం||

పదవి రాదని - పరువు కోసం 
ప్రజల సైతం- మభ్యపెట్టి
లాభ నష్టపు - లెక్కలేస్తూ
గోతికాడి - నక్కలాగ
అదునుకోసం - ఎదురుచూసే
దొంగచూపులు - పట్టుకుని
చేరేదీసే - బుజ్జగింపులు .1

ఇంతకాలం - అంటకాగి
కొంతమూల్యం - వెనకవేసి
కంటకాలను - తాళలేక
సొంత గూటిని - కూల్చివేయ
పరుల పంచకు పరుగులిడుతు
గొర్రె దాటు సాకుల వెన్నుపోట్లు! .2

తెలిసి తెలిసి బూదిలోనె
పడుకొనే కుక్కవోలె
ముక్కచూసి తోకవూపులు
మొక్కవోని నమ్మకాలతో
చొంగకార్చె కేతిగాళ్ళు
ఎన్నికల కలలలోనే
పగటివేషగాళ్ళు
ఎన్నికలవేళలోనే
మన్నికైన నృత్యాలు
ఖర్చులేని వినోదంనీలి చలన చిత్రం!
కొత్తబిచ్చగాడు
పొద్దెరుగని చందాన
ఎక్కే గుమ్మం - దిగే గుమ్మం!
ఎక్కడో పడతాడు
తాతీసిన గోతిలో
కోలుకోలేని మచ్చలా!
మిగిలిపోతాడు! 3.

ప్రమాణాలు పాటించడు
ప్రణామాలు పెడుతుంటడు!
పరిణామాలూహించడు
పరిమాణమే హద్దంటడు! .4
నే చెప్పింది వేదంనన్ను అనుకరిస్తే పాపం!
మీరెట్టపోతే నాకెందుకు
అడ్డదారైనా సిగ్గువదిలైనా
గద్దెక్కటమే నా గురి!
తెగ బొక్కటమే తదుపరి! .5

చొక్కా మార్చటం
చక్కగా యేమార్చటం
చెక్కభజన చేయటం
తార్చైనా కుర్చీ ఎక్కటం!
రానివాడికి చోటులేదు
రాక్షసత్వం అబ్బనోడికి
రాజకీయ మనుగడుండదు! .6

27.3.2014

21, మార్చి 2014, శుక్రవారం

ఎవరు? అమ్మ కొడుకు||

కపిల రాంకుమార్|| ఎవరు? అమ్మ కొడుకు||

మానవ జన్మ మహత్తరమైనదని
వచిస్తూనే తోటి మానవులకు
ద్రోహం చేయడమేమిటి?


అక్షరాలను నేర్చిన పాఠశాలనే
పాంథశాలగానో, పానశాలగానో మార్చటమేమిటీ?
గురువులకే వంగి నమస్కరించిన వాడే
పంగనామాలెట్టడమేమిటి?

ప్రజల మద్దతుతో పదవులందుకొని
ప్రజలను నట్టేట ముంచడమేమిటీ?
అమ్మ పాలు కమ్మగా తాగి
రొమ్ములు కోసే నైజమేమిటీ?
గ్రామస్థాయి నుండి పార్లమెంటు మెట్లెక్కి
గ్రామసింహ స్థాయికి దిగజారుడేమిటి?
అంటే వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడేనా?

సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పక్షాన అత్యున్నత స్థాయికెదిగి
చొక్కా మార్చిన చందాన పార్టీలు మార్చి
నిన్న పొగిడి,
నేడు తెగనాడు వాడు
లం........కొడుకు కంటె హీనమగుటేమిటి?

చెట్టుపేరు చెప్పుకొని,
తాతల ప్రవరలు చెప్పుకొని
పబ్బం గడపటానికి ఈ వేదికే దొరొకిందా!
నిత్య కృత్య రాజకీయ వ్యభిచారమాచరిస్తూ
నికృష్ట బతుకులో
పందిలాగ బురదలో పొర్లుతూ
నీతి సూత్రాలు వల్లించుటేమిటి?

ఓటేసే ప్రజలు దేవుళ్ళంటూ దేవురించి
గట్టేక్కిన పిదప గద్దెక్కి వాళ్ళ
కూడు, గూడు, గుడ్డ గుంజుకుని
వివస్త్రులుగా, నిర్వాసితులుగా, ఆకటి కేకలకెరచేయుటేమిటి?

ఎత్తిన జెండా కడకంటా
మోయండం గొప్ప!
చచ్చిన పిదప కప్పించుకునే
గౌరవం పోగొట్టుకుంటే ఎలా?

ఇది రాజకీయమా?
అరాచకీయమా
''రా''క్షసంగా ''జ''నాలకు ''కీ''డుచేయు ''యం''త్రాంగ నైపుణ్యంతో
పదవీ కామ ప్రకోపాన
ప్రతాపాలు చూపువారు లం............కొడుకులు!

21.3.2014

|\అక్షర క్షిపణి|\

కపిల రాంకుమార్|\అక్షర క్షిపణి|\
ఓ అక్షరానికి మరో అక్షరం పేర్చటం కాదు
అది క్షిపణిలా పేలినపుడే కవిత్వం!
పళ్ళగొర్రుతో దమ్ము చేసిన చేలో వరినాట్లు
చదరంగపు గళ్ళున్నట్టుండాలి!
గాలికి వూగే జొన్నకంకులమీద వాలిన పిట్టలాగుండాలి
మబ్బులను అహ్వానిస్తూ ఆకాశంలో విన్యాసం చేసే తూనీగల్లాగుండాలి!
కొండరాళ్ళ మధ్య సెలయేటి సవ్వడిలా
నాట్యమయూరి సిరిమువ్వల ఝరిలా
యుద్ధభేరీ నినాదంలా వుండాలి కవిత్వం!
నైపుణ్యం సంతరించుకున్న శిల్పంలా
విప్లవ శంఖంలా
వసంతకాలపు వెచ్చని సూర్యోదయంలా
శారద రాత్రుల మలయ మారుతంలా
కొబ్బరిచెట్టునీడలో వాల్చిన పడకుర్చీలా
గండుతుమ్మెద రెక్కల సవ్వడిలా
పొగరెక్కి పొలంగట్టుమీద రంకేలేసే ఒంగోలు గిత్తలా!
ఎలకోయిల మధుర గానంలా!




జామాకు వగరులా!
వేపాకు చిగురు అనుపానంలా!
చెరుకుపానకంలో అద్దుకునే మినప రొట్టెలా!
రోమాంచిత సాహితీ స్పర్శలా!
వీర తిలకం దిద్దే పత్నిలా!
ధైర్యపు  భుజంమీది సంధించిన ఆయుధంలా!
శత్రు స్వప్న  సింహంలా !
జతగూడే అక్షరమే జతగాడౌతుంది!
పదాలతో పదాతిదళానికి మొనగాడైన అధిపతౌతుంది!
అసమర్థిని ఎంపికకు విరోధి అవుతుంది!
సమర్థునికి జయకేతనమౌతుంది!
నిత్య ప్రకాశ సత్యమై
నిబద్ధత కలిగివుంటుంది!
జన చైతన్య వికాసమై
ఎగిరే ఎర్రజెండాలా
భూతకాలపు జల్లెడై
వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ

భవిష్యత్తరుణ పతాకమౌతుంది.!

సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక |

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 16.3.2014 నివేదిక ||
ప్రతినెల మూడవ ఆదివారం సాహితీ స్రవంతి అధ్యయన వేదిక సమావేశం బి.వి.కె.  గ్రంథాలయంలో కపిల రాంకుమార్ మాట్లాడుతూ కవిత్వం - శిల్పం అధ్యయనంలో భాగంగా సుధామ వ్రాసిన  చిత్రగ్రంథి సంకలనం నుండి వివరన అనే కవితను  వినిపించారు. ఈ సమావేశం కపిల రాంకుమార్ అధ్యక్షత వహించగా డా.పొత్తూరు వేంకట సుబ్బారావు అతిథిగా విశ్లేషణ చేయటానికి, చర్చను కొనసాగించటానికి కన్నెగంటి వెంకటయ్య, రౌతు రవి వేదిక అలంకరించారు. చర్చను ప్రారంభిస్తూ డా.సుబ్బారావు గారు సుధామ కవిత్వం చిత్రగ్రంథి అనేపేరే శిల్పానికి సంబంధించినదని, శ్రీహర్షుడు  తన హర్ష నైషధంలో గ్రంథిస్ అనే పదాన్ని ఉపయోగించాడని, అది యోగవిద్యకు సంబంధించదని తెలిపారు. కవికి ప్రతిభ, ఉత్పత్తి పుష్కలంగా వున్నపుడు అద్భుతమైన కవిత్వాన్ని సృష్టిస్తాడని, లోక దృష్టి, లోక స్వభావం తెలుసుకోటం ద్వారానే అటువంటి అసమాన సృజన జరుగుతుందని తెలిపారు. పఠన, పాఠనం  ద్వారానే  సాహిత్యాన్ని సృష్టించకలుగుతాడని తెలుసుకోవాలన్నారు. సంవిధానం(శిల్పం)లో శ్రీశ్రీ దిట్ట. 
పద లక్షణాలు సుష్టుగా ఉపయోగించగలనేర్పరి కాబట్టి ఆయన పఠన, పాఠనాన్ని బాగా అల్లగలిగాడు. బ్రహ్మ గ్రంఠి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి  అనేవి మూడు యోగానికి చెందినవి. ఒక కవి యొక్క పూర్వాపరాలు తెలుసుకుంటే ఆ కవి హృదయలోకి మనం వెళ్ళవచ్చు, రూపం, బాహ్యం రసం అంతర లక్ష్యణం. రూపం అనేది భావాన్ని బట్టి వస్తుంది. కవిత్వం లోకానికి అద్దం వంటిది. అందుకే లోకాన్ని కవి నిశితంగా పరిశీలించాలి. అప్పుడే వస్తువుకు తగ్గ సరియైన 
రూపాన్ని ఇచ్చినపుడే మంచి కవిగా రాణిస్తాడు. ఆశ్చర్య చకితులను చేసేదే చిత్రం అంటాము ( రూపమే శిల్పం కదా) నీది కాని విషాదం లేదా ఆనందాలను నీలో ప్రేరేపింపకలిగించడమే కవిత్వం, లేదా కవిత్వ గొప్పదనం.  ప్రతిభ కవికి, చిత్రకారుడికి, గాయకుడికి వుండాలి. Imaginations are two  అందులో ఒకటి primary రెండోది secondary .  ఆకారమును చూసి మోసపోకూడదని  అని మనం గుర్తించాలి. అందుకే కవి అనధికార శాసనకర్త అని
 కూడా నిర్వచించారు. జీవితం మీద ప్రేమను పెంచాలి కవిత్వం.   స్వాంతనమైన సాంత్వనము కలిగించాలి ( ఓదార్చే హృదయాన్ని) అంటూ చక్కటి సోదాహరణలతో వారి విశ్లేషణ ముగిసింది. కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ చిత్రగ్రంథి పై చక్కటి విశ్లేషణ చేసారు. మాకు తెలియని విషయాన్ని విడమర్చి చెప్పారు. చాల కొత్త విషయాలను కూడా సుబ్బారావు గారి ద్వారా తెలుసుకోగలుగుతున్నామని అంటూ కవి లక్షణాలు, కవిత్వ లక్షణాలు వివరించిన ర్తీరు బావుందని శిల్పంపైనే ఇవాళ చర్చ బాగ జరిగిందని అభిప్రాయం తెలిపారు.చర్చలో పాల్గొన్న సాహితీ స్ర్వంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి '' చిత్ర గ్రంథి ' పై చక్కటి విశ్లేషణ చాల బావుంది అంటూ '' మాక్సిమ్‌ గోర్కీ '' చెప్పినట్లు అవబోధనా శక్తి, బోధనాశక్తి ప్రతి మనిషిలో వుంటాయని, అవి మనిషి తనను తాను కాపాడుకోటానికి, పరిశీలనకు, మరింత లోతైన అవగాహనకు దోహదపడటాయని చెప్పాడన్నారు.   ఊహించటం,  అనుభూతిగా మార్చుకోటం, సత్యంగా ఆవిష్కరించడం ఎవరు నేర్పుగా చేస్తారో వారు తమ కవిత్వం ద్వారా లోకాన్ని ప్రభావితం చేస్తారని, జీవితం నవనవోన్మేషaగావుండే రీతిలోనే శిల్పానికి వుండే ప్రధాన్యత తెలుసుకొని బాగా అభ్యాసం చేయాలని, నిత్యం మారుతున్న సమాజాన్ని నిశితంగా పరిశీలించనిదే సజీవ సాహిత్యం రాదని తన చర్చను ముగించారు.  చర్చపై  సునంద,  సంపటం దుర్గా ప్రసాద్, బండారు రమేష్, డా. ఆంజనేయులుం ఎం. శేషగిరి,  శైలజ, బషీర్ మొదలగు వారు తమ తమ అభిప్రాయాలు చెప్పారు.  సంపటం దుర్గా ప్రసాదు వందన సమర్పణ చేస్తూ 31.1.2014 ఉగాది కవి సమ్మేళనం ఉదయం 10 గంటలకు నిర్వహించాలని అనుకుంటున్నామని. సమాచారాన్ని త్వరలో తెలియపరుస్తామని, సాహితీ అధ్యయన వేదిక ఈ సమావేశం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత జరుపుకుంటున్న మొదటి సమావేశమని అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

5, మార్చి 2014, బుధవారం

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!

జన విజయం: ఆయువు తరగని ఆకలి బూచి!: బూచి..! పుట్ట్టల్లో,పిట్టల్లో,పువ్వుల్లో,నవ్వుల్లో కలిసిపోయి ఆడుకుంటూ..., గాలిలో,దూళిలో కలతిరుగుతూ, పావురంలా,పాలపిట్టలా ,గా...

|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||

కపిల రాంకుమార్|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! ||
రక్తం సూర్యుడ్ని ఆవిష్కరించి, చర్యల ప్రతిచర్యల పరిష్వంగంలో నేత్ర ధనుష్ఠంకారం చేసి, భారమితి తో తులనాత్మకం చేసి, మోహనమైన కవిత్వాన్ని భూనభోంతరాలు దద్దరిల్లచేసిన కవిత్వ సంపుటిని తన మాటలతో సంజాయిషి తనకు తానే యిచ్చి, కవి ప్రపంచాన్ని మెప్పించి, ఎందరో నూతన కలాలకు చక్కటి ఒరవడ్డి దిద్దే ఆంగ్లోపాధ్యాయుని తెలుగు కవితా విశ్వరూపం అలా ఓ చిన్న నేతిబొట్టులా కవితా భోజన ప్రియులకు అందిస్తున్నాను......
'' రక్తం /చుక్క
వీగిపోయి / చెమట
చుక్కగా రూపందింది
చెమట చుక్క్క తకెత్తదు!
ప్రశ్నించదు!
నమ్మకంగా పంజేస్తుంది ''
**
'' కాని
సిరా చుక్కవుంది చూశావ్
విద్యుదాగారంవిప్లవా వాసం!
సిరా చుక్క స్పర్శ
చెమట చుక్కని రక్తం చేస్తుంది
కల్తీ లేని కణకణలేని / నిప్పులాంటి రక్తాన్ని చేస్తుంది! '' అందుకే / రక్తం సూర్యుడు! రక్తం ప్రతిచర్య!
**
శివారెడ్డి ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టడం కోసమో, లేదా మెప్పు సంపాదించటానికో కవిత్వ రాయలేదు. తనని తాని చీల్చుకుని, మధించి, మదించి, విశ్లేషించి, దహించికొని, పుటం పెట్టుకొని, నికార్సయిన సమాధానంలా, ఒక నిజాయితీ నింపుకొన్న, ధర్మంగానే రాసానన్నారు. తాను నమ్మకుండా, ఆసాంతం దాని లోతు తెలుసుకోకుండా, ప్రలోభాలతోనో, ఊసుపోకో మాత్రం రాయలేదంటారు. తరిచి, శోధించి, పరీక్షించి, ఫలితం వస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత కవిత్వంతో అడుగుల పిడుగులు కురిపించారు. తన చిన్నతనంలో పడిన జీవన వాస్తవాల ఒడుదుడుకులను, బాల్యంలోని అన్ని అవస్థలను మరిచిపోలేదు కాబట్టే, ఆ ప్రభావం తన కవిత్వంలో పారదర్శకంగా చూపించకలిగారు. అమ్మ గతించిన బాధకాని, పల్లెటూరి పిల్లగాడి సహజ భయాలు, ఆందోళనలు జ్ఞప్తికి తెచ్చుకుని, జానపదులు పాడిన కీర్తనలు, తత్వాలు, బుడబుక్కలవాని ఆటపాట, గారడీవాని జిమిక్కులు, తొలకరి వానజల్లుల్లో తడిసి జలుబు చేసిన రోజులు, పశులకొట్టంలోని పేద, గొడ్లు తొక్కిన గడ్డి, రొచ్చు, అక్కడక్కడ తాను చూచిన ఎత్తు అరుగుల వాకిళ్ళు, కిచకిచమని సవ్వడిచేసే పిచుకలు, తాడిచెట్ల విహారం, వాగుల్లోని యిసుకతిన్నెలపై కట్టుకున్న గుజ్జగూళ్ళు, బడికి వెళ్ళేరోజుల్లో చేసిన అల్లరి, పడ్డ వేదనలు, రాత్రుల్లో గుడిసెలో కిటికి వద్ద ఎగిరే మిణుగురుల వెలుగు, వెన్నెల రాత్రులు, ఉక్కపోతల మండువేసవి, కాలువల్లో ఈతలు, అనాధ బాల్యాలు పరిశీలనలు, ఏకాకితనాలు, కేరింతలు, ఏడుపులు, ఫిర్యాదులు, యెన్నో అంతర్లోకాన్ని గుర్తుతెచ్చుకుంటూ, వాటి తాలూక శకలాలు వెంటాడాయి కాబట్టే మనకు ఇలాంటి కవిత్వాన్ని అందించాడేమోననిపిస్తుంది. ఒక దశలో ఆంగ్ల కవులను చదివినా, అప్పకవీయం ఔపోసన పట్టినా, ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలను సమాంతరంగా సవసాచిలా నడిపినవారు శివారెడ్డి.అందులో అతిశయోక్తిలేదు. '' చర్య - ఇన్నాళనుండి చావిట్లోనేవుందట! పుట్టిన దగ్గరనుండి మేకుకు కట్టేయబడేవుండట!
కోడేదూడ!
బయట కట్టేద్దామని తీసుకొస్తుంటే ఓక గుద్దు గుద్ది ఎత్తిపడేసి దేశాలమీద పాడిందట!....
స్వేచ్చలో స్వేచ్ఛగా స్వేచ్చకై ....
కట్టెయటమంటే - తెంపుకుపొమ్మనే....
అణిచిపెట్టటమంటే ఎదురుతిరిగమనే ....
అసంకల్పిత ప్రకార చర్యని చాల హృద్యంగా చెప్తారు '' చర్య '' లో.
పరిశీలనం, జ్ఞాన సముపార్జనం, తులనాత్మకం కవనానికి అవసరం ప్రపంచపు పోకడేమిటి? ఎటుపోతోంది? మానవుడి స్థితి గతేమిటీ? రష్యా యేమిటి, చైనా యేమిటి, రాజకీయాలమేటీ, అన్యాయాలేమీటి, నిజాయితీ యేమిటీ. ఆర్థిక సంక్షోభాలేమిటి, ధంస్వామ్యం యేమిటీ, భూస్వామ్యం యేమిటీ, చరిత్ర, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, నష్టాలు, మతాలు, కులాలు, హిందూ, బౌద్ధ, జైన, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య బోధనలేమిటీ. రాహుల్ సాంకృత్యాయం ఎవరు? యిలాంటి ప్రశ్నలు, సందేహాలు తీర్చుకోలేకపోతే కవిత్వానికి సరుకెక్కెడిది? అందుకేనేమో అధ్యయనం అవసరమని నొక్కి చెబుతారు. ఆర్థిక విధానాలు మిశ్రమ ఆర్థిక విధానాలు, స్వాతంత్ర్యం ఎందుకు, దాని లక్ష్యం యేమిటీ ఇలాంటి పెక్కు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకోవాలి కదా కవి అన్నవాడు. క్రాంతి దర్శకుడు కావాలి కదా! సాహిత్యంలో వస్తున్న విభిన్న ధోరణులెందుకు ఉత్పన్నం అయ్యాయి. ఒక దానిని మించి యింకొకటా? ప్రత్యామ్నాయమా? వక్రధోరణా, అరసం యేమిటీ, విరసం యేమిటీ, కవిత్వాభివృద్ధికి యేది దోహదపడుతుంది. యిలా తర్జమ భర్జన పడితేనే నికార్సయిన సాధన ద్వారానే కలకాలం నిల్చేకవిత్వం తిక్కన లాగ గురజాడలాగ, వేమన లాగ శ్రీశ్రీ లాగ, ఆరుద్రలాగ, కుందుర్తిలాగ, సృజనచేసే ప్రజ్ఞాపాటవం అలవడాలంటే నిరంతర అధ్యయనం, అనుసరణ, అవగాహన యెంతో అవసరం అంటారు శివారెడ్డి.
భారమితి - కొలమానం కావొచ్చు - మరేదయినా కావొచ్చు కాని - '' కవిత్వానికి కాలం చెల్లిందనో, ఇది కవిత్వానికి కాలం కాదనో, అంతా స్థబ్దత యేర్పడిందనో.....చాలా మంది చేతులెస్తేసారట..... కాని శివారెడ్డి ఒప్పుకోరు కాబట్టే చేత్తో తలుపుమీద గుద్దటం కవిత్వం అంటారు. బోర్లా పడుకుని భూమిని వాటేసుకుంటే కవిత్వం, ముక్కుతో గాలిని వలేసి పట్టడం కవిత్వం, అప్రయత్నంగా చేయి మీసం మీదకి వెళ్ళి, గడ్డాన్ని సవరించుకోటం కవిత్వం, లేదా ఎర్రబడిన ఉదయం, శ్రీకాకుళ పోరాటం, జగిత్యాల జముకల కథ, శిర్సెత్తిన ధర్మపురి, అర్కాటి జిల్లాల్లో నినదించిన వాహకం కవిత్వం.... ముడి యినుము నల్లని రేయిని ఎర్రగా కాల్చి సాగ్గొట్టిన ఆయుధం చేస్తున్న అరణ్యమూ కవిత్వమే అంటూ చేతులన్నీ ఒక్కసారి లేచి ' ఇంక్విలాబ్ ' అంటే ఆకాశమంతా కవిత్వమే, ఈ విశ్వంలోని గాలి, భూమి కవిత్వమే! అంటారు శివారెడ్డి. ఏ విషయాన్నైనా కుండ బద్దలకొట్టి నిర్భయంగా చెప్పటం శివారెడ్డికి అలవాటు. తాను ఏ వామపక్ష పార్టీ సభ్యుడు కాకపోయినా శ్రీశ్రీ మాటల్లోంచి మంచి కమ్యూనిస్టుగాను, మార్క్సిస్టుగాను ఒప్పుకుంటారు. కమ్యూనిజం పట్ల యితర సభ్యులకంటే అపారమైన అవ్యాజ ప్రేమ, గౌరవం వుందని చెబుతారు.. తాను నమ్మాడు కాబట్టి ఒకరి మెప్పుకోసమో, ప్రేరేపించడానికో సంతోషపెట్టడానికో కాకూండా, అధ్యయన మాత్రాన మాత్రమే ప్రపంచ రాజకీయాల్ని లోతుగా పరిశీలించిన ఫలితంగానే తన వాజ్ఙ్మూలం ఇచ్చారు శివారెడ్డి.
మోహనరాగం ఆలపించన శివారెడ్డి
'' నాకింద పక్కలాగో / నావకింద నీళ్ళలాగో / కళ్ళకీంద నీడలాగో / ఆకాశంకింద పక్షి లాగో/ ఆకు సందుల్లో నర్తించే కిరణపుంజంలాగో / ఎండాకాల గాలి నుండి పైకి లేచినప్పుడు నువ్వుకనబడతావు/ వీధిలో ఎర్రటి సూర్యుడు రాయి నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినబడతావు ''.....అంటూ తనకవితలో /'' చేదైనా వేపచెట్టు చిగురించిన వసంత కాలంలా నువ్వు అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు '' అంతకుముందు కవితలలో నిప్పులు కురిపించిన శివారెడ్డి లాలిత్యమైన పదాలను మోహనా! మోహనా! అంటూ కొత్త కోణం ఆవిష్కరించారు. '' దయలేని విధి నిర్వహణలో / రోజుకో అంగం తర్పణ గావించాలికదా /బతుకు మోహనా బతుకు! /బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన / బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన / బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!........తన ఆశంసను వ్యక్తపరచటంలో సఫలీకృతుడైనారు. తన పరిమితులకు లోబడి ఉద్యమాలలో తన కున్న సంబంధాల పరిమితులకు లోబడి తన శక్త్యానుసారం, సమాజ సందర్భంగా తాను తనను వ్యక్తీకరించుకుంటానంటూ, చేసే ప్రయత్నమే శివారెడ్డి కవిత్వం! ప్రజలకేనిటో చెప్పేప్రయత్నమే తన కవిత్వం! తన జీవితం నుండి తనను విడదీసినా, ఈ సమాజం నుండి కాని కాలాన్నుండి కాని విడదీసినట్లైతే తన కవిత్వమే మిగలదని, తనకవిత్వమే కాదు అసలు యే సాహిత్యమూ మనజాలదు, మిగలదు. అందుకే వారి మాటల్లోనే
'' నా సోదరులకి కళ్ళిచ్చాను
నా కామ్రేడ్స్‌కి చేతులిచ్చాను
నా దేశానికి నా దేహానిచ్చాను
కాదు నాదేశమే నాదేహం ''
నేను తుడుం తయారు చేసే వాణ్ణి, నేను ఆయుధాలు తయారుచేసే వాణ్ణి, నేను పాటలు కట్టేఏ వాణ్ణి. మీ అనేకానేక కాంక్షలకి, ఆశలకి, ఊహలకి తగినట్టుగా పాటలు కట్టే వాణ్ణి
- నేను పాటలు కట్టే వాణ్ణి...కె. శివారెడ్డి. ''

ఇది శివమెత్తిన కె. శివారెడ్డి గురించిన స్వల్ప పరిచయం
4.3.2014

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

సారస్వత స్రవంతి - కవి గాయక విపంచి
వచన పద్య కవితల - గేయ వ్యాస కళాకేళి!

అదును పదును కల్పించి
అంకురాలుమొలకెత్త
సాహిత్యపువన సొబగులు
గుబాళించు పూదోట!

మత తత్వం - కుల తత్వం
ఉగ్రవాద విధ్వంసాలను
నిలువరించు సంకల్పం
నిలుపుకున్న దీరత్వం!

చిరుజల్లులా, వానలా
వాగులా, జీవ నదిలా
అనునిత్యం పారేందుకు
పచ్చదపు గీతంలా!

కవిత్రయ కరచాలన స్పర్శతో
గురజాడ శ్రీరంగం కాళోజిల
ఆదుగుజాడలలో బడుగులకై
మా నడకలు సాగిస్తూ!

కొత్త కొత్త వాదాలకు
వైరుధ్యపు భావాలకు
సమతుల్యం పాటిస్తూ
సంయమనం నెరపుతూ!

సహకారం పొందుతూ
సహజీవన సాగిస్తూ
'' సాహితీ స్రవంతి'' గా
ప్రస్థానం చేరేలా!

అంతరంగ విస్తరణతో
అంతర్జాల వ్యాప్తితో
కొనసాగుట మా లక్ష్యం
నూతన అరుణోదయం!

( ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి - ఆవిర్భవించి 15 వ వార్షికోత్సవానికి
సన్నిద్ధం అవుతున్న సందర్భంగా జయప్రదమైన 16.2.2014 నాటి విస్తృత
సమావేశానికి నా కవితాశంస ) సా.6.30

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కపిల రాంకుమార్ |"MY MUM"||

కపిల రాంకుమార్ |"MY MUM"||

Where did it go?
My mother once asked
As the clock tick-tucked
And her life flew past
In the race against time
She led for most of the way
But the track was endless
Unlike her last day
(Take care of your father
Promise you will
As she passed on the baton
She would never spill)
So polish the stars
And fire up the sun
And put out some slippers
To welcome my mum
Find a new galaxy
And light up her name
Because life on planet Earth
Just won't be the same
--- |Michael Ashby|
(స్వేచ్చ్హనువానువాదం)
నా తల్లి ఒకసారి
గడియారం టిక్ టిక్‌ సవ్వడి ఆగినపుడు
అది ఎక్కడికెళ్ళిందని ప్రశ్నించి
ఆమె జీవితం గతించటానికి వెళ్లింది
కాలానికి వ్యతిరేకంగా పరుగుల దిశలో
ఆమె విధంగా అత్యంత చివరి కాలం కోసం దారితీసింది
కానీ మార్గం అంతులేని ఉంది
ఆమె చివరి రోజు కాకుండా
(మీ తండ్రి సంరక్షణ తీసుకుంటానని
వాగ్దానం చేయాలంది
ఆమె రంగంనుడి నిష్క్రమిస్తుండగా )
కాబట్టి నక్షత్రాలు మెరుగును
సూర్యకాంతి తేజస్సును ఆర్పేందుకు
మా అమ్మకు స్వాగతం పలుకుతున్నట్లు
ఒక కొత్త పాలపుంత
ఆమె పేరు దేదీప్యమానంగా వెలగించటం కోసం
ఎందుకంటే భూమిపై అన్ని జీవితాలు
కేవలం ఒకేలా ఉండవని తెలియచెప్పినట్లుంది.
14.2.2014

10, ఫిబ్రవరి 2014, సోమవారం

|| సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||

కపిల రాంకుమార్ || సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||
'' అధునికత '' పదనిర్వచనానికి , '' సమకాలిక '' పద నిర్వచనానికి తేడా వుంది. ఆధుని క కాలవాచికా చెప్పుకునే అర్థం. ఒక కాలానికి ' ఆముక్త మాల్యద ఒక ఆధునిక గ్రంథం అని చిన్నయసూరి అంటారు. కొన్ని విలువల సంప్రదాయం, చారిత్రికనేపథ్యం మార్పులతొ మరికొన్నింటిని అభ్యుదయ కావ్యాలు అంటాము. సమకాలిక అంటే ఏక కాలంలోవచ్చిన కావ్యాలకు విశ్వనాథ, చలం,శ్రీశ్రీల రచనలను సమకాలిక సాహిత్యం అంటాం. రెండూ భిన్న ధోరణులను,వాదాలను, ప్రతిబింబిస్తూ సాహిత్య సృజనతో ముందుకొస్తాయి. సాహిత్య దృక్పథం దృష్ట్యా విశ్వనాథ ఆధునికుడు కాదు.
సమకాలీనత:- ఈ దృష్టితో చూస్తే ఆ కాలంలో వచ్చిన ఏ సాహిత్యమైనా సంప్రదాయం
గానీ, నవీనంకాని ఆధినికతే అనిపించుకుంటుంది.
ఆధినికత:- కాలంలో వచ్చే ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులను గమనిస్తూ,
కాస్త దృక్కోణంలో కవితసృజనలో కావించడమే ప్రత్యేకతను సంతరించుకోవటంద్వారా
ఆఢునికతగా గుర్తింపబడుతుంది. కొన్ని విలువలు, తత్త్వాలు కలిగివుంటుంది. సామాజిక
ప్రయోజనం, హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథం వాస్తవికతలపైఆధారపడటం అనే అంశాలను
ముడివేసుకుని సహిత్య దృక్పథం కలిగిన తాత్త్వికతతో నిలడేదే ఆధునికత.
***
అభ్యుదయవాదం, విప్లవ వాదం వాస్తవికతావాదాలు కొంతవరకు హేతు వాదాలు ఈ
కోవలోకే వస్తాయి.ఆధినికతాతత్త్వం పరకాష్ట చేరిన దశలో సింబాలిజం, ఇమేజిజం,
ఇంప్రెషనిజం, ఫ్యూచరిజం, డాడాయిజం, సర్రియలిజం, నేచురలిజం అనే ధోరణల
సమూహమే '' ఆధునికతకు '' మారుపేరులయ్యాయి.ప్రపంచంలో 1748 లో వచ్చిన వైజ్ఞానిక పారిశ్రామిక విప్లవం, 1780 లో వచ్చిన రాజకీయ ఫ్రెంచ్ విప్లవం 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధ నేపథ్యాలలో ఈ సాహిత్య ప్రపంచంలో కవిత్వం కొత్తపుంతలు తొక్కింది. కాల్పనిక వాదం, సాంప్రదాయికతా వాదం, హేతువాదం లాంటివి 18, 19 శతాబ్దంలో మానవుడికీ ప్రకృతికి మధ్యగల సంబంధాలు, వైరుధ్యాల నేపథ్యంలోనే ఉద్భవించాయి. తదుపరి స్వేచ్ఛావాదం, ఫ్రాంస్‌ లోను, ఆదర్శవాదం జర్మనీలోనూ, సౌందర్యవాదం బ్రిటన్‌లోనూ పుట్టాయని తెలుస్తోంది.
***
మన తెలుగునాట కాల్పనిక వాదానికి ఆర్థిక పునాదులు లేవు. అర్థ ధనస్వామ్య, అర్థ భూస్వామ్య విధానాలు కొనసాగి భావ కవిత్వం పురుడుపోసుకుంది. పై పాశ్చాత్య ధోరణులు ప్రభావంతో, భిన్న ధోరణులతో భావ కవిత్వంలో చోటుచేసుకున్నాయి. స్వీయ నియంత్రణ ద్వారా అమలిన శృంగారం, విషాదం,నిరాశ, పునరుద్ధరణ, జాతీయోద్యమం, దేశభక్తిలాంటివి భావ కవిత్వంలో మార్పులు మనం గమనించవచ్చును.అలాగే సామ్యవాద వాస్తవికతకు, కాల్పనంకతను జోడించినపుడే సాహిత్యం ప్రజలకు చేరువౌతుంది అని విప్లవవాదుల భావన. తాత్వికంగా ఆధునికతలో భాగంగా తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న ధోరణి వాస్తవికతావాదం సహజవాదం(నేచురలిజం)పేర అమెరికా రష్యాలలో 19 వ శతాబ్దం చివరిలో విరివిగా కనిపించింది. వాస్తవికతా వాదంలో (క్రిటికల్ రియలిజం) సవిమర్శక వాస్తవికత(సోషలిస్టు రియలిజం) సామ్యవాద వాస్తవికత ప్రధాన అంశాలుగా పేర్కొనవచ్చును. వాస్తవికతను ప్రతిబింబించడంతోపాటు సామాజిక జీవిత సమస్యలకూ పరిష్కారం సూచించడం ఒక భాగమని తెలుస్తుంది. సమాజ చరిత్ర దృష్టితో చిత్రీకరించడం కూడ వాస్తవికతలోని భాగమే. '' కమ్యూనిస్టు అన్విక్షకి విషయంలో అచంచల నిష్ట, ప్రజాసేవానిరతి, పాక్షికత,శ్రామికజన సమరశీల పోరాటాల సంబంధం, మానవీయ
సోషలిజం'' సామ్యవాద వాస్తవికతకి అద్దం. ఈ పరిస్థితిని వివరించేది మాత్రం గతితార్కిక
భౌతిక వాద సిద్ధాంతమే. ఆ సిద్ధాంతమే అభ్యుదయ సాహిత్యానికి పునాది. త్రిపురనేని రామస్వామి చౌదరి రచనల్లు రేషనలిజం ఆధారంగా వుంటాయి. పాశ్చాత్య దేశాలలో

17 వ శతాబ్దంలో ఆరంభమై మనదేశానికి 20 శతాబ్దానికి మాత్రమే యిది మొగ్గతొడిగింది. కాల్పనిక వాదానికి సమాంతరంగా హేతువాదం ఆరంభమైంది. ముద్దుకృష్ణ '' అశోకుడు ''- చలంగారి '' సావిత్రి ''- పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి '' మహాభారత విమర్శనం'' - నార్ల వారి '' జాబాలి '' - త్రిపురనేనివారి '' ఖూని. భగవద్గీత, '' లాంటివి ఉదహరించుకోవచ్చు.
***
తరువాతి పరిణామాలు అధివాస్తవికత, అస్తిత్వవాదం, అనుభూతివాదం, చైతన్య స్రవంతి, విప్లవ వాదం సంప్రయదాయవాదం, రూపవాదం, జనామోద వాదంలాంటీ ధోరణులు శాఖోపశాఖలుగా వాదాలు, వివాదాలు నినాదాలు ఉద్ధానకతనాలతో సాగింది. సాహిత్యోద్యమం దిగంబరకవిత్వం, దళిత వాదం, స్త్రీవాదం, అంటూ ఎన్నో రకాలుగానూ సాగింది. అరసం, విరసం, సరసం..ప్రరసం...అంటూ సంఘాలూ వచ్చాయి.సాహితీకృషి విరివిగా జరిగింది.
ఉపసంహారం:
దేవీప్రియ ఒక వ్యాసంలో '' రచయితలకేమైనా చెబితే లెక్చరిచ్చినట్టుంటుంది. జనామోదం కోసం యేదిపడితే అది రాయకండి. జనానికేమి అవరమో? ఎటువంటి జాగృతి అవసరమో? అది రాయటానికి మాత్రమే ప్రయత్నించండి! కె.వి.రమణారెడ్డి చెప్పినట్లు '' మార్క్సిజమే '' వల్లెవేయాల్సిన పనిలేదు. కాని, కావలసింది జీవిత వాస్తవాన్ని కాస్త చైతన్యవంతంగా అర్థంచేసుకుని, స్పష్టమైన అవగాహనతో సాహిత్య రూపంగా ( కథ/కవిత/పద్యం.గేయం/వ్యాసం/రూపకం)రూపమేదైనా దాన్ని లోకానికి చేరేలా చేయగలిగితే - ఆ సాహిత్యానికి అసలు సిసలు జనామోదం లభించి తీరుతుంది ''
Betrot Bretcht అభిప్రాయం ప్రకారం '' Popular means intelligible to broad
maasses, taking over their own forms of expression and enriching them (by adopting and consolidating their stand point) representing most progressive section of the people in such a way than it can take over to leadership.''

***
ఇవాళ కొత్త ధోరణి ప్రబలింది. మార్క్సిస్టు సిద్ధాంత నినాదాలు, విప్లవ అలంకారికత వాడే
రచయితల తెగ యింకొకటి పుట్టుకొచ్చి, '' కవిత్వ పదార్థం '' యెక్కడున్నా అస్వాద యోగ్యమే! మార్క్సిస్టు సిద్ధాంతం పోరాట ప్రవచనాలు తమకీ తెలుసు. అచరణకీ సిద్ధాంతనికీవున్న మార్క్సిస్టు నిబంధనని విస్తృతం చేయడమే వారి లక్ష్యం. ఆంధ్ర దేశంలో యీనాడు వెలువడుతున్న సాహిత్యాన్నీ పలాయనవాద సాహిత్యం, బూర్జువా సిద్ధాంత పునాది అధారంగా వున్న సాహిత్యం అతి '' వామ '' పక్ష సిద్ధాంత ప్రేరిత సాహిత్యంగా స్థూల విభజన చేసుకోవచ్చు.పై తరహాలన్నీ కూడ ప్రయోజనపుష్టమైన సాంస్కృతిక రంగాన్ని యేర్పాటు చేయవు. ఫెడ్రిక్ ఎంగిల్స్చెప్పినట్టు '' Freedom is recognition of necessity '' ఇదే అంశం మీద క్రిస్ట్‌ఫర్‌ కాడ్వెల్‌ అన్నమాట గుర్తు
తెచ్చుకుందాం '' Art is the expression of man's freedom in the world of feeling, just as science is the expression of freedom in the world of sensory perception, because both are conscious of the necessities of their worlds and can change them-art the world of feeling of inner reality, science the world of phenomena of outer reality'' (Illusion and reality - Christfer Caudwel)

(ఆర్వీఆర్ వ్యాాసాల నుండి సేకరణ )

10.2.2014 ఉ.7.30

1, ఫిబ్రవరి 2014, శనివారం

కపిల రాంకుమార్|| మచ్చ ||

కపిల రాంకుమార్|| మచ్చ ||

ఒంటరి గది, చిన్న కిటికి
రెండో మనిషికి నిలబడె చోటులేని
ఇరుగు గది...
ఆ గదిలో దాదాపు ఐదేళ్ళు బందీని!
అదీ పెళ్ళయ్యే వరకు!
తలచుకుంటేనే భయం! భయం!
రజస్వలైన 12 ఏటనుండి
తిండికి స్నానానికి తప్ప - బయటిలోకం తెలియకుండా
నిర్బంధానికి గురిచేసిన - సంప్రదాయపు సంకెళ్ళు!
మరువలేని కరాళ నృత్ర్యం! కళ్ళల్లో శూలాల్లా గుచ్చుకుంటూ
కంటి నిండా నిద్రలేని రోజులెన్నో
కన్నీటి చారికలతో చెంపలు - బిగిసిన విషాదపు ఘాతాలెన్నొ!
చదువు చంకనాకి - గుణింతాలు మరిచిపోయే
మైమరుపు ఆవహించినట్లు - అక్షరాలు తడుముకుంటూ
పనికిరాని కాగితాలపై - కాటుకలో ముంచిన చీపురుపుల్లతో
రాసుకున్న పిచ్చి భావనాగీతాలెన్నో!
***
ముక్కు మొహం యెరుగని
కొత్త వ్యక్తితో ముడిపడేవరకు లభించని విముక్తి
అది స్వేచ్చ మాత్రం కాదు
మరో బందిఖానాకు బదిలీ మాత్రమే
అక్కడా ఎన్నో నిబంధనలు,
నియమాలు కట్టుబాట్లు ....
చదువుకు మాత్రం పుల్‌స్టాప్‌ పెట్టిన వైనం!
కోరిక కొంత కాలనాళికలో స్థాపితం కాబడిన కొత్త కారాగారం
అత్తవారిల్లు!
***
ఒక రోజు పెద్ద ఉరుము మీద పడ్డట్టు మా వారి గొంతు
ఎవరో చెప్పితే, విని ముక్కోపంతో
రాక్షసుడిలా ఘర్జన...
'' చదువురాదను కుంటే
కవితలు, కథలు కూడానా....అదీ
పురుషాహంకారాన్ని సవాలు చేసేలానా? ''
అంటూ తన నడుము బెల్టుతో
విశ్వరూపం నా వీపుమీద!
కళ్యాణమైన తదుపరి సుఖపడింది లేదు
పైపెచ్చు ఆంక్షలు! పాబందీలు!
పెళ్ళికాకముందు చిత్తుకాగితాలపై రాసిన భావనలు
మా తమ్ముడు జాగ్రతగా వివిధ పత్రికలు పంపినట్టున్నాడు
నా కర్మకాలి అచ్చవటం - మా యముడి దృష్టికి రావడం!
ఈ రసాభాసకు ఆజ్యం అయింది!
మళ్ళీ నాలుగేళ్ళు మౌనం!
మా యమునిలో మార్పు వస్తుందేమోనని
అదీ ఒక కొడుకుపుట్టిన తరువాతనైనా
అడియాసే మిగిలింది.....
ఆంక్షలు యథాస్థితే కొనసాగింది!
రెండో సంతానం ఆడపిల్ల కలగగానే
నాలో పట్టుదల ఎక్కువైంది!
నాలా నా బిడ్డ నిర్బంధాలకు గురికాకూడదనుకున్నా!
గట్టి నిర్ణయం తీసుకున్నా
యముడ్ని సమధానపరచాలని చూశా! -
ఊహూఁ . ససేమిరా అన్నాడు!
నా అత్త మామలు అదే దారి
తీవ్ర సంఘర్షణానంతరం విడాకుల వరకువెళ్ళింది!
కొంత కాలానిలి మా ఆమ్మ, నాన్న గతించారు,
ఇక నాకు పెద్ద దిక్కుగా ఒకే ఒక వితంతు సోదరి,
తను మాత్రం నా భావాలకు విలువిచ్చి
ప్రోత్సహించింది కాబట్టి
మీ ముందు ఓ రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్టుగా
ఒక తల్లిగా, ఒక ఉద్యమ కార్యకర్తగా ...నిలబడ్డాను.!
అందుకు నా లాగే మచ్చలనుభవించిన మా అక్క
నన్ను ఇంత దానిని చేసింది....ఆమెకు ఎల్లపుడూ
ఋణపడివుంటా నేనెల్లపుడూ.....
నా బిడ్డ, నాకొడుకు ఇద్దరు చదువుకుంటున్నందుకు
ఆనందం, సంతోషం,
నేపుట్టిన 33 సంవత్సరాలనంతరం
నాలో కొత్త సమరోత్సాహం !
వంటి మీద మచ్చలుగా మిగిలినా,
మనసుమీది మచ్చను తొలగించాలని
మచ్చరాలిక రాకుండా నిలువరించాలని!

***.....
ఒకానొక దృశ్యం దీనికి ప్రేరణ .....
1.2.2014 సాయంత్రం 4.10

28, జనవరి 2014, మంగళవారం

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||

కపిల రాంకుమార్|| సర్దార్ పటేల్ మత తత్వవాది - ఎ.జీ.నూరాని ||
'' మెజారిటీ మతానికి చెందిన మత తత్వాన్ని, జాతీయవాదంగా భావించే ప్రమాదం నిరంతరం పొంచి
వుంటుంది ''  - నెహ్రూ - 1961 జనవరి 5న చెప్పిన మాటలు.

'' ఒకేసారి కేంద్రంలో అధికారాన్ని రుచి చూసిన హిందూత్వ శక్తులు యిప్పుడు మరోసారి ఎలాగైనా,
అవసమైతే మోడీ వాచాలతను ఉపయోగించుకునైనా, లేక గుజరాత్ అల్లర్లలో అతని పాత్రను చూపించైనా
లేక ఆర్.ఎస్.ఎస్. హిందూత్వకు ఆయన తిరుగులేని మద్దతును చూపించైనా అధికారంలోకి
రావటానికి ప్రయత్నిసుతున్నారు. వారి ఈ స్కీములో వల్లబ్‌భాయ్‌పటేల్ వ్యక్తిత్వం వారికి సరిగ సరిపోతుంది.''

'' హిందూ జాతీయవాదిగా పేరుపొందిన పటేల్‌కు  అర్.ఎస్.ఎస్. తో రహస్య, వ్యక్తిగత సంబంధాలూ.
ఏర్పాట్లు వుండేవి. భారత్‌, బ్రిటిష్‌ వ్యాపాద ప్రపంచంతో మంచి సంబంధాలుండేవి. ఆయనకు విజ్ఞాపనలు
చేసుకుంటుండేవారు.  సనాతన హిందువుగా ఆయన తన మత తత్వ సానుభూతులను కప్పిపుచ్చుకునేవారు దాదు ''

'' కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించే ' పాన్‌సుఖ్‌లాల్‌ మఫత్‌లాల్‌ ' ఈతకొలను ముంబాయిలోని
మెరేన్‌డ్రైవ్ వద్ద ఇప్పటికీవుంది. దానిని సర్దార్‌ పటేల్‌ ప్రారంభించారు. ''

'' మహాత్మా గాంధీ హత్యకు జరిగిన కుట్రపై '' విచారణ కమిటీ నివేదిక '' సమర్పించిన జస్టిస్‌ జె.ఎల్‌.కపూర్ ..
మహాత్ముని ప్రాణం తీసిన ఈ హత్యపై విచారణ జరగాల్సిన రీతిలో జరుగలేదనీ, అడుగడుగున అధికారుల
నిర్లక్ష్యం కనిపించిందని చెబుతూ '' విచారణకు ఇంచార్జి మంత్రిగావున్న హోమ్‌ మంత్రి వల్లభ్‌భాయ్‌ పటేళ్
కూడ దీనిపై ఆసక్తి చూపించినట్లు కనిపించలేదు '' అని చెప్పారు కపూర్.

'' భారత తొలి గవర్నర్  జనరల్ రాజాజీ లౌకిక వాది కనుక అతనిని రాష్ట్రపతి కాకుండ పటేల్ అడ్డుపడ్డాడని తెలుస్తుంది.''

'' 1848 జనవరి 6న పటేల్‌ ఒకవైపు అబ్దుల్ కలామ్‌ అజాద్‌  దేశభక్తిని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్.
వాళ్ళను కాంగ్రెస్‌లో చేరాలని అహ్వానించారు. పచ్చి మతతత్వ వాదులు మాత్రమే ఆ పనిచేయగలరు

'' నేను భారతీయ ముస్లిమ్‌లను  ఒకేఒక ప్రశ్న వేస్తున్నాను. ఇటీవల జారిగిన అఖిల భారత ముస్లిమ్‌ కాంఫెరెన్స్ లో
మీరు కాశ్మీరుపై ఎందుకు నోరు మెదపలేదు? పాకిస్థాన్‌ చర్యలను ఎందుకు ఖండించలేదు? ఇవన్నీ ప్రజలమనసులో
సందేహాలు లేవనెత్తుతున్నాయి. దేశభక్తిలేనివారు పాకిస్థాన్‌ వెళ్ళిపోవచ్చు '' - పటేల్

'' పటేల్‌ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరులైన  రఫి అహ్మద్‌ కిద్వాయ్ వంటివారిపైనా, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీమీద
గూఢచారి శాఖ యిచిన ' రహస్య నివేదికకాపీ 'ని 1948 ఫిబ్రవరి 6న నెహ్రూకు పటేల్‌ పంపారు. తనను మంత్రి
వర్గం నుండి తొలగించడానికి కాంగ్రెస్‌ సోషలిస్ట్ పార్టీ కుట్ర పన్నినట్లు సృష్టించిన నివేదిక అది ''

' ఉప ప్రధాన మంత్రిగా, హోమ్‌ మంత్రిగా పటేల్ కాశ్మీర్ మహారాజును సమర్థించేవారు. మహారాజుకు వ్యతిరేకంగా
పోరాడే ప్రజానాయకుడైన షేక్ అబ్దుల్లాను, ప్రజా ట్రిబ్యునళ్ళను పటేల్ వ్యతిరేకించేవారు. భారత్ యూనియన్‌లో
కలసిపోడానికి కాశ్మీర్ మహారాజును ఒప్పించేందుకు ప్రయత్నించే వారు. చివరికి 1948 జనవరి 31 న
కాశ్మీర్ రాజు తాను స్వతంత్ర దేశంగా విడిపోతానని బెదిరించినప్పటికీ, ఆయనపట్ల సానుకూలంగానే వ్యవహరించాడు. ''
__________________________________________
22.1.2014 సాయంత్రం 4.10
__________________________________________
పేజి 9 నుండి 15 జనవరి నెల 2014 మార్క్సిస్టు పత్రికలో ఎ.జి.సూరానీ వ్యాసంలో ముఖ్య అంశాలు.


కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

దండలో దారంగా ఉండి, నేర్పరితనం కలిగివుండటమే శిల్ఫం అని కన్నేగంటీ వెంకటయ్య సాహితీ స్రవంతి 6వ అధ్యయనవేదిక ప్రతీనెల మూడవఅదివారంలో భాగంగా ది.19.1.2014 సమావేశానికి తన అధ్యక్షోపన్యాసంలో అన్నారు. తొలుత ఇటీవల మరణించిన  ప్రముఖ కళాకారులు, చలన చిత్ర  ప్రముఖలకు సంతాప తెలుపుతూ ఒక నిముషం మౌనం పాటించారు. బి.వి.కె. విద్యార్థి ఆసు ప్రసాద్ గీతాలాపనతో కార్యక్రమం ఆరంభమయింది. ముఖ్యాంశం  '' కవిత్వం - శిల్పం '' - వాస్తవంగా ఆనందాచారి ప్రసంగించవలసివుంది. కారణాంతరాలవల్ల వారు హాజరు్కాలేకపోయారు. అదే అంశంపై డా.పి. సుబ్బారావు గారిని ప్రసంగించవలసినదిగా కన్నెగంటి వెంకటయ్య కోరారు. మరొక కవి జీవన్‌, కపిల రాంకుమార్ గార్లను కూడ  దానిపై మాట్లాడవలసినదిగా వేదికపైకి పిలిచారు. శిల్పంపై పట్టు సాధించిన వారు అద్భుత కవితా సృష్టికర్తలుగా పేర్కొంబడతారని, ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసములు ఎంతో సహకరిస్తాయని వివరించారు.డా.పి. సుబ్బారావు గారు మాట్లాడుతు కవిత్వ భాష ఒక ప్రత్యేక భాష అని, మన 20 శతాబ్ద కవులు అభిభాషించారని తెలిపారు. కవిత్వం శిల్పం పరస్పరాధారితాలని, పద్యం రాసేటప్పుడు కవి తన భాషనుంచి పక్కకు తొలుగుతాడని, దానికొక ప్రత్యేక శైలిలో నేర్పుగా సృజనచేస్తాడని అన్నారు. ,వ్యాకరణం మొదట సంస్కృతలో మొదట వ్రాయబడి, తదనంతరం తెలుగులోకి వచ్చింది. నన్నయ వ్యాకరణం అందుకుదాహరణ.  బాల వ్యాకరణం
ప్రౌఢ వ్యాకరణం, అప్పకవీయం, ఇలా పరిణామ క్రమం.  కాకువు - నిత్య జీవితంలో ఉపయోగించే భాషలోవాడబడేదని అన్నారు. ధని, రసం ప్రధానంగా కవిత్వం సాగాలని దానికి తోడుగా అలంకారాలు సొగసునిస్తాయని చెబుతూ ధ్వని ప్రధానంగా 1. డినొటేషన్‌ 2. కనొటేషన్‌ 3. సజెషన్‌ లపై అధారపదివుంటుందనిదీనికి అదనంగా ఉక్తి వైచిత్యం , సర్వకాలీనత (విశ్వజనీనత)....ఇప్పటికి చెప్పకోతగిన మంచి ఉదాహరణ యెండ్లూరి సుధాకర్  కొత్త గబ్బిలం .  ఛందస్సు -అంటే  (అంద చందాలకు దగ్గర సంబంధం) అందం అని అర్థం. సమాజం లేక పోతే (ప్రపంచం) కవిత్వం లేదు. ఒక్క అడుగు ముందుకు వేయించేదే కవిత్వం. లోక పరిశీలన లేక కవిత్వం మనజాలదు. కవితలో ఓక మెరుపు, ఒక ఉరుము, ఒక స్వాంతనం, ఒక వేదన, అలోచన మిళితమైవుండాలి. - '' బాలపు బస్తాలను మోస్తున్న ఆ స్త్రీలు - గ్లోబును  ఎత్తుకున్న  అట్లాసు '' అని సుధాకర్ అన్నారు తన కొత్త గబ్బిలంలో సందర్భానికి తగ్గ పద ప్రయోగం, చేసి శ్రోతను/ పఠితను ఆకట్టుకునేదే శిల్పం అది నింపునున్నదే కవిత్వం.ఓ తిక్కన, ఓ వేమన ఓ గురజాడ అంటే నాకిష్టం ఆధునిక కవిత్రయం అని శ్రీశ్రీ అన్నారని చెపారు. కవిత్వం ఒక ఆల్కెమీ అంటాడు ' తిలక్ ' నిజమే కదా! ..ఫిలాసఫీ ఆఫ్ కాంపొజిషన్‌ అనే గ్రంథం తప్పక చదవండి అని సలహా యిచ్చారు. భాస, పదజాలం, ఊహ కలిగివుండాలి.  పప్రబంధ, ఆశు, బంధ, చాటు కవిత్వాలు కవిత్వంలో వచ్చిన పరిణమాలనే తెలుసుకోండి. కావ్య పఠన పునాది కావాలి. అదే అధ్యయనం,అభ్యసనం, సృజనం గా మార్పుచెందాలి.  పురాణ, ఇతిహాస, చారిత్రిక, సాంఘిక, పద్య, వచన కవిత్వం పరిచయం చేసుకుంటేనే కొత్త పోకడలు కవిత్వంలో చూపించగలం. కొన్ని సోదాహరణలుగా పద్యాలు, కవితలు చదివివినిపించారు. సమావేశానికి హాజరయిన వారి కోరికపై ఇదే అంశం వచ్చే మూడవ ఆదివారం కొనసగించాలని తీర్మానించారు.
మరొక ప్రముఖ కవి జీవన్‌ దీర్ఘ ఉపన్యాసం జోలికి వెళ్ళక కొన్ని కవితలను ఉదహరిస్తూ ఆయా కవుల కవిత్వ శిల్ప చాతుర్యాన్నివివరించారు. తెలంగాణా రైతంగ సాయుధపోరాట కాలంలో ఎంతో అభ్యుదయ సాహిత్యం వచ్చింది కుందుర్తి ' తెలంగణా 'సోమసుందర్ ' వజ్రాయుధం ' ఆరుద్ర  ' త్వమేవహం' గంగినేని ఎర్రజెండాలు, అవేకాక వాటినేపథ్యంలో నవలా సాహిత్యంకూడ వచ్చింది. దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి లాటి వారు ప్రసిద్ధులు.వాటిలో కవిత్వం, శిల్పం, శబ్దం, ధ్వని, రసం,చక్కగా అలరించాయి.  దర్మిలా నేటి  తెలంగాణ ఉద్యమకాలంలో కూడ చక్కటి కవిత్వం ప్రపంచంలో ఎప్పుడూ రానంతవిరివిగానూ వచ్చింది. కవిత్వం ఒక హృదయంనుండు మరొక హృదయంలోకి ప్రవేశిస్తేనే - అది కవిత్వమై తీరుతుంది అని చలం అంటూండేవారని చెప్పారు అంటూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్ది కవితలు, విశ్లేషణలు క్లుప్తంగా తనప్రసంగాన్ని ముగించారు జీవన్‌.
గ్రంథాలయ నిర్వాహకుడు, కవి కపిల రాంకుమార్ మాట్లాడుతూ కాలాన్ని హరించ కుండా, కొన్ని ముఖ్యమైన అధ్యయన చేయవలసిన పుస్తకాలుగా  హరగోపాల్ -''రూపం సారం '',  కె.కె.రంగనాథాచార్యులు ''సాహిత్యంలో విభిన్న ధోరణలు ''  సాహిత్య  శిల్ప సమీక్ష లాంటివి బాగా ఉపయోగపడతాయన్నారు. శ్రీశ్రీ కవితలను ఉదహరించినంతగా విమర్శకులు ఉదహరించే కవి అలిశెట్టి ప్రభాకర్, తెలంగాణకు చెందినవాడవటం గర్వించతగిన విషయమని తెలిపారు.హాజరైన కవులలో సునంద, శైలజ, బండారు రమేష్, షేక్ బషీర్ కవితలు చదివారు. రౌతురవి వందన సమర్పణ చేస్తూ మరల ఫిబ్రవరి నెల మూడవ ఆదివారం తిరిగి ఇదే అంశం కొనసాగుతుందని తెలిపారు..


24.1.2014 సాయంత్రం  2.50

26, జనవరి 2014, ఆదివారం

|| బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

కపిల రాంకుమార్ || బివేర్ ఆఫ్ సచ్‌ ఫ్రెండ్స్‌ ||

ఒకప్పటి మా ఫ్రెండ్ 
పాపం! వాడు పిచ్చి వాడో
మద బిచ్చగాడో తెలీదు 
అచ్చం చూడ్డానికలావుంటాడు...
కాని బాగా చదువుకున్నవాడు
విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు కూడానట!
అదేమి పొయేకాలమో
పెడధోరణో....లేక
పెర్వర్టెడ్ ఇంటిల్‌జెన్‌సీయేమో  తెలియదు కాని
రాతలనీండా రోతలే
నోటితో ఉచ్చరించే మాటలన్నీ విషయించాలనే కూతలే
మత్తులోవుంటాడో? మదంతో వుంటాడో?
బోధపడడు.....వేషం ఆచార్య దేవునిది కదా!
ఏమీ అనలేము, ఏమీ అనకుండాను వుండలేము!
ప్రేలాపనలు చూస్తుంటే
ఒక సారి ఫ్రాయిడ్ సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి!
ఒక సారి మరీ పైత్యం తలకెక్కి
కైపులో వుంటాడో
పక్కవాడికి కైపెక్కిస్తాడో కాని
ఒకపట్టానా అర్థం కాడు!
స్నేహితుడ్ని రెచ్చకొడతాడో, హేళన పట్టిస్తాడో
అంతరంగం పరీక్షించాలనుకుంటాదో కాని
'' మా శ్రీమతి అందంగా వుంటుంది!
అంత అందంగాను వంట చేస్తుంది!
మరి మై డియర్ గే నీకేమైనా కోరిక పుడుతోందా
ఓపిక చేస్తావా, నా బదులు షేర్ చేసుకో చూద్దాం! ''
అనే తలతిక్క మాటలకి
స్నేహితుడనేవాడు....నిజంగా స్నేహితుడైతే
స్నేహాన్ని వదులుకుంటాడు కాని
స్నేహితుని పైత్యపు కోరికకు ఊఁ కొట్టడు!
మీరేమంటారు?
26.1.2014 ..... 7.35 pm
_______________________________________
అలాంటివాడొకడు నాకు తారస పడితె లాగి చెంపమీదొకటిచ్చి, వాని భార్యతో చెప్పితే
ఆమె చాల బాధపడి....తన వెర్రి వేషాలు స్నేహితులమధ్యకు తెచ్చాడూ అంటూ
కలత చెంది, గత అనుభవాలను జత చేసి ....న్యాయస్థానం ద్వారా వానినుండి విడాకులు
తీసుకొని సజావుగా తన బతుకు గడుపుతోంది.
___________________________________

17, జనవరి 2014, శుక్రవారం

27, డిసెంబర్ 2013, శుక్రవారం

- ||అంకురం ||

కపిలరాంకుమార్ - ||అంకురం ||

'' ప్రణయాంకురం - మోదం ''
'' ప్రళయాంకురం - ప్రమాదం '' -

27.12.2013

22, నవంబర్ 2013, శుక్రవారం

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

కపిల రాంకుమార్||ఫిర్ మిలేంగే||

ఆప్ కే కద్మోం మేఁ
షుక్రియా ఆదా కరతా హూఁ హుజూర్
మగర్ కభీభి నజర్
బేజార్ మత్‌కరో!
హజార్ బార్ విచార్‌కె బినా బాత్ మత్ కరో!
తంద్రుస్తు దిమాక్‌సే పైదా హోకర్
ఖుల్లా సఫర్‌మే క్యా ఫాయిదా?
అర్జ్‌ క్యా హైకీ బినా వాయిదా
కామ్‌ సఫల్‌ హుయేతో
సబ్ లోక్ హోతా ఫిదా!
యే మొహబత్ కా వజీర్
స్వీకార కరో హమారా షర్త్
చమక్‌తే రహో సితారా జైసే
హోషియార్‌సే జీత్ హాసిల్‌కరో!
అబ్‌ ఆవో మేరేపాస్
ముజేఁ లేజానేకిలియే
తబ్‌ తక్‌  ఇంతజార్ కరూంగా!
ఆదాబ్ ...జనాబ్‌ ...ఫిర్‌ మిలేంగే!

22.11.2013 సాయంత్రం 3.32

21, నవంబర్ 2013, గురువారం

కపిల రాంకుమార్|| మినీలు ||

కపిల రాంకుమార్|| మినీలు ||

మంచిని పేంచేలోగా - నీ
పంచన  చేరినవారే
వంచనతో
ముంచుతారు!          1

పొట్ట కొట్టే వారిపై
దట్టించి ఎదురుతిరగ
జట్టుకట్టేదెపుడో
పట్టుచిక్కేదెపుడో
పొట్టకూటిగాళ్ళ
గట్టి  సవాలప్పుడే!       2

ఎంతమంది చీ కొట్టినా
ఎంతమంది అభిశంసించినా
కుక్కతోక వంకర తీయలేం కాని
కత్తిరంచవచ్చుగా
ఉన్మాదులాగడాలు
ఆగాలంటే!                   3

10.11.2013 ఉదయం 9.45