Friday, February 22, 2013

|| కలానికే రక్తపు పోటు||

కపిల రాంకుమార్ || కలానికే రక్తపు పోటు||

దారుణ మారణ కాండ
భాగ్యనగర నడిబొడ్డున
విధ్వంసం
అందరూ ఖండించే వాళ్ళే
ఇంకొక పక్క
ఓకరి మీద ఓకరు
దుమ్మెత్తిపోసే వాళ్ళే
దొంగలే .. దొంగాదొంగా అన్నచందాలు!
ప్రపంచ పకృతిలో మార్పులు సైతం
కనిపేట్టి హెచ్చరికలు చేసే
డేగ కళ్ళకు
దుర్మార్గుల అంతరంగాల
కుతంత్రాల పసిగట్టే
రోజెపుడో! నేర్పెపుడో!

కళింగ యుద్ధ భీభత్సానికి
అశోకునికి వైరాగ్యమొచ్చి
భౌద్ధం స్వీకరించాడు అది అతని
సంస్కారం!

ఉగ్ర వాదులకు మాత్రం పరివర్తన
రాదు...రాదు.

నిఘాలోపం స్పష్టంగా కనబడుతోంది
మృతుల,క్షత గాత్రుల లెక్కింపులో్
పత్రికకు పత్రికకూ
మీడియ మీడియాకు
పొసగని గణాంకాలు
సర్కారు గణితాలు మరొకతీరు

పుకార్లకి సికారు చేసే అలవాటెక్కువ
ప్రజలు జాగ్రత వహించపోతే
సంయమనం పాటించకపోతే
పునరావృత మయ్యే ప్రమాదాలు లేక పోలేదు

సమయానికి రాని రక్షక భటులు
అత్యవసర వైద్య సేవల నిర్లక్ష్యాలు
శవాలనమ్ముకునే వారికి
సవాలు చేసే వారెవరూ లేక
పెచ్చుమీరుతున్న స్వార్థ పరత్వం

రాజకీయ పబ్బం గడుపునే
ఆరంగేట్రం మరో యెత్తుగడలకు
సన్నద్ధం కాకముందే
మరెంత మనసులుం మానవత్వం
మసి కానుందో...భూతద్దాలతో వెతుకుదాం
దొరికితే ఉతికి ఆరేద్దాం!

మానవత్వం తో రక్త దానం చేసే వారు
అనాథలైన పిల్లలను ఆదుకునేవారు
పోషించే దిక్కు కోల్పోయినావరికి చేయూతనిచ్చేవారు
చెదిరిన మదిని ఒదార్చేవారు
తమ పరిథిలో ఆపన్న హస్తాలివ్వటమే!
.....
యేదో ఇంకా రాయాలనివున్నా
అక్షరాలు విలపిస్తుంటె
పదాలు ముందుకు కదలలేనంటుంటే
ఈ నాలుగు మాటలు రాయటానికి
కూడ మొరాయిస్తున్న చేతి వేళ్ళను
సముదాయించలేని
నిస్సహాయతతో.........నా కలానికి రక్తపు పోటొచ్చింది!
కాస్త మౌనం మనసుకు స్వాంతనం కావాలి

22.2.2013 ఉ. 5.45

No comments: