Wednesday, November 21, 2012

వాక్యం రసాత్మకం కావ్యం

నాగరాజు పప్పు
(కళాతత్త్వ శాస్త్ర విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని వ్యాసాలను నాగరాజు పప్పు గారు రాస్తున్నారు. వాటిని వారి పేరుతోనే ఇక్కడ పునర్మిద్రిస్తున్నాను - దార్ల )


Sunday, February 04, 2007

వాక్యం రసాత్మకం కావ్యం
వాక్యం రసాత్మకం కావ్యం -- మొదటి భాగం(ఈ వ్యాసం - ప్రాచీన కవిత్వం దగ్గర నుంచి, ఆధునిక కవిత్వం వరకూ గల విభిన్నమైన కవితా రీతుల గురించి, వస్తు వర్ణన మొదలుకొని రసావిష్కరణ వరకూ గల రకరకాలైన భావ వ్యక్తీకరణ పద్దతుల గురించి, ఈ మధ్య వస్తున్న అనుభూతి కవిత్వాన్ని గురించి విశ్లేషించడానికి చేసిన ప్రయత్నం. ఇందులో కవితలు రాయదానికి కొన్ని చిట్కాలూ, పద్దతులూ కూడా - నాకర్ధమైనంతలో చెప్పడానికి ప్రయత్నించేను. అలాగే, అనుభూతి కవిత్వాన్ని ఆస్వాదించటం ఎలాగో కూడా చెప్పే ప్రయత్నం.)మా ఇంటిలో రమారమి అందరూ - `రాతా'సురులే. కొందరు పద్య కవిత్వం రాస్తే, కొందరు గేయకవిత్వం, మరికొందరు కధలు, వ్యాసాలు రాస్తారు. అన్ని ప్రక్రియలలో చెయ్యి కాల్చుకొన్న వాడు మా మావయ్య ఒక్కడే. సుమారు పాతికేళ్ళ క్రితం - అప్పటికింకా బాగా చిన్న వాణ్ణి - "మావయ్యా - కవితలు రాయడం సుళువా, కధలు రాయడం సుళువా" అని అడిగా. ఆయనొక క్షణం ఆలోచించి, ఓ సిగరెట్టు, దానితో పాటుగా ఇంకో చిరునవ్వు వెలిగించి - "రాయడం వరకే అయితే - కవితలే సుళువు" అని చమత్కరించేడు. ఆ చమత్కారంలో ఉన్న మడత పేచీ నాకీ బ్లాగు మొదలుపెట్టే దాకా తెలిసి రాలేదు.కవితల జోలికెళ్ళే ఉద్దేశ్యం మొదట్లో నాకే కొసనా లేదు. మేధావి వర్గం వాళ్ళం కదా - మాకు మెదడు పెద్దదీ గుండె చిన్నదీను. అందుచేత, ప్రేరణ ఎక్కువ స్పందన తక్కువ. ఈ అనుభవించి పలవరించడం లాంటి గొడవలు మనకెందుకులే - ఊకదంపుడు ఉపన్యాసాలు మనకి వెన్నతో పెట్టిన విద్యే కదా - హాయిగా ఏవో వ్యాసాలు, కథలు రాసుకొందాం అనుకొన్నాను. మొదలెట్టిన తర్వాత తెలిసింది - పెద్దపెద్ద వ్వాసాలు 'రాయటం' ఎంత కష్టమో. ముందు ఆలోచించాలి - ఇది అన్నిటికీ ఉన్నదే, ఆలోచించిన దాన్ని ముందు 'draft version' రాయాలి, ఆ తర్వాత దానికి మెరుగులు దిద్దాలి. ఆ పైన `అప్పుతచ్చులు' సరిదిద్డాలి. తెలుగు రాసి చాలా కాల మైందేమో - అచ్చుతప్పులు చాలానే దొర్లుతాయి - సత్యాలు శివాలై పోతూంటాయి. ఒక అక్షరం కింద ఉండాల్సిన ఒత్తులు, పక్క అక్షరం మేదికి ప్రేమతో ఒరిగిపోయి, జరిగిపోతూంటాయి. మరికొన్నైతే లేచిపోతాయి కూడ. ఈ బాధలన్నీ పడిన తర్వాత, కంప్యూటర్ లోకి ఎక్కించడం ఇంకో తలకాయ నోప్పి. ఎడం చేతి చిటికెన వేలితో నిమిషానికి పదిసార్లు 'shift' key నొక్కాలంటే - చేతులు నొప్పి. మొత్తం మీద రెండు వ్యాసాలు పూర్తి చెయ్యడానికి ఆరు మాసాలు పట్టింది. అందుకని ఈ 'రాయటం' బాధలు పడలేక కవిత్వం 'చెప్పేద్దాం' అనుకొన్నాను - కవితలైతే ఒక ఐదారు లైన్లలో కొట్టేయ్యచ్చు కదా!కాని, కవిత్వం మనకి చెప్పడం రాదే - మొదట్లో రాసిన కవితలు - నర్సు ఆపరేషన్ చేసినట్టుండేవి - వాటిని చదివితే నాకే చిరాకేసేది. ఇప్పటికీ అలానే ఉంటాయ్ అని మీరనుకోవచ్చనుకోండి - మీ అభిప్రాయం మార్చడానికే మరి ఈ ప్రయత్నం.కవితలు రాయాలంటే - ముఖ్యంగా - వస్తువు, శైలి, శిల్పం కావాలి. వస్తువంటే - స్నేహం గురించి రాయొచ్చు. ప్రేమ గురించి రాయచ్చు, ప్రేయసి గురించి, ప్రకృతి గురించి రాయొచ్చు - కాకపోతే, పేదల బాధల గురించి కూడా రాయొచ్చు. ఇలాంటి వస్తువులన్నీ ఇప్పటికే మహామహులెందరో తుక్కు తుక్కుగా దున్నేసారు. కొత్తగా చెప్పడానికి ఏం కనిపించ లేదు. అదీగాక, మన తెలుగు కవులకి (ముఖ్యంగా ఆధునిక కవులకి)రెండు రకాల కామెర్లు - ఒకటి పచ్చకామెర్లు (ప్రకృతినీ, ఆకులనీ, కోయిలని చూసి మహా ఇదై పోతూంటారు - భావకవులన్న మాట), ఇంక రెండో తరహా వాళ్ళకి ఎర్రకామెర్లు - వీళ్ళు సామాజిక స్పృహంటూ బిచ్చగత్తెల మీదా, ఉంపుడుకత్తెలమీదా, కూలీల మీదా, కర్షకుల మీదా ఏదేదో రాసేసి, పాఠకుల మీద కవితల కేకలేస్తుంటారు. ఇంకపోతే, కాలేజి అమ్మాయిల కవితల తరహా వేరు - ప్రేమలు, దోమలు, వలపులు, విరహాలు, ఏడ్పులు, వీడ్కోళ్ళు - మొదలైన వాటి గురించి తెగ ఫీలైపోతుంటారు.ఈ తరహా కవిత్వం అంటే నాకు చచ్చేంత రోత. ఎంత ఆలోచించినా ఏం రాయాలో, ఎలా రాయాలో తెలీలేదు. అందుకని, రాయటం కట్టి పెట్టి, ఓ సంవత్సరం పాటు - అన్ని రకాల కవిత్వాలని చదవటం, విశ్లేషించటం మొదలెట్టేను. మంచి కవితలు రాయాలంటే ముందు మంచి కవితలు చదవాలి కదా?కవిత్వాన్ని మూడు కోణాల్లోంచి మనం విశ్లేషించ వచ్చు - వీటిని Structural, Metaphorical, Stylistic అందాం. Structural గా చూస్తే, తెలుగు కవిత్వం - పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వం అని స్తూలంగా మూడు రకాలుగా విభజించ వచ్చు. పద్య కవిత్వం అందరికీ తెలిసిందే - చెప్పదల్చుకొన్న విషయాన్నో, వస్తువునో - చంధస్సులో నిబద్దం చేస్తే అది పద్య కవిత్వం. ఇపుడు పద్య కవిత్వం చెప్పే వాళ్ళున్నారు కాని చాల తక్కువ. గేయ కవిత్వం అంటే పాడు కోవడనికి అనువుగా ఉండేది - సినిమా పాటలు, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలు చాలవరకు గేయ కవిత్వం అనచ్చు. ఇకపోతే వచన కవిత్వం - చాలవరకు కుర్రకారు కవిత్వం అంతా వచన కవిత్వమే. ఆత్రేయ, తిలక్ వీరిద్దరివీ వచన కవిత్వంలో అందెవేసిన చేతులు, ఈ ఇద్దరికి తప్పిస్తే వచన కవిత్వం చెప్పడం మరెవ్వరికీ సాధ్యం కాలేదేమో అనిపిస్తుంది. Structural గా చూస్తే, వచన కవిత్వం గేయ కవిత్వం కన్నా, గేయ కవిత్వం పద్య కవిత్వం కన్నా తేలికగా అనిపించొచ్చు. కాని, కవితకు భావం ప్రాణం అయితే, లయ ఊపిరి. లయంటే - కవిత చదువుతున్నపుడు దానికో ఊపు, తూపు ఉండాలి. ఈ లయని సాధించటంలోనే ఉంది కవి తాలూకు ప్రజ్ఞ్న అంతా. లయని తీసుకురావటం వచన కవిత్వంలో చాలా కష్టం. గేయ కవిత్వంలో కొంత కష్టం. పద్య కవిత్వం లో నైతే - లయ చంధస్సులో అంతర్లీనంగా ఉండనే ఉంటుంది - అందుకని పద్య కవిత్వంలో లయ గురించి ప్రత్యేకంగా కృషి చెయ్యక్కరలేదు.గేయ కవిత్వంలోనైతే - లయ సాధించటానికి కవి ఒక తాళాన్ని ఎంచుకోవచ్చు. ఆ తాళానికి - ఆది తాళమో, రూపక తాళమో - దానికి తగ్గట్టుగా పదాలని ఎంచు కొంటే - కొంత వరకూ లయని సాధించినట్టే. శ్రీశ్రీ లయని సాధించటంలో సిద్ధహస్తుడు. భావానికి తగ్గ ఉద్రేకాన్ని, శక్తిని తను ఎన్నుకొనే చంధస్సులో, పదాల అమరికలో సాధిస్తాడు. ఉదాహరణకి, మహా ప్రస్థానం మొదటి కవితలో ......పదండి ముందుకుపదండి తోసుకుపోదాం పోదాం పైపైకి ...ఇది చదువుతున్నప్పుడు - అందులో ఊపిరాడని ఉద్రేకం, విప్లవం ఉన్నాయి. అవి మనన్ని ఊపేస్తాయి. ఇదే కవితని, పదాలు అమరిక మార్చిరాస్తే.....ముందుకు పదండితోసుకు పదండిపైపైకి పోదాం పదండి..అన్నాం అనుకోండి - ఎలా ఉంది? బస్సు కండక్టరు ప్రయాణీకులని అదిలిస్తున్నట్టు లేదూ?కొత్త కవులూ, కుర్ర కవులూ - లయని సాధించటంలో సాధారణంగా పప్పులో కాలేస్తుంటారు. అంత్యప్రాస ఒక్కటే వీళ్ళకున్న పాసుపతాస్త్రం మరి - నారాయణ రెడ్డీ అనగానే బంగారు కడ్డీ అంటారన్న మాట.లయ మీద పట్టు సాధించటం వచన కవిత్వంలోనూ గేయ కవిత్వంలోనూ కష్టం అని ఎందుకన్నానంటే - పద్యానికైతే ముందే నిర్ణయించిన చంధస్సు, నియమాలు ఉన్నాయి. మనం చంధస్సుని సృష్టించుకోనక్కరలేదు. ఉన్నదాన్ని అర్ధం చేసుకొని ఉపయోగించుకోగలిగితే చాలు. ఉదాహరణకి, ఓ దండకం చెప్పాలనుకోడి - ఒక సగణం మీద వరసగా తగణాలు వేసుకొంటూ పోతేసరి. ఉదాహరణకి - పొగాకు మీద దండకం చెప్పాలనుకోండి - "కోటలో బైరుగావించి, ఒప్పుగా నిప్పు దెప్పించి మిక్కిలిన్ ప్రేమతో ధూపముల్ త్రాగువారెంత పుణ్యాత్ములో యెంత ధర్మాత్ములో" ఇలా చెప్పుకొంటూ పోవచ్చు.కాని, అదే గేయకవిత్వంలో, కవి తనకి కావల్సిన చంధస్సు, సాధించాల్సిన లయని తనే తయారు చేసుకోవాలి. ఇది కష్ట సాధ్యమైన పనే. కేవలం అంత్యప్రాసలతోనో, శబ్ధాలంకారాలతోనే అయ్యేపని కాదు. కొన్ని `చిట్కాలు' మాత్రం ఉన్నాయి. తెలుగులో, `క చ ట త ప' ల కీ, `గ స డ ద వ'ల కీ మధ్య చక్కటి సంభంధం ఉంది. మొదటి పాదంలో ఉన్న పద్యాల్లో `క చ ట త ప' లుంటే, రెండో పాదంలో అదేచోట `గ స డ ద వ' లొచ్చేటట్టు చూస్తే - కవితకి అంత్యప్రాసలతో దొరకని అందం వస్తుంది. చదువితున్న వాడికి `ట్రిక్కు' వెంటనే అందదు కాబట్టి ఇంకా రంజుగా ఉంటుంది. ఉదాహరణకి కరుణ శ్రీ పుష్ప విలాపం చూడండి. శ్రీశ్రీ, కృష్ణ శాస్త్రి, వేటూరి అందరూ చాల అందంగా ఈ ప్రయోగం చేస్తారు. ఇంక రెండో ట్రిక్కు, గేయ కవితల్లో, ప్రతి పాదం లోనూ పదాలు చాలా తక్కువగా ఉంటాయి - సాధారణంగా మూడుకి మించి ఉండవు. శ్రేశ్రే అయితే, చాలా వరకూ ఒక పాదంలో ఒక్క పదాన్నే వాడతాడు. వచన కవితని, గేయ కవితగా మార్చదలచు కొంటే, ప్రతి వాక్యంలో ఉన్న పదాలని తగ్గించి చూడండి - చాలావరకూ లయని సాధించవచ్చు. ఉదాహరణకి, ఈ మధ్య నే రాసిన `అనుభూతి కనువాదం' కవిత, మొదటి సారి రాసినపుడు ........నా కిటికీలోంచి తొంగి చూసేచిట్టి చిట్టి చిన్నారి ఉడతలునా మదిలో తొణికస లాడేచిన్ని చిన్ని ఊహల తలపులునా నుదుటనీ వద్దినచిరు ముద్దులు ....ప్రతి పాదాన్ని కొంచెం కుదిస్తే .....కొమ్మల్లోనారెమ్మలమీదఊయలలూగేఉడతల్లారానిలకడలేనినామదిలోనాతొణికిసలాడేఊహలుకారామొదటి దాని కన్నా రెండో దాంట్లో ఊపుంది కదా?అందంగా వచన కవిత్వం చెప్పడం అన్నిటి కన్నా కష్టం. ఒక రకంగా తిలక్ వచన కవిత్వాన్ని ప్రవేశపెట్టి తెలుగుసాహిత్యానికి తీరని ద్రోహం చేసేడేమో అనిపిస్తుంది అపుడపుడు. వచన కవిత్వాన్ని అందంగా రాయడం ఆయనొక్కడికే తెలుసు. కాని, ఆయన ప్రవేశ పెట్టిన ఒరవడిని అనుకరించి పప్పులో కాలేసిన వాళ్ళే ఎక్కువ.ఇక అసలు విషయానికొద్దాం. కవతకి భావం ప్రాణం అని ముందే చెప్పుకొన్నాం కదా. All poetry is metaphorical and allegorical. కవి గులబిమొక్కలాంటివాడు. ఎలాగైతే ఓ గుప్పెడు మట్టిని, గ్లాసుడు నీళ్ళనీ అందమైన గులబీపువ్వుగా రూపొందించడానికి మొక్క ఎంత మధన పడుతుందో అలాగే కవి కూడా బాహ్యప్రపంచంనుంచీ అందిన ప్రేరణని, అది తనలో రేపిన స్పందనని కవితగా మలచడానికి అంతే తపన పడతాడు. ఈ తపనని రసనిర్దేసం అని అందాం ప్రస్తుతానికి. రసావిష్కరణ చెయ్యడానికి కవికున్న ముఖ్యమైన సాధనం - మెటాఫర్.గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.ఈ పద్దతుల గురించి విపులంగా - తరువాత చెప్తాను.
 
 

వాక్యం రసాత్మకం కావ్యం -- రెండో భాగం
కవిత్వంలో మెటాఫర్ ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం.గత 1500 సంవత్సారాల తెలుగు కవిత్వ చరిత్రలో, పోయటిక్ మెటాఫర్ లో చాలా మార్పులూ, చేర్పులూ వచ్చేయి. ఈ కోణంలోంచి, తెలుగు కవిత్వాన్ని- వస్తు విషయ వర్ణన, భావ వ్యక్తీకరణ, అనుభూతి చిత్రీకరణ అని స్తూలంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.ఈ వ్యాసం మొదటి భాగంలో Structural Aspects ని వివరిస్తూ, తెలుగు కవిత్వాన్ని మూడురకాలుగా విభంజించేంకదా - పద్య కవిత్వం, గేయకవిత్వం, వచన కవిత్వం అని. Metaphoric Aspects లో ఈ మూడింటినీ పద సౌలభ్యం కోసం - ప్రబంధ కవిత్వం, భావ కవిత్వం, అనుభూతివాద కవిత్వం అని అందాం.నిజానికి సాంకేతికంగా, ఈ వర్గీకరణని పండితులు ఒప్పుకోరు. ప్రాచీన కవిత్వాన్నంతా ప్రబంధ కవిత్వం అనడం నిజానికి కుదరదు, అలాగే, గురజాడ నుంచి, మొన్నటి తిలక్ దాకా వచ్చిన కవిత్వాన్నంతా భావ కవిత్వం అనడం కూడా సమంజసం కాదు. నిన్నటి నగ్నముని నుంచి ఇవాల్టి సీతారామ శాస్త్రి వరకు ఉన్న కవులందరినీ అనుభూతి వాదులనడం కూడా తప్పే. అయితే ఈ పదాలని నేను సౌలభ్యం కోసం వాడుతున్నాను. తెలుగు కవిత్వ చరిత్రని మెటాఫర్ కోణం లోంచి, విశ్లేషించడానికి, ఈ వర్గీకరణ సరిపోతుంది.ఇంతకు ముందు చెప్పుకొన్నట్టుగా, కవి గులాబిమొక్కలాంటివాడు. ఎలాగైతే ఓ గుప్పెడు మట్టిని, గ్లాసుడు నీళ్ళనీ అందమైన గులాబీపువ్వుగా రూపొందించడానికి మొక్క ఎంత మధన పడుతుందో అలాగే కవి కూడా బాహ్యప్రపంచంనుంచీ అందిన ప్రేరణని, అది తనలో రేపిన స్పందనని కవితగా మలచడానికి అంతే తపన పడతాడు. అందుకే All poetry is metaphorical and allegorical. ప్రేరణ బాహ్య ప్రపంచానికి సంబందించినదైతే స్పందన అంతర్లీనమైన భావ ప్రపంచానికి సంబందించినది.ఉదాహరణకి, విశాఖపట్నం రామకృష్ణా బీచ్ దగ్గర (ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్ దగ్గర) ఓ అందమైన అమ్మాయి కనిపించిందనుకోండి. ఇది అబ్బాయిలందరికీ చాల చక్కటి ప్రేరణ. చాలమందికి స్పందించే హృదయాలు కూడా ఉండొచ్చు. కాని, ఆ స్పందనని ఎలా వర్ణిస్తారు? ఓ చురుకైన గడుగ్గాయి "అబ్బా - అచ్చు కేలండర్ లో లక్ష్మీ దేవి బొమ్మలా ఉంది కదరా" అంటాడేమొ. ఆ మాట, ఆ వయ్యారి చెవిన పడి, ఆవిడ చెయ్యి పైకెత్తుతే - కాసులు రాలకపోయినా, మన గడుగ్గాయ్ పళ్ళు మాత్రం రాలతాయి. రసికరాజుల సంగతటుంచి, ఆ సమయానికి అక్కడ ఓ ముగ్గురు కవిరాజులు - ముక్కు తిమ్మన, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ ఉన్నారనుకోండి - అదే - ఉన్నారని ఊహించుకోండి.సాయంకాలం, సాగరతీరం, ఆపైన సౌందర్య దర్శనం - ఇంకాగుతారా?ముక్కు తిమ్మనగారు వెంటనే, బిలహరి రాగంలో గొంతెత్తి:"నానాసూనవితానవాసనల నానందించు సారంగమేలాననొల్లదటంచు గంధఫలి పల్కాకన్ దపంబొంది యోషా నాసాకృతి దాల్చి సర్వసుమస్సౌరభ్య సంవాసియైపూనెం బ్రేంఖణమాలికా మధుకరీపుంజబు నిర్వంకలన్"అంటూ పరవశించిపోతారు. (నిజానికీ పద్యం, ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముక్కుని వర్ణిస్తూ రాసిన పద్యం కాదు. రామరాజభూషణుని వసుచరిత్రలోనిది. కాని, సాహితీలోకం ఎందుచేతనో ఈ పద్యాన్ని ముక్కు తిమ్మనగారికే అంటగట్టింది)దీనర్దం ఏమిటంటే - పూలన్నిటినీ వాసన చుసే తుమ్మెద తన దరికి రాదెందుకని సంపెంగె పువ్వు కినుకబూని, ఘోరమైన తపస్సుచేసి, చక్కదనాల చిన్నదాని ముక్కుగా అవతారమెత్తి, తానే పూలన్నిటినీ వాసన చుస్తూ, చూపులతూపులనే తుమ్మెదగుంపులని తనకిరుపక్కలా ఎల్లప్పుడూ ఉంచుకొందట.మహానుభావుడు నాలుగు పాదాల్లో ఎంత మందు దట్టించేడో గమనించేరా? ఇదీ మెటాఫరంటే. తెలుగు సాహిత్యంలో ఎన్నదగిన పద్యాలలో ఇదొకటి. అందుకు కారణాలు లేకపోలేదు. మొదటి కారణం - అందమైన ముక్కుని సంపెంగె పువ్వుతో పోల్చడం అదే మొదటిసారి. అంతవరకూ, ఆంధ్రదేశంలోని ఆడవాళ్ళ ముక్కులన్నీ అచ్చుగుద్దినట్టు ఒక్కలాగే ఉండేవి పాపం - కోటేరుల్లాగ. ఒకటిరెండు వేరే రకాలున్నా, ఆ నాసికలు వాసికెక్కలేదు.ఇక రెండో కారణం - మహాకవెప్పుడూ, తను చెప్పేదానికంటే, చెప్పకుండా మనకి స్పురింపచేసేదే ఎక్కువుంటుంది. దీన్నే, 'ధ్వని' అంటారు. ధ్వని మెటాఫర్ కి పరాకాష్ట. కినుకబూనిన సంపంగెకదా - మరుజన్మలో కూడా ఆకోపం రవ్వంత ఉంటుంది - పూర్వజన్మ వాసనలనుకోండి - సంపంగెకి వాసనెక్కువ కదా? అందుకే చక్కని చుక్కకి కోపం ముక్కుమీదుంటుందంటారు.తనని తప్ప మిగతా పువ్వులన్నింటినీ వాసన చూస్తుందని కదా ఈ సంపంగె కినుక? ఇందులో స్త్రీ సహజమైన ఈర్ష్య ధ్వనించటంలేదూ? అందుకనే, ఆ పూలన్నిటినీ తురిమేసి, తన జడలోకి తరిమేస్తుంది (అంటే తన ముఖానికి వెనకవైపుకి). తనుమాత్రం ఆ అందమైన ముఖానికి కొట్టచ్చేటట్టు - కొలువుదీరి కూర్చుంటుంది దర్జాగా.ఇకపోతే, వొయ్యారి చూపులని తుమ్మెదలతో పోల్చడంలోనే అసలు చమత్కారం అంతా ఉంది. అంతకు ముందు దాకా, చూపులని మన్మధబాణాలనే వారు. కాని, చూపులని తుమ్మెదలనడంలో ఒక చక్కటి 'చిత్రం' (ఫొటోగ్రాఫ్) ఉంది. ఇలా అనడం ద్వారా కవి మనకి ఆవిడ కళ్ళు ఎలా ఉంటాయో, చుపులెలా ఉంటాయో, ఆ చూపుల ప్రభావం ఎటువంటిదో - అన్నీ ఒక్క ఉపమానం ద్వారానే కళ్ళకి కట్టినట్టు తెలియజేసేడు. ఈ చంచలాక్షి కళ్ళు చాలా నల్లగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, ఎప్పుడూ అటూ ఇటూ చూస్తూంటాయి. ఆ చూపు తగిలినవాడికి కలిగే గిలిగింత తుమ్మెద కాటులా ఉంటుది - ఒళ్ళు జలదరిస్తుందన్నమాట. తుమ్మెదకాటులో ఒకరకమైన విషం ఉంటుదికదా - దాని ప్రభావం వల్ల మైకం కమ్మి, మత్తెక్కుతుంది కూడాను.ఇన్ని రకాల మెటాఫర్లున్నాయి ఈ పద్యంలో. ఇలాంటి పద్యాలు ప్రబంధ సాహిత్యంలో కోకొల్లలు. ఐతే, అవన్నీ ప్రదానంగా వస్తు వర్ణనలే - అంటే, అమ్మాయి అందాన్ని వర్ణించడం ఈ పద్యంలో కవితా వస్తువు. ప్రబంధ సాహిత్యంలో మెటాఫరంతా సుమరుగా వర్ణనకి సంబందించినదే. భావ కవిత్వంలో, బాహ్యమైన వస్తువుని కాకుండా, మానసిక ప్రపంచాన్ని - కంటిక్కనిపించని భావాలని వ్యక్తపరచడం ముఖ్యమైన కవితావస్తువు.అయితే, భావకవిత్వం ఏదో ఒక్క సారిగా పుట్టుకు రాలేదు. ఈ మార్పు చాపకింద నీరులా చాలా నెమ్మదిగా వచ్చింది. నన్నయ్యతో ప్రారంభమైన తెలుగు కవిత్వం, శ్రీనాధుడి కాలానికి ప్రబంధ కవిత్వం రూపులని సంతరించుకొంటే, పోతన కవిత్వంలో భావకవిత్వానికి అంకురార్పణ జరిగింది. ఈ పరిణామాన్ని కొంచెం క్లుప్తంగా ఇక్కడ చెప్పుకొని, ఆ తర్వాత భావకవిత్వంలోకి దూకుదాం.ప్రాచీన కవిత్వంలో మొత్తం కథంతా పద్య రూపకంగానే చెప్పేవారు. అందుచేత వర్ణనలెక్కువ. అంతమాత్రంచేత కేవలం వర్ణనలే ఉన్నాయనుకొంటే పొరపాటే. ఒక కథలో పాత్రలని, వాళ్ళ వ్యక్తిత్వాలని పరిచయం చేయాలంటే - కంటికి కనిపించని మనస్తత్వాన్ని మనకు చూపించ గలిగే భావ వ్యక్తీకరణ కావాలి కదా?ఉదాహరణకి, తిక్కన మహాభారతంలో ఏ వ్యక్తినీ కేవలం భౌతికమైన వర్ణన చెయ్యడు. ఆ వ్యక్తి కదులుతున్నప్పుడో, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడో, పూలుకోసుకొంటున్నప్పుడో - ఇలా కదలికతోనే ఆయన మనుషులని మనకి పరిచయం చేస్తాడు. అందుకే, తిక్కన భారతం శ్రవ్య కావ్యం ఐనప్పటికీ, దృశ్యకావ్యంగా కూడా ప్రసిద్దికెక్కింది. ఉదాహరణకి, ధర్మరాజు - రాజశూయం చేసిన చక్రవర్తి. సామ్రాట్టులకి సామ్రాట్టు, అయినా కూడా వినయ గుణ సంపన్నుడు. మాములు కవైతే, రాజాది రాజ, రాజపరమెశ్వర అంటూ పొగడ దండల దండకం చెప్పేవాడేమో - తిక్కన మహాకవులకి మహాకవి. అందుకే ఆయన "ఎవ్వనివాకిట నిభమదపంకంబు రాజభూషణరజో రాజి నడగు" అంటూ మొదటి పాదంలోనే కొండలని పిండిగొట్టెస్తాడు. ఆ తర్వాత, పాదం మీద పాదం పెంచుకొంటూపోయి, చివరకి:నతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవిఘటిత గర్వాంధకార వైరివీరకోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితులుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడుఅంటూ ధర్మరాజు గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన యశోవైభవాన్ని మన కళ్ళకి కట్టినట్టు చెప్తాడు.ఇక్కడ నన్నయ్య భారతానికి, తిక్కన భారతానికి మద్యగల మెటాఫర్ లోని తేడాని కుడా ఒకసారి చెప్పాలి. నన్నయ్య భారతంలోని వ్యక్తులందరూ ఉదాత్తంగా మనకి కనిపిస్తారు - వాళ్ళు మనకందనంత ఎత్తులోనే ఎప్పుడూ ఉంటారు. నన్నయ్య భీముడు ఎవరిమీదనైనా కోపంవస్తే - మూఢమతీ అనో, మూర్ఖుడా అనో గంభీరంగానే తిడతాడు - తిక్కన భీముడైతే - పోవోయ్ తువ్వాయ్ అనగలడు. ఇంకా 'తిక్క'రేగితే - లకారాలు కూడా అందుకోగలడు. తిక్కన భారతంలోని పాత్రలు మనలాగే భూమిమీదుంటారు, మాములు మనుషులు, వాళ్ళ కోపతాపాలు కూడా మనకి బాగా అందుబాట్లొ ఉంటాయి. ఈ తేడా ఇక్కడ ఎందుకు చెప్పేనంటే - ఈ తేడా కేవలం వర్ణనలో ఉన్న వైవిద్యంకాదు, వీరిద్దరి పొయిటిక్ మెటాఫర్ లోఉన్న తేడా.ఇక, పోతన భావకవులకి చాల దగ్గరగావచ్చే ప్రాచీన కవి. గజేంద్రుడిని రక్షించడానికి మహావిష్ణువు వైకుంఠంలోంచి ఎలాఉన్నవాడు అలాగే బయలు దేరిపోయేడట. సిరికిన్ చెప్పడు అన్న పద్యం అందరికీ తెలిసిందే కదా? భక్తులని రక్షించడానికి భగవంతుడు ఎంత తొందరపడతాడో చెప్పడానికి పోతన కనిపెట్టిన మెటాఫరది.అలాగే, వామనచరిత్రలో - వామనుడు - ఇంతింతై వటుడింతై అన్నట్టు ఆకాశానికి, అక్కడనుంచి అంతరిక్షానికి ఎదిగి పోతున్నాడు. అలా ఎదిగి పోతున్న త్రివిక్రముడి ఎత్తు మనకి చెప్పడానికి - కాదు - మన కళ్ళకి కట్టినట్టు చూపడానికి - పోతన ఒక కొత్త మెటాఫర్ కనిపెట్టేడు. అది సూర్యబింబాన్ని కొలతబద్దగా స్వీకరించటం:రవిబింబం బుపమింప బాత్రమగు చత్రంబై శిరోరత్నమైశ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమైఛవిమత్కంకణమై కటిస్తలి నుదంచద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడు దాబహ్మండమున్ నిండుచోన్ఆదిలో, పెరుగుతున్న వామనమూర్తికి సుర్యబింబం గొడుగుగా కనిపించింది, ఆ తర్వాత శిరోమణిగా అయింది, తర్వాత క్రమక్రమంగా, చెవికమ్మగా, కంఠాభరణంగా, భుజకీర్తిగా, కరకంకణంగా, మొలగంటగా, కాలికడియంగా, చివరకు పాదపీఠంగా మారిపోయింది. మొదట ఛత్రంగా ఉన్న సుర్యుడు ఆఖరికి పాదపీఠంగా అయినాడంటే, స్వామి ఎంత ఎత్తు పెరిగిపోయేడో మనలనే ఊహించుకోమన్నాడు మహాకవి. ఇందులో రవిబింబానికుపయోగించిన ఉపమానాలన్ని - గుండ్రంగా ఉండడం మరో ఎత్తు.సాగరమదనం కథలో, దేవగణాలన్నీ ప్రార్ధించటంతో శివుడు హాలాహలాన్ని తాగడానికొప్పుకొన్నాడు. ఉబ్బు శంకరుడు కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు, కాని ఆయన భార్య పార్వతి అందుకుఎలా సమ్మతించిందో? సాధారణంగా, మొగవాడు గొప్పలకిపోయి దారి తప్పుతూంటే - ఆడది అతనికి బుద్ధి చెప్పి దారికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది కదా? మరి పార్వతి తన మొగుడు విషం తాగుతానంటే అందుకు ఎలా ఒప్పుకొంది?మ్రింగెడువాడు విభుండనిమ్రింగెడునది గరళమనియు మేలన్ ప్రజకున్మ్రింగుమనె "సర్వమంగళ"మంగళసూత్రంబు నెంత మదినమ్మినదోప్రజలకు మేలుకాబట్టి, తన మంగళసూత్రాన్ని నమ్ముకొని, మింగమందిట. అందుకనే ఆవిడ సర్వమంగళైందని పొతన కితాబు. ఇక్కడ సర్వమంగళ అన్న ఒక్క పదంలో తన భావకవితా ప్రతిభనంతా ప్రదర్శించేడు పోతన. పార్వతికి ఆపేరు అంతకు ముందునుంచే ఉన్నా - దానికి సార్ధకత పోతన పద్యం ద్వారానే వచ్చిందేమో. శివుడు గరళం మింగడానికి ముందే, ఆవిడ ఎంతో బాధని, ప్రజల మేలుకోరి, మింగిందని ఆవిడమీదే పోతనకెక్కువ అభిమానం. అందరి మేలు కోరేది కాబట్టి ఆయమ్మ సర్వమంగళైతే, అందరికీ శుభం చేసేవాడు కాబట్టి ఆయన శంకరుడైనాడు.ఈరకంగా భావకవిత్వం ఛాయలు ప్రాచీన కవిత్వంలోను, ప్రబంధ కవిత్వంలోనూ ఉన్నాయి - కృష్ణశాస్త్రి కాలానికి అవి బాగా ఊపందుకొన్నాయి. ఇక్కడతో ప్రబంధ కవిత్వానికి స్వస్తి చెప్పి, భావ కవిత్వానికొద్దాం.విశాఖపట్టణం బీచ్ లో ముగ్గురు మరాఠీలని ప్రవేశ పెట్టేం కదా. అందులో, తిమ్మన గార్ని తుమ్మెద కాటేసింది. ఆ గొడవేదో ఆయనకే వదిలేసి, కృష్ణశాస్త్రి సంగతికొద్దాం. కృష్ణశాస్త్రికి అమ్మాయి అందంతో పనిలేదు. చిన్నారి చూపుల తూపుల దెబ్బకి తనలొ కలిగిన స్పందనే ఆయన కవితా వస్తువు:"తీయ తేనియ బరువుమోయలేదీ బ్రతుకు"అంటూ పాపం అక్కడే కూలబడిపోతాడు. ప్రబంధ కవిత్వం నుంచి భావకవిత్వానికొచ్చేసరికి మెటాఫర్ ఎంత మారిపోయిందో చూసేరా? బాహ్యమైన వస్తువుని చెప్పడానికి వర్ణన సరిపోతుంది, కాని మదిలో మెదిలిన మధురమైన ఊహని చెప్పడానికి 'abstraction' కావాలి. స్పందనకి స్పష్టమైన రూపుండదు కదా?ఇటువంటి భావకవిత్వానికి ప్రాణంపోసింది పెర్షియన్ మాహాకవులు - హఫీజ్, జామి, రూమి, అత్తర్, హకిమ్ సినాయ్, ఒమార్ ఖయ్యామ్ మొదలైన రసరాజులు. ఆ తర్వాత, ఉర్దూలో - గాలిబ్,ఫిరదౌసి లాంటి కవిరాజులు. దీన్ని తెలుగులోకి తెచ్చిన వాళ్ళు - రాయప్రోలు, అబ్బూరి మొదైలైన వాళ్ళు. తెలుగులో భావకవిత్వానికి ప్రాణంపోసి, దాన్ని సజీవ ధారగా చేసిన భాగిరథుడు కృష్ణశాస్త్రి.విరుద్దమైన, వ్యతిరేకమైన పదాల కలియకతో అద్భుతమైన ఒక కొత్త మెటాఫర్ని తయారు చేయడంలో కృష్ణశాస్త్రి - సిద్దహస్తుడు. రాగిని బంగారంగా మార్చే పసరువేదుంది ఆయన దగ్గర. విరుద్దమైన పదాలకలియకతో కృష్ణశాస్త్రి సృష్టించే ఇంద్రజాలం చూడండి:"మురళి పాటకు రగిలిమరుగునీ వెన్నెలలుసొగయి నా ఎదకేలతగనీ సౌఖ్యజ్వాల?"తీయ తేనియ బరువు, రగిలిపోయి, మరిగిపోయే వెన్నెలలూ, సౌఖ్యజ్వాలలూ - ఇవన్నీ, కొత్త మెటాఫర్లు - అంతకు పూర్వం ఏకవి తెలుగులో అలాంటి expressions వాడలేదు. ఒక కొత్త మెటాఫర్ సృష్టించడంలోనే కవి గొప్పదనం అంతా ఉంది. ఇలాంటి మెటాఫర్లు మనకి కవి మనసులోని స్పందనని మనకు అందచేస్తాయి. మరిగిపోయే వెన్నెలలని మనం ఒక దృశ్యంలాగ ఊహించుకోలేం, కాని కవి చెప్పదలుచుకొన్న ఊహని మనం ఆశ్వాదించగలం.చాలవరకు, కృష్ణశాస్త్రి కవిత్వంలో, Conscious Suffering అనేది ప్రదానమైన కవితా వస్తువు."మలిన భాష్ప మౌక్తికమ్ముమిలమిల నీ కనుల మెరియతళతళ మని తారలు నటయించునురా పాపి""భరియింపగరాని లజ్జశిరము వంగి కృంగినంతతెరలదాటి చందమామ నవ్వునురా పాపి"ఇంత అందంగా Longing & Conscious Suffering ని చెప్పే కవితలు ప్రపంచ సాహిత్యంలోనే బహుఃసా చాలా అరుదుగా ఉంటాయేమో!అలాగే, ఇంకో కవితలో - ఆరాధనలో ఉండే Constant Remembrance ని కృష్ణశాస్త్రి చాల చిత్రమైన, విరుద్దమైన మెటాఫర్ లో చెప్తాడు:"నీ పిలుపు వినక గాఢనిదురలోన మునిగియున్ననిష్ఠురాఘాతముతోనీవే మేలుకొలిపి, ప్రభూమరలి వెడలిపోకుమాకరుణ క్షణము నిలబడుమా"చెట్టునో, పువ్వునో వర్ణించవచ్చు, అందాన్ని కొంతవరకూ వర్ణించవచ్చు, వసంతాన్ని, వెన్నెలలని వర్ణించవచ్చు. కాని, గర్వాన్ని, వినయాన్ని, మన మనసుకు హత్తుకొనేలా ఎలా వర్ణించడం? పూలజాతర అనే కవితలో:పచ్చనాకుల రాణివాసపుపడతినే, నే సంపంగెనేసరసులను సామంతులను నాస్వాదువాసన పిలుచునేఅని ఒక సంపెంగ పువ్వు బీరాలు పోతుంటే, ఇంతలో ఒక గడ్డి పువ్వు:దారి పక్కను గడ్డిసజ్జెనుదాగిఉండే బీదను, నిరుపేదనుపూజకంటే వస్తిని, ఏ మోజులేనిచిన్నివిరిని, ప్రభువు కొలువునదాసిని, శ్రీపదములకు తివాసినిఅంటుంది. "Ego, Humility" అనే concepts ని, మన మెదడుకి కాకుండా, మన మనసుకి direct గా అందేలా చేస్తుందీ కవిత. కవి మనకి అందచేద్దామనుకొన్న 'feeling' ఎంత abstract ఐతే, మెటాఫర్ కూడా అంత abstract గా ఉంటుంది మరి. గొప్ప భావకవిత్వంలో మన అంతఃప్రపంచానికి సంబందించిన వస్తువుని మనముందు "చిత్రీకరించే" మెటాఫరుంటుంది. భావకవి దృశ్యాన్ని మట్టుకే వర్ణించడు, ఆ దృశ్యంలో నిబిడియున్న నిబద్ధమైన ప్రపంచాన్ని వర్ణిస్తాడు. అందుకే, poetry is felt before it is understood. Logical Analysis కి ఇటువంటి మెటాఫర్ అందదు. తేనియకి బరువేముటుంది? వెన్నెనలు మరగడమేంటి?ఈ మధ్య నేరాసిన ఓ కవిత చదివి, ఒకరు ఆకులు పువ్వులవ్వవు కదండీ - ఇది సైన్స్ కి విరుద్దం అన్నారు. మరి ఆకులు ప్రేమిస్తాయా? Poetry doesn't simply ask for faith - it demands a leap of faith. విశ్వకవి టాగొర్, ఇలాటి విశ్లేషణలతో విసిగిపోయి:If I say the Earth is flat - you tell me that my near vision is falseIf I say that the stars are fire flies in the night forest of the sky, you tell me that my far vision is false.నయనానికి చూపుంది కాని, అది ప్రపంచాన్ని దర్శించ గలదా? నిజాన్ని చూడడంకాదు, సత్యాన్ని దర్శించడం కళల పరమావధి.ఇదీ భావకవిత్వంలో మెటఫర్ గొడవ. ప్రబంధ కవిత్వానికి, భావ కవిత్వానికి ముఖ్యమైన తేడా - వర్ణన ప్రబంధ కవిత్వంలో ప్రదానమైన కవితా వస్తువైతే, కనిపించని, అంతర్లీనమైన భావాలని, స్పందనని వ్యక్తపరచడం భావకవిత్వంలోని ప్రదానమైన కవితా వస్తువు (పొయిటిక్ మెటాఫర్ కోణంలోంచి చూస్తే). అయితే, ప్రాచీన కవిత్వంలో 'abstraction' లేదనీ కాదు, భావ కవిత్వంలో వస్తు వర్ణన లేదనీ కాదు. ఇవి కవిత్వాల తిరుతెన్నులని నిర్వచించే ప్రదానమైన అంశాలు మాత్రమే.ఎలాగైతే, ప్రబంధ కవిత్వంలో అంకురార్పణ చేసికొన్న భావకవిత్వం కృష్ణశాస్త్రి కాలానికి మహావృక్షంగా ఎదిగిందో, కృష్ణశాస్త్రి కాలంలోనే బాలసారె చేసికొన్న అనుభూతివాద కవిత్వం గుంటూరు శేషంద్ర శర్మ, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి మొదలైన వాళ్ళ ఆలనా పాలనల్లో పెరిగి పెద్దదైంది.భావకవిత్వంలో మెటాఫర్ ముఖ్యమైన కవితా వస్తువైతే, అనుభూతివాద కవిత్వం - allegorical గా ఉంటుంది. నయనానికి, దృశ్యానికి మద్యనుండే అనంతమైన ఆకాశాన్ని, దానిలో నిగూఢమైన రహస్యాలని అందుకోడానికి అనుభూతివాది ప్రయత్నిస్తాడు.ఆ గొడవంతా మరికొద్ది రోజుల్లొ -
మూడో భాగంలో చెప్పుకొందాం.
అప్పటిదాకా శేషేంద్ర శర్మతో ఈ వ్యాసం సశేషం.
 
 నాగరాజు పప్పు ( వ్యాసకర్త)

Sunday, February 11, 2007

వాక్యం రసాత్మకం కావ్యం -- మూడో భాగం
తెలుగులో అనుభూతి కవిత్వంయొక్క (ఎల్లిగారికల్ పోయిట్రీ) స్వరూప స్వభావాలు.(ఇంతవరకూ, ప్రబంధ కవిత్వం గురించీ, భావ కవిత్వం గురించీ - వాటి మధ్య తేడాలను గురించీ, లక్షణాలను గురించీ చెప్పుకోన్నాం కదా. ఇంక, ఇక్కడ నుంచీ అంతా అనుభూతి కవిత్వం (అర్ధంకాని కవిత్వం అనే పర్యాయ పదం కూడా ఉంది దీనికి) స్వభావం గురించి, లక్షణాల గురించిన గొడవ.)వర్ణనని ప్రబంధ కవులూ, స్పందనని భావకవులూ తన్నుకు పోయేరు కాదా - మరింక అనుభూతికవికి చెప్పడానికేం మిగిలింది పాపం అనుకొంటున్నారా? నిజమే - చాలా కాలం ఏంచెప్పాలో తెలియక చాలా మంది కవులు పక్క దారులు తొక్కేరు. ఈ మధ్యనే, మనో వైజ్ఞానికశాస్త్రం అందుబాట్లోకొచ్చేక - ఆ స్పందన ఎక్కడ నుంచి పుడుతుందో, ఎలా పుడుతుందో, దాని స్వరూప స్వభావాలెట్టివో వెతికి, వెతికి, శోధించి ఏదో సాధించేద్దామని తెగ తాపత్రయపడిపోతున్నారు. అందుకే అనుభూతి కవిత్వాన్ని వంటబట్టించుకోవాలంటే కొంచెం కష్టపడాలి.మరి ఆ గొడవంతా సావధానంగా ఆలకించండి మరి:శేషేంద్రశర్మగారు - పాపం చాల రోజుల నుంచీ రామకృష్ణాబీచ్ లోనే ఉండి పోయేరు కదా? ఆయన్ని అక్కడ అంతకాలం ఉంచడానికి కారణం ఉందిలెండి - అనుభూతి కవితలు రాయడానికి చాలా టైం పడుతుంది మరి.తుమ్మెదకాటుకి కైపెక్కిపోయింది తిమ్మనగార్కి, తీయతేనియ బరువుతో కూలబడిపోయేరు కృష్ణశాస్త్రి. కాని అలాటి బాధలు శర్మగారి దరిచేరవు. వీళ్ళిద్దరూ ఎందుకిలా అయిపోయేరు అని ఆయన చాలసేపు ఆలోచిస్తాడు - ఈ కైపెందుకు కలుగుతోంది, ఆ బాధ ఎందుకింత తియ్యగా ఉంది అని కొన్ని రోజులు తపస్సు చేస్తాడు, ఆ తర్వాత:నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందికన్నుల్లొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందిఅని అందు కొంటాడు. ఏంటీ శేషేంద్రజాలం? తోట నిదురించటం ఏమిటి? తోటలోకి పాట రావటం ఏమిటి? ఇంతకీ ఎవరికి కన్నీళ్ళు - తోటకా? పాట కన్నిళ్ళు తుడవటమేమిటి? ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు మనం అడిగేలోపే, ఆయన ఇంకాస్తా ముందుకు జరిగి:రమ్యంగా కుటీరాన రంగవల్లుల్లల్లిందిదీనురాలి గూటిలోన దీపంగా నిలిచిందిఅంటాడు. ఇంతకీ తోట ఏమైనట్టూ? పాటేమైనట్టూ? అంతటితో ఊరుకోంటాడా?కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారానది దోచుకు పోతున్న నావను ఆపండీరేవు బావురు మంటుదోందని నావకు చెప్పండీఅని ముక్తాయిస్తాడు. నది నావను దోచుకుపోవడమేంటి? దాన్ని పక్షులూ మబ్బులూ ఎలా ఆపగలవు?దీన్ని మొదటిసారి చదివితే ఒక చరణానికి మరో చరణానికి ఉన్న సంబంధం ఏమిటో బోధపడదు. కవితలో మెటాఫర్ చాలా లోతుగా ఉంటుంది. కవిత మెత్తంఅంతా ఒక విషయం గురించి రాసినట్టుండదు. ఒకంతట అర్ధంమయి చావదు. కవిత్వం చదువుతున్నపుడు మీకు ఇలాంటి ప్రశ్నలే వస్తాయా? మరైతే వీటి రహస్యం చెపుతా వినండి. విన్న తర్వాత - ఛీ - ఇంత అందమైన పాటని ఇలా ఖునీ చేసెస్తావా అని నన్ను తిట్టకండి.అందానికి అర్ధంవెతక్కు అని మీకు ముందే వార్నింగిచ్చేను - మీరు వినలేదు. కావున - పొరబాటు నాది కాదు.ముత్యాలముగ్గు సినిమాలో ఈ పాట మీరందరూ వినే వుంటారు. కె.వి.మహాదేవన్ - కాదు కాదు - మహిమదేవన్ - ఈ కవతని అందమైన పాటగా కూర్చేడు. ఒక్కనిమిషం సుసీలమ్మ గొంతునీ, మధురమైన మహిమదేవన్ సంగీతాన్నీ మరిచిపోయి, ఈ పాటని కవితలా చదివి చూడండి.ఇది అసలు సిసలు పదహారణాల వచన కవిత. వార్తా పత్రికలో వార్తలాగ దీన్ని చదివేసుకోవచ్చు. ప్రతి చరణం పూర్తి పేరాగ్రాఫ్ లాగా, పూర్తి వాక్యంలాగా ఉంటుంది. మీకింకా మహిమ దేవన్ మత్తు వదిలినట్టులేదు కదూ. అయితే, ఇంకోసారి చదవండి:విశాఖపట్న, ఫిభ్రవరి - ౯: నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లొ నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. రమ్యంగా కుటీరాన రంగవల్లుల్లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా నిలిచింది. కొమ్మల్లో పక్షులని గగనంలో మబ్బులని, నది దోచుకు పోతున్న నావను ఆపమని, రేవు బావురు మంటుదోందని నావకు చెప్పమని శేషేంద్ర శర్మ గారు రామకృష్ణాబీచ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు.అనుభూతి కవిత్వం అంతా దాదాపుగా ఇలాగే ఉంటుంది. ప్రబంధ కవులు తమ శక్తినంతా వర్ణించడంలోనూ, ఆ వర్ణనకి కావలిసిన భాష, పదాలు, ఛందస్సుకోసం కొత్త కొత్త సమాసాలు సృష్టించడంలోనూ కేంద్రీకరించేరు. భావకవులు మధురమైన ఊహలని మనకందించడానికి కొత్త కొత్త మెటాఫర్లు కనిపెట్టడంలో తమ శక్తినంతా కేంద్రీకరించేరు - కాబట్టి, భావకవిత్వానికొచ్చేసరికి - భాష తేలికయ్యి, భావం బరువైంది. అదే, అనుభూతివాదుల దగ్గరకొచ్చేసరికి - అర్ధగాంభీర్యం ఇంకా ఎక్కువైపోయి, భాష ఇంకా తేలికైపోయింది.ప్రబంధకవిత్వాన్ని అర్ధంచేసుకోడానికి భాషతో ఎంత కుస్తీలు పడాలో, అనుభూతికవితల లోతులందుకోడానికి అంతకన్నా అవస్తలు పడాలి - అందుకనేమో, చాలమంది భావకవిత్వానితో ఆగిపోతారు.శేషేంద్రశర్మ కవితనే తీసుకోండి - అందులో అర్ధం అందినట్టే ఉంటుంది కాని మనకి పూర్తిగా చిక్కదు. అందుకోడానికి మనమో అడుగు ముందుకేస్తే, అది మరో పదడుగులు పరిగెత్తి మనలని పరిహసిస్తూంటుంది.Allegory ని తెలుగులో ఎమనాలో నాకు తెలియదు. అనుభూతికవితలన్ని ఎల్లిగారికల్ గా ఉంటాయి. అయితే, నిజానికి వీటినర్ధంచేసుకోడం అంత కష్టమేమీ కాదు. సుమారుగా, మంచి అనుభూతి కవితలన్ని ఒక ప్రణాలిక ప్రకారం ఉంటాయి - అంటే, వీటన్నిటిలో ఒక స్ట్రక్చరుంటుందన్నమాట. అంతర్లినమైన, మానసికమైన, ఆథ్యాధ్మికమైన, ఆత్మపరమైన భావాలని ఒక భాహ్యచిత్రానికి అన్వయం చేసి, అంతఃచిత్రానికి భాహ్యచిత్రాన్ని ప్రతీకగా చూపడతాయన్నమాట. అంటే, మనలోపలి Sub-Conscious and Psychological Processes కి ఫొటోగ్రాఫ్ తియ్యడన్నమాట.నిదురించే .. పాట మీద ఓవంద పేజీల వ్యాఖ్యానం రాయొచ్చు. ఇక్కడ కొంచెం క్లుప్తంగానే చెప్తాను:ఈ పాటలో ప్రతి చరణంలో ఉన్న మొదటి పాదాలన్ని కలిపి చదివితే, ఒక అందమైన చిత్రపటం మన ముందుంటుంది. సుమారుగా, ప్రతి ఇంటిలోనూ, గోడలమీద స్వీట్-హోమ్ చిత్రాలుంటాయి గదా? దూరంగా కొండలు, కింద చక్కటి తోట, ఆ తోటలో చిన్న అందమైన కుటీరంలాంటి ఇల్లు, ఇంటికి పక్కగా - మెల్లగా, తీరికగా పారుతున్న నది, పైన పున్నమి చంద్రుడు, ఆ నదిలో తెరచాపెత్తిన నావ, పైనోరెండు పక్షులు, కొండలమీద మబ్బులు - ఇలాంటి ప్రకృతి పటాలెన్ని చూసుంటారు? ఈ చిత్రమంతా ఈ కవితలో ఉంది. అలాటి ఫొటో చూస్తే మనకెలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఏకాంతామూ, నిశ్శబ్ధమూ, నిశ్చలత కలగలసి - చీకులు చింతలూ, వ్యధలూ స్పర్ధలూ, ఆశలూ మోసాలూ లేని ఓ అందమైన సాయంత్రం గుర్తుకు రాదూ?ప్రతి చరణంలో, రెండో పాదంలో అంతర్లీనమైన మానసిక నిశ్చలతని మొదటిపాదంలోని చిత్రంతో అన్వయిస్తాడు. ఒక ఎరిక మనలో పుట్టి, తలుపుగా మారి, స్మృతిగా ఎదిగి, జ్ఞాపకంగా కరిగిపోయే ప్రక్రియని ( inner process) చిత్రీకరించే కవిత ఇది.నిదురించే తోట: మన సబ్-కాన్సష్. మెత్తం జీవితానుభవాన్నంతా ఒక గ్రంధాలయంలా బధ్రపరిచే బేంకు లాటిది సబ్-కాన్సష్. కాని ఇది మన కంట్రోల్లో ఉండదు. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రేరణ, మన సుఖాలు, ధుఃఖాలు, బాధలూ, నవ్వులూ, ఇష్టాలూ, ప్రేమలూ, ప్రతీకారాలు - సమస్తం మన సబ్-కాన్సష్ అదుపాజ్ఞలలోనే ఉంటాయి. మనకోచ్చే కలలన్నీ దీని ప్రభావమే.మెదడు మొగుడైతే, ఇది పెళ్ళాం లాంటిదన్నమాట. సబ్-కాన్సష్ మాట మనం వినాలిగాని, మన నియంత్రణలో అదుండదు. అది చెప్పేదేదో తిన్నగా, సూటిగా, మనికర్ధమయ్యేటట్టు కూడా చెప్పదు. ఒకసారి క్రీగంట చూస్తుంది, సైగ చేస్తుంది - మనం వినిపించుకీకుండా తప్పుచేసిసేం అనుకోండి - చాలా ఆనందం దీనికి, నేను చెప్పేనా - నువ్వు విన్నావా, వినిపించుకొంటేనా అంటూ సరాగాలు పోతుంది. మరదేదో సరిగా సూటిగా చెప్పచ్చుకదా అని అన్నాం అనుకోండి - నన్ను పూర్తిగా ఎప్పుడైనా చెప్పనిస్తేనా, చెప్పేలోపే పరుగందుకొన్నావు కదా అంటూ దీర్ఘాలు తీస్తుంది.మెదడుకున్న శక్తితో పోలిస్తే, దీని శక్తి అపారం, అనంతం. మనం ఎన్నో విషయాలు మరచిపోతుంటాం - కనీసం అలా అనుకొంటాం, కాని, మన జీవితంలో ప్రతి క్షణాన్ని పదిలపరుస్తుంది మన సబ్-కాన్సష్. హేతుబధ్దమైన ఆలోచనల కందకుండా మనలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి, మీరో చీర కొనాలని చీరలకొట్టుకెళ్ళేరనుకోండి - అక్కడ కొన్ని వేల చీరలుంటాయిగదా - అందులో ఒక చీర మ్మిమ్మల్నాకర్షిస్తుంది - ఎందుకో చెప్పగలరా? అలగే, ఎదో లెక్కలు చేస్తున్నారునుకోండి - అది ఒక పట్టాన తేలి చావదు. దాని గురించే ఆలోచించి, తల బద్డ్దలు చేసుకొని, సమాధానం దొరక్క విసిగిపోయి పడుకొంటారు - తెల్లారి లేవగానే, అనుకోకుండా మీకు ఆ లెక్కకి సమాధానం దానంతటదే 'స్పురిస్తుంది' - ఎలాగో చెప్పగలరా? ఒకర్ని చూడగానే, ఎక్కడో చూసినట్టుంటుంది, ఆత్మీయుల్లా అనిపిస్తారు - ఎందుకో చెప్పగలరా? ఇదంతా సబ్-కాన్సష్ చలవే. మన మెదడుకి సంభందించినంతవరకూ ఇదో చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి.పాట: ఎదో ఒక అనుభవం, ఒక ఎరిక, ఒక స్పందన. సాధారణంగా మనల్ని కదిలించే అనుభూతులన్నీ - కొన్ని క్షణాల నిడివి మాత్రమే కలిగుంటాయి. 'అనుభూతిని' మిగిల్చే అనుభవం ఎప్పుడూ గంటలకోద్దీ ఉండదు. ఒక చెట్టునో పుట్టనో చూసినప్పుడూ, ప్రియమైన మనిషిని కలిసినప్పుడూ, మంచి పాట విన్నప్పుడూ, మనల్ని కదిలించే అనుభూతి రెప్పపాటు కాలం మాత్రమే కదా.కుటీరం: మన కందుబాటలో, మన నియంత్రణలో ఉండే మేధా శక్తి (కాన్సష్).రంగవల్లి: అనుభవంగా మారిన అనుభూతి. సాధారణంగా, మనం మనల్ని కదిలించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని, ఆ అనుభూతిని నెమరువేసుకొని, దానికి రంగులు పులిమి, రెక్కలు తొడిగి, ఒక చుట్టలా ఉన్న అనుభూతిని మన ముందు తివాచీలా పరచుకొంటుంటాం. దాన్ని, మన మిగతా అనుభవాలతో రంగరించి, జ్ఞపకాలతో ముడివేసి, ఆలోచనలతో మేళవించి ముగ్గుల్లల్లుతాం. We generate the momentum from the moment. మొదటి చరణంలో పాట రెండో చరణంలో రంగవల్లి అయింది.దీనురాలు: హృదయందీపం: మనలని కదిలించిన ప్రేరణని మనం అనుభవిస్తున్నప్పుడు మనలో జనించే ప్రతిస్పందన. అంటే, పాటని, రంగవల్లిగా మనం మారుస్తున్నప్పుడు మనలో కలిగే పీలింగన్నమాట. ఆనందమో, విషాదమో, మాధుర్యమో, లాలిత్యమో, కోపమో, భాదో - ఇలాంటి ప్రతిస్పందనలు మనలో కలుగుతాయి కదా. ఈ ప్రతిస్పందనలు దీనురాలైన హృదయానికే గాని, సబ్-కాన్సష్ కుండవు. అలాగే, ప్రతిస్పందనలు - స్పందన మనలో జనించినప్పుడు కలగవు, ఆ స్పంధనని మనం అనుభవిస్తున్నప్పుడు కలుగుతాయి. రెండో చరణంలో రంగవల్లి ఇప్పుడు దీపమయ్యింది.నది: జీవన స్రవంతి. జీవితం ఎప్పుడూ ఎక్కడా ఆగదు, నదిలా అన్ని తనలో ఇముడ్చుకొంటూ, సాగిపోతుంటుంది కదా. ఎవరో ఒక గ్రీకు తత్వవేత్త చెప్పినట్టు ఒకే నదిలో నువెప్పుడూ రెండుసార్లు స్నానం చెయ్యలేవు - ఎందుకంటే, మునకేసి లేచేటప్పటికి కొత్తనీరు వచ్చెస్తుంది కదా?నావ: ఇంతకు మునుపు దీపంగా మారిన పాట, కొంత కాలానికి ఒక స్మృతిగా మారి - కాల ప్రవాహంలో కలసిపోయి, మన జ్ఞాపకాల మరుగున పడి కనుమరుగై కొట్టుకుపోతుంది.పక్షులు, మబ్బులు: పాత స్మృతులని హఠాత్తుగా వెలికితీసే ప్రేరణలు.బావురుమన్న రేవు: నిస్సారమైన, మార్పులేని దైనందిన జీవితం.సబ్-కాన్సష్ లో జనించిన ఒక ఎరిక, అనుభవంగా, జ్ఞాపకంగా ఎదిగి, మన ఎదలో ప్రతిస్పందనలు రేపి, స్మృతిగా మారి, చివరికొక జ్ఞాపకంగా కరిగిపోయే ప్రక్రియనంతా ఈ పాటలో ఎల్లిగారికల్ గా - ఒక పాట, రంగవల్లిగా ఎదిగి, దీపంగా మారి, నావగా అదృశ్యం అవ్వడం అనే చిత్రంతో అన్వయించేడన్నమాట. ఈ మధ్యనే కల్హార బ్లాగరి స్వాతికుమారి రాసిన అంతర్వాహిని అనే కవిత కూడా సుమారుగా ఈ థీమ్ మీద రాసిన కవితే.పాట నావగా మారడమేమిటండీ - వింటున్నాంగదా అని మా చెవుల్లో పువ్వులు పెట్టెస్తున్నారు గాని అంటారా? ఏం ఎందుకు మారకూడదూ?గనుల్లొ బొగ్గురాళ్ళు, జలపాతాల్లొ నీటి ధారలు, విద్యుచ్చక్తిగా రూపొంది, మీ ఇంటి దీపాల్లో కాంతి పుంజాలుగా, చూరులపైన పంకాల్లో చలన శక్తిగా, మీ శకటాల్లో గమన శక్తిగా రూపొందటంలేదూ? అంతెందుకు? మీ కంప్యూటర్ తెరమీద కనిపిస్తున్న ఈ అక్షరాలు కూడా విద్యుత్తే కదా - అంటే, ఒకప్పుడు ఈ అక్షరాలు నీటి ధారలో, బొగ్గు ముక్కలో కావా? నల్లటి బొగ్గు అందమైన అక్షరం అయినప్పుడు - పాట నావెందుకు కాకుడదూ?పిండితే త ఫిలాసఫీ ఉంది ఈ పాటలో.అనుభూతి కవిత్వాన్ని పరిచయం చెయ్యడానికి మాత్రమే నేను ఈ పాటనెన్నుకొన్నాను. మంచి అనుభూతి కవితలన్ని సుమారుగా ఇలాగే ఉంటాయి. అయితే, చెత్త కవితలని కూడా, ఉదాహరణకి:మా ఆవిడ శిరోజాలకి శిశిరం వచ్చిందిఅందుకే, నిన్న రాత్రి నిద్దట్లో నేనుహేమంతాన్ని తినీశేనులాంటి కవిత్వాన్ని కూడా అనుభూతి కవిత్వంగా చెలామణీ చేసెస్తున్నారీమద్య. అర్ధంకానిదీ, అర్ధంలేనిదీ ఒకటి కాదు కదా? అర్ధంలేని కవిత్వాన్ని కుడా అనుభూతి కవిత్వమంటే ఏంచెయ్యగలం? చచ్చినవాడి కళ్ళు చేరడేసి అని ఊరుకోవాలంతే.మరైతే, ఈ అనుభూతికవిత్వాన్ని ఆశ్వాదించాలంటే సైకాలజీ అంతా తెలియాలా అని అడుగుతారేమో. నిజానికి, మంచి అనుభూతి కవిత్వాన్ని గుర్తించడం, ఆస్వాదించటమూ అంత కష్టమేమీ కాదు.ఆ విషయాలన్ని తరవాతి భాగంలో చెప్పుకొందాం. వీటిని చదవటం ఎలాగో, రాయటం ఎలాగో - నాకు తెలిసినంత వరకూ - తరువాతి భాగాలో వివరిస్తాను. నాలుగో భాగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కవితలనో మారు స్పృశించి, డైలాన్ థామస్ గురించీ చెప్పుకొని, అనుభూతి కవితల స్ట్రక్చర్ గురించి, మంచి కవితలనెలా గుర్తించాలో వివరిస్తాను. ఆ తర్వాత, వీటిని రాయడంలో నాకు తెలిసిన చిట్కాలు కొన్ని చెప్తాను.అనుభూతి కవిత్వం గురించి ఇంత విపులంగా ఎందుకు రాస్తున్నానంటే, ప్రబంధ కవిత్వం గురించి, భావ కవిత్వం గురించీ వివరించే వ్యాసాలూ, పుస్తకాలు చాలానే ఉన్నాయి. కాని, నాకు తెలిసినంతలో, అనుభూతి కవిత్వాన్ని నిర్వచించి, వివరించే ప్రయత్నం ఇంతవరకూ తెలుగులో ఇదే ప్రధమమేమో.మీ అభిప్రాయాలని నాకు తప్పకుండా తెలియ చెయ్యండి - ఈ వ్యాసాన్ని మెరుగుపరిచి, ఇందులో తప్పులేమైనా ఉంటే సరిదిద్దటానికి మీ సూచనలూ, అభిప్రాయాలూ నాకు చాలా విలువైనవి....

No comments: