Saturday, January 12, 2013

దాశరధి రంగాచార్య కథల్లో స్త్రీ పాత్రలు

దాశరధి రంగాచార్య కథల్లో స్త్రీ పాత్రలు

టి. అన్నపూర్ణ 9912776182
    దాశరధి రంగాచార్య మలితరం కథా రచయితలల్లో ఒక్కరు. వారి జీవితం – సాహిత్యం వేరుకాదు. ఒకే రంగానికి పరిమితం కాకుండా సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ఎప్పటికప్పుడు మార్పును తీసుకరావడానికై కృషిచేశారు.
    దాశరధి సామాజిక దృక్కోణం నుండి వెలువడిన కథల సంపుటి ”నల్లనాగు” ఈ సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. ఈ కథల నిండా సామాజిక వాస్తవికతే ఉంది.
    ”నల్లనాగు” కథా సంపుటిని పరిశీలించినప్పుడు కొన్ని (ఎనిమిది) కథల్లో చూస్తే అందంగా లేక ఆత్మన్యూనతతో బాధపడుతూ వివాహం విషయంలో సర్ధుబాటుతత్వాన్ని అవలంభించే స్త్రీలు, కన్నపిల్లల మీదనే కాదు పిచ్చుకలు, కుక్కలు, మూగజీవాల మీద ప్రేమను కురిపించే భూతదయగల స్త్రీలు, కొడుకును యుద్ధానికి పంపించే వృద్ధ స్త్రీ, ఆకలికోసం శరీరాన్ని అమ్ముకున్నా మరొకరి ఆకలిని చూసి సహాయం చేసే యువతులు, స్వతంత్య్ర వ్యక్తిత్వం గల స్త్రీలు, ఆర్ధిక లేమితో బాధపడినా వ్యక్తిత్వాన్ని కోల్పోని పనిమనుషులు, ఆకలిముందు అమ్మతనం అమ్ముడుపోయి మనస్థాపానికి గురైన తల్లులు, ఎలాగైనా జీవితాన్ని గెలుచుకోవాలనుకునే ఛాలెంజ్‌ మనస్తత్వం గల విద్యావంతులు, నమ్మినవారు వంచిస్తే ప్రతీకారం తీర్చుకున్న భార్యలు, రంగాచార్య కథల్లో కనిపిస్తారు.
    ”ప్రేమకథ”లో తల్లిదండ్రులు లేని మేరి నల్లగా ఉన్న కారణంగా యుక్తవయస్సు దాటినా కూడా వివాహానికి నోచుకోదు. తనను ఇష్టపడే ఏ మగవాడైనా ఫరవాలేదని సర్ధుకు పోగలనని తోడు కోసం ఎదురుచూస్తున్న మేరి జీవితంలోకి రమేష్‌ అనే నిరుద్యోగి ప్రవేశిస్తాడు. రమేష్‌ మేరి నెలజీతాన్ని చూసి ఆమెతో జీవితం పంచుకోవాలనుకుంటాడు. రమేష్‌ కారణాలతో నిమిత్తం లేకుండా తనతో జీవితం పంచుకోవడానికి అతన్ని మనస్ఫూర్తిగా మేరి ఆహ్వానిస్తుంది.
    స్త్రీ ఎప్పుడు పురుషుడు ఎవరని చూడదు. అతని నేపథ్యం ఆమెకు అవసరం లేదు. తనని ప్రేమిస్తే చాలు సొంతంగా జీవితాన్ని అర్పించే లక్షణముంటుందని మేరి ద్వారా రచయిత మనకు తెలియజేశాడు.
    ”జై జవాన్‌!”లో దేశం ఆపదలో ఉన్నప్పుడు దేశాన్ని కాపాడటం దేశభక్తుల బాధ్యత. జవాన్‌కైతే ఈ బాధ్యత మరింత ఉంటుంది.
    ”జై జవాన్‌” కథలో దేశభక్తుడైన జవాన్‌కు తల్లిగా ఉన్న వృద్ధ స్త్రీ మనో పరివర్తనను తెలుపుతుంది. వృద్ధాప్యంలో తనకు ఆసరగా, బాలింతగా ఉన్న కోడలుకు తోడుగా ఉండాల్సిన కొడుకు యుద్ధానికి వెళ్తానంటే మొదట నివారించింది. కానీ గ్రామంలోని దేశభక్తులు తన కొడుకు కర్తవ్యాన్ని గుర్తించి నినాదాలు చేస్తుంటే తన కొడుకు సేవలు కుటుంబానికే కాదు, దేశానికి మరింత అవసరమని భావించి యుద్ధానికి పంపిస్తుంది.
    జవాన్‌ ఎంతటి దేశభక్తుడో ఆయనను కన్నతల్లి కూడా అంతటి దేశభక్తురాలే అని ఈ కథలోని వృద్ధ స్త్రీ పాత్ర ద్వారా తెలుస్తుంది.
    ”నవల” కథలో ఆకలి తీరడానికి అనివార్యంగా వేశ్యా వృత్తిని ఆశ్రయించే స్త్రీలో ఎంత మానవీయత ఉంటుందో ”నవల” కథలోని వేశ్యా పాత్ర నిరూపిస్తుంది. తనతో గడిపితే వచ్చేరూపాయితో ఆకలి తీర్చుకోవచ్చని ప్రయత్నించిన వేశ్యకు ఎదురుగా ఉన్న రచయిత నుండి నిరుత్సాహమే ఎదురవుతుంది. కారణం రచయిత కూడా కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తూ, ఆకలితో బాధపడుతున్న వాడే కనుక. వేశ్య మరొకనితో గడిపి తనకొచ్చిన సొమ్ములో చిన్న మొత్తాన్ని ఆకలి తీర్చుకో అంటూ రచయిత కివ్వడంతో ఆమె మానవీయత అతిశయిస్తుంది. సభ్య సమాజంలో బతుకుతున్నామనుకునే వ్యక్తుల కంటే నిరాపేక్షంగా ఎదుటివారి ఆకలిని తీర్చేందుకు సిద్ధపడిన వేశ్య మానవీయతలో ఎంతో ఎత్తుకు ఎదిగిందనిపిస్తుంది.
    కటిక దారిద్య్రంలో కూడా ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం కల్గిన వేశ్యలను ఉద్దేశించి ఈ కథలో తెలిపారు.
    ”పిచ్చుకలు”, ”కుక్కపిల్ల” ఈ రెండు కథల్లో సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలోని స్త్రీలు, పిల్లలతో పాటు పిచ్చుకలను ప్రేమగా చూసుకునే స్త్రీలు, అదే విధంగా కుక్కలను ప్రేమించే స్త్రీలు కుక్కలకు అన్ని పనులు చేస్తూ ఆనందించే స్త్రీలు, భూతదయ కల్గిన స్త్రీలు కనబడతారు.
    మధ్యతరగతి కుటుంబంలోని పిల్లలకు ఆహారం సరిగ్గా ఉండక తిండికే ఇబ్బందిగా ఉన్నా మూగజీవాలను ప్రేమించే స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారని ఈ రెండు కథల ద్వారా రచయిత తెలియజేశారు.
    భార్య దగ్గర ఏకపత్నీవ్రతుడుగా ఫోజులిచ్చే భర్త, ముసుగులు ధరించి సంఘంలో పెద్ద మనుషులుగా  ఫొజులు కొట్టే పురుషుల వికృత లక్షణాన్ని తెలిపే కథ నల్లనాగు. విశ్వనాధం తన పి.ఏ శర్మిల వైపు కన్నెత్తి కూడా చూడనని భార్యతో చెప్పి ఆమె హృదయంలో వ్యక్తిత్వం ఉన్న భర్తగా స్థానం సంపాదించాడు. భార్య ఇంట్లో లేని సమయంలో, ఏకాంతంలో పనిమనిషి నీలమణిపై మనస్సు పారేసుకొని దిగజారడానికి ప్రయత్నిస్తాడు. ఒక దశలో ఆమెతో పశువులా ప్రవర్తిస్తాడు. కానీ ఆమె పేరుకే పనిమనిషి. ఆర్థిక లేమితో ఉన్న నీలమణి పవిత్రమైన వ్యక్తిగా తనకు తాను నిరూపించుకుంటూ విశ్వనాధం ఎలాంటి సంస్కార హీనుడో వీధిలోకి గుంజి నలుగురి ముందు ధైర్యంగా బుద్ధిచెబుతుంది.
    ఈ కథలో అమాయకంగా భర్త మాటలు నమ్మే భార్యగా సుజాత కన్పిస్తే, పేదరికంలోనైనా ఆత్మగౌరవంతో బతకాలని నిరూపించిన స్త్రీగా పనిమనిషి నీలమణి కనబడుతుంది.
    ”విలువలు వలువలు” కథలో ఆకలి ముందు అమ్మతనం అమ్ముడుపోయింది. కటిక దారిద్య్రంతో పసికూన అయిన కొడుకుని భూస్వామికి తాకట్టుపెట్టింది. భర్త అకాల మరణానికి గురికావడంతో ఒంటరిదైన స్త్రీ తిరిగి దొరకమ్మిన కొడుకును తనకు వృద్ధాప్యంలో తోడుంటాడని ఆశపడింది. కానీ ఈ ఆశ అడియాశ అయిన స్థితి ”విలువల వలువలు”లో కనబడుతుంది.
    వీరను బాల్యంలోనే వెంకటయ్య దొరకు తల్లి అమ్మేస్తుంది. వెంకయ్య దొర దగ్గరనే కట్టుబానిసగా ఉన్న వీర యుక్త వయస్సుకు వచ్చాడు. తండ్రి మరణించాక తల్లి తిరిగి తనను తీసుకెళ్ళడానికి వస్తే దొర దగ్గర నుండి తిరిగి తల్లి దగ్గరకు వెళ్ళితే అన్నం దొరకదని భావించిన వీర తల్లి దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడడు.
    ఈ కథలో వీర తల్లి పేదరికం వల్ల పేగుబంధాన్ని తెంచుకోవల్సిన అవసరం ఏర్పడిందని రచయిత తెలిపారు.
    ”అర్థరాత్రి అరుణోదయం” కథలో ధన వ్యామోహంలో పడి  ప్రేమ పేరుతో యువతులను వంచించి పెళ్ళి చేసుకొని తర్వాత భార్యనే అమ్మాలని చూసే వంచనా పూరితమైన భర్త, మోసపూరిత మనస్తత్వమున్న కొడుకుకు సహాయం చేసే తల్లి వృత్తాంతాన్ని తెలిపే కథ అర్థరాత్రి అరుణోదయం.
    ఈ కథలో రమణి అనే యువతి చిన్నతనంలో తండ్రిని కోల్పోయి తల్లి పెంపకంలో ఎదిగింది. శరత్తు అనే యువకుడు తాను ఒంటరినని, అనాథనని రమణిని నమ్మించి వివాహం చేసుకోవాలనుకుంటాడు. వీరి వివాహానికి అంగీకరించని రమణి తల్లిని బలవంతంగా ఒప్పించి కట్నకానుకలిచ్చి శరత్తును వివాహం చేసుకుంటుంది రమణి. కాపురం పెట్టాక శరత్తుకు ఓతల్లి ఉందన్న  వాస్తవం రమణికి తెలుస్తుంది. మొదటి నుండి శరత్తు తనను వంచిస్తున్నాడనే వాస్తవాన్ని చెబుతున్నా, తల్లిమాట విననందుకు రమణి బాధతో ఏడ్చింది. భర్త అత్తల వేధింపులకు తట్టుకోలేక తల్లి ఉంటున్న ఇల్లు కూడా అమ్మి డబ్బు తెచ్చి భర్త, అత్త చేతుల్లో పెట్టాక కూడా రమణి వేధింపులకు గురౌతూనే ఉంది. ధన పిశాచాలైన భర్త, అత్తలు తనను గృహంలో నిర్భంధించి తనకు కావలిగా చిత్తమ్మను ఉంచారు. అర్థరాత్రి అరబ్బుషేక్‌కు తనను అమ్ముతున్నారని చిత్తమ్మ ద్వారా తెలుసుకున్న రమణి తీవ్ర మనస్థాపానికి గురౌతుంది. నరరూప రాక్షసులైన భర్త, అరబ్బు నుండి తనను తాను రక్షించుకోవలసిన అవసరం ఉందని రమణి అనుకుంటుంది.
    తనను కొనడానికి అర్థరాత్రి ఇంటికి వచ్చిన అరబ్బును, అమ్మడానికి సిద్ధపడ్డ భర్తను తలుపుతీసి లోపలికి వస్తుండగా తలుపుచాటున ఉన్న రమణి సాహసంతో రోకలితో తలలు పగలగొడుతుంది. ఆ దుర్మార్గుల ఎర్రని రక్తపు మడుగులోంచే ఈ అర్థరాత్రి అరుణోదయం అయిందని తన చీకటి జీవితానికి ఇదే సూర్యోదయం అని రమణి భావించింది.
    ఈ కథలో ఆపదలో ఉన్న స్త్రీ తనను తానే ఉద్దరించుకునే సాహస నారీమణి కావాలని రచయిత ఉద్భోదించాడు.
    ఈ కథల్లో రచయిత ప్రధానంగా స్త్రీ సమస్యలను చిత్రించకపోయినా కథలో అంతర్భాగంగా స్త్రీ స్థితి, గతిని చెబుతూ వచ్చాడు. అయితే వస్తు ప్రాధాన్యాన్ని బట్టి సంఘటన, నిర్మాణాన్ని బట్టి శిల్ప చాతుర్యాన్ని బట్టి ఈ కథల్లో స్త్రీ పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలిపినట్లుగా మనం భావించవచ్చు.

http://www.prasthanam.com/node/11


No comments: