Saturday, January 5, 2013

నవత || త్రైమాసిక పత్రిక

  • కపిల రాంకుమార్ || నవత || త్రైమాసిక పత్రిక||
    (1959- శోభకృతు - ఆశ్వీజము ) ప్రథమ సంచిక

    1959 లో విద్యానగర్ హైదరాబాద్ లో నక్షత్ర సప్తకం పేర ( సెవెను స్టార్స్ సిండికేట్) వెలసింది. మానవుని మహోన్నత మస్తిష్కంలోంచి ఎప్పుడు యెటువంటి నవచైతన్యం బహిర్గతమై ప్రపంచ పునాదులతో సహా మార్చివేస్తుందో-మానవుని అంతర్హృదయాల్లో పెల్లుబుకే కళావాహిని యేనాడు గట్లనొరసి పారుతుందో - గ్రహించటం సామాన్య మానవుని పరిమిత మేథస్సుకి అలవి
    కాదు. ఒక్కొక్క జాతిలో, ఒక్కొక్క తరాలలో ఒక్కొక్క కళాకారుడు సంగీత, సాహిత్య, చిత్రలేఖనాల్లో ఒక నవ శకానికి,మరో భవిష్యత్తరానికి నాంది పలుకుతాడు. ఆ బాటలో యెంతోమంది పయనించి మరింత దృఢపరుస్తారు. - మహాకవి శ్రీశ్రీ ప్రధాన సంపాదకుడుగా '' నవత '' ఒక వెలుగు వెలిగి
    మలిగిపోయింది. దానికి శ్రీకారం చుడుతూ '' జననం ఆనందదాయకం. జ్నించేది శిశువు. చిన్ని ఊహ, నెబ్యులాలో నక్షత్రం, కవి హృదయంలో గీతం, క్విత్వాన్ని ప్రకటించే పత్రిక యేదైనా కావచ్చు. మళ్ళీ అంటున్నాను - జననం ముదావహం" అన్నాడు శ్రీశ్రీ. '' నవత " కవిత్వం నిమిత్తం జనించింది. మంత్రసానితనము, పౌరహిత్యము వహించటానికి అంగీకరించిన నేను ఆంధ్ర సాహిత్య జీవితంలోకి
    కొత్త శిశువు ప్రవేశాన్ని ఆదరాభిమానపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ఎందుకో మరణం కూడ జ్ఞాపకం వస్తోంది. ఆద్యంత రహితమైన జీవితానికి జనన మరణాలని ఆద్యంతాలుగా అంగీకరించడం వలననేమో! ఇతర పత్రికల కన్న సాహిత్య పత్రికలు యెక్కువగ పెందరాళే చచ్చిపోతూండటం వల్లనేమో! జనించడమంటే మృత్యువును జయించటం అనుకొంటే ఒకసారి జనించిన పత్రికకి యికమీద మరణం లేదన్నమాట. ఈ విశ్వాసమే '' నవత " ను నవంసవంగా నడుపుతుంది.ఏదో ఫలానా భాషలో కవిత్వం ఆగిపోయిందనుకోటం పొరపాటు. కవన ఝరి జీవనది. వ్యక్తులు మరణిస్తారు. లేదా వారి వ్యాపకాలు స్తంభిస్తాయి. ఐనా కొత్త శక్తులు ఒకదాని తరువాత ఒకటిగా పుట్టుకొస్తూనే వుంటాయి. జీవితానికి పర్రజయంలేదు. జీవిత విజయాన్ని వేయినోళ్ళచాటే కవనానికి మరణంలేదు. రాస్తున్న కవులకు,రాయబోయే కవులకు ( రాబోయే కవులకు) '' నవత " పుటలు వివృత ద్వారాలు. '' నవత '' నిపెంచే పూచీ సంపాదక వర్గానిది. పోషించే బాధ్యత పాఠకలోకానిది.
    '' కదిలేది కదిలించేది, మారేది, మార్పీంచేది
    పాడేది, పాడించేది, పెను నిద్దుర వదిలించేది
    మునుముందుకు సాగించేది
    పరిపూర్ణ బ్రతుకిచ్చేది
    కావాలోయ్ నవకవనానికి ''
    అన్న అందరి కోరిక మన్నించి భారతియిచ్చిన కానుక ' నవత ' త్రైమాసిక పత్రిక. -శ్రీశ్రీ.

    దీని ప్రతి మా బోడేపూడి విజ్ఞానకేంద్రం - గ్రంథాలయంలో వున్నది.(అందులో మొదటి కవిత ఆరుద్ర ది) 5-1-2013 సా.7.25

No comments: