Saturday, March 2, 2013

ఆధునిక బాలగేయ సాహిత్య పతాక గిడుగు వెంకట సీతాపతి

ఆధునిక బాలగేయ సాహిత్య పతాక గిడుగు వెంకట సీతాపతి
Sun, 2 Jan 2011, IST vv

పెద్దలకు సాహిత్యం వుంది. అలాగే బాలలకు కూడా సాహిత్యం వుంది. అదే బాలసాహిత్యం. క్రీ.శ.1800 సంవత్సరానికి పూర్వం బాల సాహిత్యమనేది లేదనుకోవచ్చు. ఉన్నా అది లిఖితం కానిది. జానపదసాహిత్యంలో అంతర్భాగమై వుంది. 1819లో పిల్లల కోసం విక్రమార్కుని కథలు పుస్తకం అచ్చయ్యింది. ఆనాటి నుంచి బాలసాహిత్యం అంతర్లీనంగా వచ్చింది.

బాలల సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఇది ఒక పూలతోట వంటిది. దానికి తోటమాలి కావాలి. బాలలు విత్తుల్లాంటి వాళ్లూ, మొక్కలాంటి వాళ్లు మొలవడం పెరగడం వాటి ధర్మం. అయితే వాటికి అవకాశాన్ని రక్షణను పోషణను కల్గించడం పెద్దల కర్తవ్యం. బాలల వ్యక్తిత్వ వికాసాల పరిరక్షణ భారం ఎప్పుడూ పెద్దలదే. ఇది సామాజిక నైతిక ధర్మం. దీన్ని గుర్తించిన సాహితీవేత్తలు బాలల సాహిత్యాన్ని సృష్టించి సంస్కృతిని కాపాడతారు. వారు సంస్కర్తల లాంటివారు వారు తల్లిలాగా, తండ్రిలాగా గురువు లాగా, మిత్రునిలాగా బాలల కోసం సాహిత్యం సృష్టిస్తుంటారు. దీని పరిధి విస్తారమయ్యింది. బాధ్యతాయుతమైంది. శ్లాఘనీయమైంది.

20వ శతాబ్ది ప్రారంభంలో అధునిక తెలుగుసాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఆంగ్లభాషా సాహిత్య ప్రభావ కారణంగా పరిణమించినట్లే బాలసాహిత్య ప్రక్రియ కూడా ఆంగ్లసాహిత్య ప్రభావం వల్ల వచ్చింది. పిల్లలు చదివి అర్థం చేసుకో గల సాహిత్యం ఈ వికాస దశలోనే వెలువడింది. బాల సాహిత్యరచయితల్లో ప్రథముడిగా, ప్రముఖుడి గా దర్శనమిస్తారు శ్రీ గిడుగు వెంకట సీతాపతి. ఈయన 1885వ సంవత్సరం జనవరి28 వ తేదీన విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తెలుగు వ్యావహారిక భాషోద్యమసారధి అయిన గిడుగు వెంకటరామ మూర్తి దంపతులకు జన్మించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, సవర భాషోద్దరణ లోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలనచిత్రా ల్లోను మరియు కొన్ని నాటకాల్లోను నటించారు. మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వానికి అనేక వ్యాసాలు రాశారు. తెలుగులో భాషాసమితి ఏర్పడినప్పుడు తెలుగు విజ్ఞాన సర్వస్వానికి ప్రధాన సంపాదకుడిగా నియమితుల య్యారు. చరిత్ర- రాజనీతిశాస్త్రసంపుట సంపాదక వర్గంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యరా యాంధ్ర నిఘంటువు చివరిదశలో వీరు సంపాదకత్వం వహించారు. ఈయన రాసిన తెలుగు వాక్యాల్లో ముఖ్యమైనవి భారతీశతకం, సరస్వతీ విలాసం, కొద్దిమొర్ర కువలయావళీ నాటిక మొదలై నవి. వీరు బైబిల్‌ మూడు సువార్తల్ని సవరభాషలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్థనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. '' తెలుగులో చంధోరీతులు' అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. ఈయనను ఆంధ్రవిశ్వకళా పరిషత్‌ కళా ప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. వీరి ఇంగ్లీషురచనల్లోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్‌ ప్రదానం చేసింది.

సీతాపతి రాసిన రచనలన్నీ ఒక ఎత్తు అయితే, బాలల కోసం సృష్టించిన సాహిత్యం మరొక ఎత్తు. ఈయన చిలకమ్మ పెళ్లి, ఎలుకా-పిల్లి, రైలుబండి, ఈగా-సాలీడు మొదలైన రచనలు 1907-1909 మధ్యకాలంలో 'వివేకవతి' పత్రికలో ప్రచురిత మయ్యాయి. ఆనాడు బాలగేయాలకు అసలు ఆదరణే వుండేది కాదు. ఆ కారణంచే ఆయన చాలా కాలం వరకు మళ్ళీ గేయాలు రాయలేదు.

సీతాపతి 1909 సంవత్సరంలో రాసిన చిలకమ్మ పెండ్లి గేయకథలో బొమ్మల పెళ్లిళ్లను గూర్చి -

చిలకమ్మా పెండ్లి అని చెలికత్తెలందరూ

చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు.

పందిట పిచ్చుకలు సందడి చేయగా

కాకుల మూకలు బాకాలూదగ

కప్పలు బెకబెక డప్పులు కొట్టగ

కొక్కొరోకోయని కోడికూయగా

ఝుమ్మని తుమ్మెద తంబుర మీటగ

కుహుకుహుయని కోయిల పాడగా

పిల్ల తెమ్మరలు వేణువూదగా

నెమలిసొగసుగా నాట్యం చేయగా

సాలీడిచ్చిన చావుకట్టుకుని

పెండ్లి కుమారుడు బింకము చూపగ

మల్లీమాలితీ మాధవీలతలు

పెండ్లి కుమారుని పెండ్లి కూతురిని

దీవిస్తూ తమ పూవులు రాల్చగా

మైనా గోరింక మంత్రము చదివెను

చిలకమ్మ మగడంత చిరునవ్వు నవ్వుతూ

చిలకమ్మ మెడకట్టె చింతాకుల పుస్తె

అంటూ

ఈ గేయం ప్రకృతి సౌందర్యంలో పెళ్ళి ముచ్చట్లను మేళవించి పిల్లలకు వేడుక కలిగించింది.

సీతాపతి బాలలకు నీతులు మనసుకు హత్తుకునే విధంగా ఎలా చెప్పాలో వివరిసూ.....

'' పిల్లల చెవులకు ఇంపగు పలుకులు

పిల్లల మదిలో నిలిచే నీతులు

పిల్లల కోసము పిట్ట కథలుగా

పెద్దలు చెప్పండీ సుద్దులు పలకండీ''

అన్నారు.

రాతలు కాకుండా పిల్లలు మెచ్చేవి చిరకాలం మనసులో నిలిచే కథలు, కబుర్లు తేలిక భాషలో చెప్పాలంటారు సీతాపతి. ఆ తర్వాత 1940 సంవత్సరంలో సీతాపతి ''భారతి' సాహిత్య మాస పత్రికకు సంపాదకులైనప్పుడు బాలలకోసం సుహిత మైన రచనలు చేయమని కవులకు, రచయితలకు ప్రబోధించారు. ఈ విన్నపానికి చాలా కాలం ముందే బాలసాహిత్య వికాసం పట్ల విజ్ఞాన దృష్టి కలిగిన సీతాపతి గారి మనవి యిది.

బాల చిత్తములు చిగుర్చునట్లుగ

పాటలు పాడండో కవులార!

పిల్లల ఊహాలు ప్రబలేరీతిని

పిల్లల కనువగు నీతులు చూపే

అచ్చరవును కల్గిస్తూ అందరూ

మెచ్చెకథలను చెప్పండయ్యా!

అని అన్నారు.

సీతాపతి తృష్ణ నెరవేరింది. నూతనోత్సాహంతో కవులు, రచయితలూ బాలల కోసం కలం పట్టారు. వారు రాసిన గేయాల్ని గేయకథల్ని చిన్న కథల్ని 1955 సంవత్సరంలో 'బాలానందం' అనే అనే శీర్షికతో పుస్తకరూపంలో ముద్రించారు. 1958 సం||లో బాలవినోదం అనే గేయసంపుటా న్ని ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన బాలసాహిత్య రచనాలయాల్ని నిర్వహించి యువ రచయితలకు శిక్షణ కూడా యిచ్చారు. ఎందరో, కవులకు రచయితలకు మార్గ దర్శకులయ్యారు.. అందుకే ఆయనని 'ఆధునిక బాల గేయ సాహిత్య ఆధ్యులు అని అంటారు.

ఖీ మోకా ప్రతాప్‌
http://www.visalaandhra.com/literature/article-33661

No comments: